Monday, March 29, 2010

16. ఓ బుల్లి కథ 4 ---- మా తాతయ్య ----

మా తాతయ్య ----

ఏవో పాత టేపులు తిరగేస్తుంటే అమ్మవారి మీద మా అమ్మ పాడిన పాట వినపడింది. మనస్సు ఎక్కడికో వెళ్లి పోయింది. "రాజ రాజేశ్వరి --- దేవి కన్యా కుమారి --- రక్షించు జగదేశ్వరీ ' అని మా తాతయ్య రోజూ తెల్లారు ఝామున లేఛి పాడే పాటలు పద్యాల్లో ఒకటి. తెల్లారకుండా తాతయ్య ఎందుకు ఇలా పాటలు పాడుతారు అని నేనెప్పుడు ప్రశ్నించు కోలేదు. అల్లాగే తెల్లవారుతుంటే కోడి ఎందుకు కూస్తుందో కూడా నాకు తెలియదు.

పాటల తరువాత లేచి నిత్య కృత్యాలు జరిగేవి. ఆయన కాఫీ తాగేవారో లేదో నాకు గుర్తు లేదు గాని 8 గంటల కల్లా ఆఫీసు తెరిచే వారు. ఆ ఊరి ఉత్త రాల సంచి అప్పుడే వచ్చేది. నేను అక్కడ ఉంటె ముద్దర్లు వేయటం నా వంతు. అదేకాదు ఉత్తరాలు చదవలేని వారికి చదివి వినిపించటం, సమాధానం వ్రాయడం నా వంతు.

మా తాతయ్య నెప్పల్లి అనే పల్లెటూరికి కరణం గారు, పోస్ట్ మాస్టారు గూడాను. పోస్ట్ జవాను ఉత్తరాలు వూర్లో ఇవ్వటానికి వెళ్ళగానే మా కార్యక్రమం మొదలయ్యేది. సామాన్యంగా ఎవరింటిలోనో పిల్లలకి అక్షరాభ్యాసం చెయ్యటమో , శుభ కార్యాలు అవుతుంటే దీవించ టానికో వెళ్ళేవాళ్ళం. నాకు అక్షరాభ్యాసంకి వెళ్ళటం చాలా ఇష్టం. కొత్త పలకా బలపం వచ్చేవి. తాతయ్య చేత్తో అక్షరాలు దిద్దిన వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారో. ఆ తరువాత ఇంటికి రావడం భోజనం చెయ్యటం విశ్రాంతి. భోజనాలయిన తర్వాత మా అమ్మమ్మ తీరికగా చూరులోనించి పాత ఉత్తరాలు తీసి ప్రతి మాట కూడబలుక్కుంటూ మధ్యాహ్నం ఎండలో పెరటి గుమ్మం దగ్గర చదువు కుంటూ కూర్చుంటుంది. రోజూ అందర్నీ తలుచు కోవటం ఆవిడ కదో తృప్తి.

సరిగ్గా 3 గంటలకి ఆఫీసు తెరుస్తాము. పోస్ట్ బాక్సు లొ ఉన్న ఉత్త రాలు తీసి ముద్దర వెయ్యటం, టపా సంచీ కట్టి బెజావాడ బస్సు దగ్గరకి పంపించటం. ఎవరో ఓకరు వస్తూ పోతూ వుంటారు. దాస్తా వేజులు వ్రాయటం దగ్గరనుండి వంట్లో బాగుండక పోవటం వరకూ మాట్లాడు కుంటారు. మా తాతయ్య దగ్గర వస్తు గుణ దీపిక అనే పుస్తకం ఉండేది. ఏకూరగాయలు తింటే ఏబాధలు పోతయ్యో చూసి చెప్పే వాళ్ళు. వాము వాటరు తోటి కూరగాయల చిట్కాల తోటి బాధలు తగ్గక పోతే ఆచార్లు గారు ఉన్నారుగా గుళిక లివ్వటానికి.

సాయంత్రం మశాయిదు కి వెళ్ళేవాళ్ళు. పొలాలు అమ్మకాలు జరిగినా, హద్దులలో పోట్లాటలు వచ్చినా గొలుసులు తీసుకుని వెళ్లి కొలిచి పోట్లాటలు సద్దేవారు. ఊళ్ళో ఉన్న పొలాలు ఎవరివో వాటి సరిహద్దులు ఏమిటో తాతయ్యకి బాగా తెలుసు ఆ ఊరుకి కరణం గారు కదా. నేను గ్రమఫోనే పెట్టుకుని "కొరీ భజింతుని గోవిందుని మది " పాట మళ్ళా మళ్ళా వింటూ ఉండే వాణ్ని. అదేమిటో గమ్మత్తు గా ఉండేది రికార్డ్ మీద సూది తిరుగు తుంటే పాట వచ్చేది.

నాకు బాగా నచ్చేవి పొలాల రిజిస్టర్ కి కంకిపాడు వెళ్ళితే సాయంత్రం వచ్చే మిఠాయి సున్ని ఉండలు. నాకు ఇంకా బాగా నచ్చేవి పక్కింటి దాక్షాయణి భోషాణం లోనించి తీసి నాకు పెట్టే అరిసలు లడ్డూలు.సాయంత్రం స్నానం చేసి దాక్షాయణి నేను వెళ్లి ఆంజనేయ స్వామీ గుడిలో దీపం పెట్టి వచ్చేవాళ్ళం. రాత్రి బుడ్డి దీపం దగ్గర కాసేపు చదువు కోవటం భోజనం పడక. దాక్షాయణి ఏమి చేస్తుంటుందో ఇప్పుడు.

ఆ తరువాత తాతయ్య కి వంశ పారం పర్యంగా వచ్చే కరిణీకం పోయింది. ఆ వూళ్ళో ఎవరి పొలాలు ఎవరివో అనే గుర్తింపు ఒక్కసారి పోయింది. బాధ్యతగా తగాదాలు తీర్చే పెద్దతనం మూగ బోయింది. అమ్మమ్మ చని పోయింది. ఆతరువాత వయసు మూలాన పోస్ట్ ఆఫీసు ఉద్యోగం కూడా పోయింది. ఆయన గూడా చని పోయారు తొంభై నాలుగు ఏళ్ళకి. కానీ మా తాతయ్య పాడిన పాటలు పద్యాలు అలా మనస్సులో నిలిచి పోయి మా మా గమ్యాల వేపు నడిపిస్తూ ఉంటాయి.

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కుంటూ నిశ్శబ్దంగ తమ పని తాము చేసుకుంటూ పోతూ పరులకి చేయూత నిచ్చే తాతయ్య లాంటి వాళ్ళు మన జీవితం లో ఎందరో కనిపిస్తారు. వారందరినీ తలుచుకుని నమస్కరించటానికే ఈ రచన.

Monday, March 22, 2010

15. ఓ బుల్లి కథ 3 ---- మనోవేదన ----

మనోవేదన -----

@రాజ రాజేశ్వరీ దేవి గారికి నమస్కారములు. నేను కష్టపడి పోస్ట్ వ్రాసి దానికి మీ స్పందన అడిగాను. బాగుందో లేదో చెప్తే పబ్లిష్ చేద్దామని. కాని ఒక రోజు వేచి చూసినా మీ అభిప్రాయం రాలేదు. వ్రాసిన తరువాత ఇంటర్నెట్ లో పెట్టకుండా ఉండలేము. అప్పటికీ ఒక రోజు మీ అభిప్రాయం కోసం ఆగాను. ఒక రోజు అంటే 24 గంటలు. అంటే 24 X 60 నిమిషాలు. అంటే 24x 60 x 60 సెకండులు. అన్ని సార్లు నా చేతి వేలితో మీ లేఖ కోసం మౌస్ ను నొక్కట మైనది . పాపం అది ఎంత బాధ పడినదో కదా. ఇంకా ఆగ లేక బ్లాగ్ లో పోస్ట్ చేసే శాను.

ఆ మర్నాడు గూడా మీ నుండి జవాబు రాలేదు. ఇలా ఎందు కయిందా అబ్బా అని నేను మా ఆవిడ మీటింగ్ పెట్టుకుని విచారించాము. బహుశ fedex లో నిమ్మకాయ, కారప్పూస పంపలేదని అలిగారేమో అని, నా బాధ చూడలేక మా ఆవిడ పిండి కలప టానికి సిద్ధ మయినది . 'బాక్స్ మీద అడ్రస్ రాసి రెడీ చెయ్యండి కారప్పూస వేసి పంపించేద్దాము' అని అన్నది. తీరా చూస్తే నా దగ్గర మీ అడ్రస్ లేదు. గూగుల్ వాళ్ళు ఈమెయిలు తో పార్సిల్ పంపటం ఇంకా మొదలు పెట్టలేదు. అందుకని కారప్పూస చెయ్యటం మాను కున్నాము. ఇది లంచము అనుకోకుండా ఆనరోరియము అనుకుని వెంటనే మీ అడ్రస్ పంపండి. మాకోసమే మేము ఎప్పుడూ చిరు తిండ్లు చేసు కొము. నేను గుప్పిట్లతో తింటానని మా ఆవిడ బాధ. ఆరోగ్యమునకు మంచిది కాదు కదా.

నాబ్లాగ్ లు చదివే వారు మీరొక్కరే. మీరు చదివి చెప్పక పోతే మా ఆవిడ చదవాల సొస్తుంది. అది ఆవిడ బాధ. నేను కంప్యూటర్ ముందర కూర్చుని పని చెయ్యక పోతే నేను ఆరుబయట చలిలో బొగ్గుల కుంపటి మీద వంట చెయ్యల్సో స్తుంది. దానినే నాగరికంగా గ్రిల్ అంటారు. అది నా బాధ. కనుక మీరే మా అందరికోసం నా పోస్టు లు చదివి బాగున్నాయని చెప్పండి. విని సంతోషించి ఇంకా కొన్ని నా బుల్లి కథలు వ్రాస్తాను. కష్టే ఫలి అంటారుకదా ఎప్పుడో కృషి ఫలిస్తుంది. మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటా మరి.

Wednesday, March 10, 2010

14. ఓ బుల్లి కథ 2 ---- నల భీముడు ----

నల భీముడు ----

కౌంటర్ మీద దాన్ని చూడగానే అనుకున్నాను ఏదో విశేషం ఉందని. కారప్పూస కోసం పిండి కలిపెసింది ట. సంవత్సరం బట్టి పెసరపప్పు తో చెయ్య కుండ ఏదోవిధంగా అడ్డుకున్నాను. మా ఇంటో రూల్ ప్రకారం ఆవిడ పిండి కలిపితే నేను కారప్పూస వేయించాలి. అది నా బాధ. ఆవిడ అంటే ఎవరో కాదు మా ఆవిడే. నాకు కొంచెం కోపంగా ఉన్నప్పుడు ఆవిడ అంటాను.

క్రిందటి సంవత్సరం మూడు నెలలు కష్టపడి కారప్పూసకి ఒక ఫార్ముల తాయారు చేసాం. ఒక కప్పు చొప్పున శనగ పిండి, బియ్యప్పిండి అరకప్పు మినపపిండి, అరగటానికి జీలకర్ర వాము మెత్తటి పిండి రెండు స్పూనులు. దానిలో స్పూన్ కారం స్పూన్ ఉప్పు. ఉప్పులేని బట్టర్ స్టిక్ లో సగం . ఒక కప్పు నీళ్ళు పోసి పిండి కలపటం, కారప్పూస చేసాం, రుచి కమ్మగా ఉంది. ఇంక ఇదే పద్ధతి అనుకున్నాము. కారప్పూస మీద నా మార్కు పడిపోయింది. కాని కొందరికి అది ఇష్టం ఉండదు. అసూయ. దానిని ఎలా మార్చాలా అని ప్రయత్నం. ఏదో విధంగా తన మార్కు వెయ్యాలి. నా పేరు రాగూడదు.

నాకు దీని మీద తగువు పెట్టు కోవటం ఇష్టం లేదు. ఇంకోవిషయం మూలాన మూడురోజులబట్టి కోప గృహం (మా ఇంటో అది ఒక గది) లో పడుకున్నాక ఇవాళే మాటలు కలుపు తున్నాను.

సరే కారప్పూస చెయ్యటం మొదలు పెట్టాము. గొట్టం లో నుండి బుంది లాగ నూనెలో పడుతున్నాయి. పిండి లో జిగురు తక్కువయ్యి ఇల్లా వచ్చాయని ఆవిడే గ్రహించింది. పిండి లో ఒక అర కప్పు మినపపిండి వేసి కలిపింది. ఈ తడవ నూనెలో చక్రాలు లాగ వచ్చాయి. రుచి చుస్తే నా కెందుకో చప్పగా ఉన్న ట్టు అనిపించి. కారం ఉప్పు వేస్తె బాగుంటుంది అన్నాను. అవి వెయ్యటం జరిగింది. నూనెలో వేగిన తరువాత చూడటానికి బాగానే ఉన్నాయి కాని ఉప్పెక్కువయ్యింది. అంతా పారేసి మళ్ళా మొదలెడుదాము అన్నాను. సరిఅయిన స్పందన రాలేదు. ఉప్పు లేక పోయినా తినచ్చు కానీ, ఎక్కువ అయితే తినటం చాలా కష్టం. ఈ తడవ పావు కప్పు మినపపిండి వేసి కలిపి కార్యం ముగించాము. ఇంకా రుచి చూడ దలుచు కోలేదు. పళ్ళెం లో మూడు రకాల కారప్పూస ఉంది, బూంది లాంటిది, ఉప్పగా ఉన్నది, రుచి చూడనిది.

నా మాట విననందుకు చాలా కోపం వచ్చింది. చేసిన కారప్పూస చక్రాలన్నీ కచ్చగా చేత్తో నలిపేసి కలిపేశాను. ఇంటికి పది మందిని పిలిచి పెట్టేస్తే అయి పోతుంది. ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తూ నాలుగు ముక్కలు నోట్లో వేసుకున్నాను. వావ్ బ్రహ్మాండం గ ఉంది. ఇంక ఎవర్ని పిలవాల్సిన అవసరం లేదు. ఎల్లా చేసినా బ్రహ్మాండం గ వస్తాయి. ఈ నలభీముడికి అడ్డు లేదు.