Monday, October 25, 2021

179 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 1 (Prasnopanishad )

ఈ ప్రశ్నోపనిషత్ , అధర్వణ వేదము  నుండి గ్రహించ బడినది. అధర్వణ వేదములో మూడు ముఖ్య ఉపనిషత్ లు ఉన్నాయి. అవి  ముండక, ప్రశ్న, మాండూక్య.  అందుకని అధర్వణవేద శాంతి మంత్రం ఈ మూడింటికీ వర్తిస్తుంది.

శాంతి మంత్రం:

ఓం భద్రం కర్ణేభిః  శృణుయామ దేవా:  :   మా చెవులతో మంచి మాటలు  వినుగాక 

భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:   :   బుద్ధితో అర్ధం చేసుకునేటట్లు చేయి 

స్థిరై రంగైస్తుష్టువాగంసస్తనూభిః  :  దేవతలని అనేక సూక్తుల ద్వారా ప్రార్ధించనీ 

వ్యశేమ దేవహితం యుదాయుః  : దేవుడిచ్చిన పూర్ణాయుష్షుని అనుభవించనీ 

స్వస్తి న  ఇంద్రో  వృద్ధశ్రవాః  :  ఇంద్రుడు మాకు మేలు చేయు గాక 

స్వస్తినః  పూషా  విశ్వవేదా :     :   ఈశ్వరుడిని అర్ధం చేసుకునేలా బుద్ధి ప్రకాశం చేయి 

స్వస్తి నస్తార్ క్ష్యో  అరిష్టవేమి: :  నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆటంకం లేకుండా చేయి 

స్వస్తి నో బృహస్పతి ర్దధాతు  : నా బుద్ధిని పదును చేసి అన్నీ  అర్ద్మమయ్యేలా చెయ్యి 

ఓం శాంతి: శాంతి: శాంతి:  : ఆది దైవిక , ఆది భౌతిక , ఆధ్యాత్మిక  ఆటంకాలని తొలగించు 

ఓ దేవతలారా మా చెవులతో శుభప్రాయమైనవి విని, కళ్ళతో శుభప్రాయమైనవి చూస్తూ, వాటిని అర్ధం చేసుకునేలా బుద్దిని ప్రసాదించి, మమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యముతో ఉంచి, ఆపదలలో నుండి రక్షిస్తూ, మా ఈ ఆధ్యాత్మిక  జీవితాన్నీఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళండి.

జీవితంలో మనకు తెలియని సంగతులు తెలుసుకోవాలంటే మనకు వాటిని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి తెలుసుకోవాలనే మన ప్రయత్నమూ కావాలి. వీటన్నింటికన్నా ముందర మనకి ఎవరన్నా చెబితే అర్ధం చేసుకునే శక్తి ఉండాలి. దీనితోపాటు ఆరోగ్యం సరీగ్గా ఉండాలి. మన ప్రయత్నాలకు అడ్డంకులు రాకుండా ఉండాలి. వీటిలో మనం చేసే ప్రయత్నం తప్ప మిగతావన్నీ ఇతరుల మీద ఆధారపడి నవే. ఈ ప్రపంచంలో మన మొకళ్ళమే చేయగలిగినవి చాలా తక్కువ. అది ఎప్పుడూ మనం గ్రహించి ఉండాలి.

ఈ ప్రశ్నోపనిషత్ లో  ఆరుగురు చదువుకున్న  శ్రోత్రియులు ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు. 

తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందని తెలుస్తోంది గానీ, తాను చెబితే వాళ్ళకి  గ్రహించగల శక్తి  ఉన్నదో లేదో గురువుగారికి సందేహంగా ఉంది. నాకు ఇక్కడ "శుభోదయం" సినీమా, దానిలో హీరో గుర్తుకు వస్తున్నారు. 

IIT లలో చదవాలని చాలామందికి కోరిక ఉంటుంది. పెద్ద ఉద్యోగాలూ పెద్ద పదవులూ వాటితో వచ్చే సంపద అందరికీ ఇష్టం. కోరిక మాత్రమే IIT ప్రవేశానికి అర్హత కాదు గదా, IIT వాళ్ళకి వీళ్ళు పాఠాలు గ్రహించ కలిగే శక్తి  ఉన్నదో లేదో తెలియాలి కదా. అందుకే ప్రవేశ పరీక్షలు పెడతారు. 

అందుకనే గురువుగారు " అబ్బాయిలూ మీకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నది సంతోషం. మీరు ఒక సంవత్సరం పాటు సుఖాలకి అతీతంగా ఆశ్రమ క్రమశిక్షణలో నా దగ్గర ఉండి శిష్యరికం చేయండి. అప్పుడు మీరడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే నాకు చెప్పాలని అనిపిస్తే మీకు తప్పకుండా చెబుతాను " అంటాడు. 

గురువుగారి పేరు  పిప్పలాద మహర్షి ,  శిష్యుల ఆరుగురి పేర్లు , సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన. 

అమెరికా లో పేరుపెట్టేవిధానం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లు,  ఇక్కడి నుండే నేర్చుకున్నారే మో  !.

సంవత్సరం అయిపొయింది గురువుగారికి శిష్యుల మీద నమ్మకం కలిగి వారి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఉపక్రమిస్తారు.

వచ్చే పోస్టుల్లో గురు శిష్యుల సంవాదం గురించి తెలుసుకుందాము.

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Prasnopanishad is one of the three major Upanishads taken from Atharva Veda. The other two being
Mundka and Mandukya Upanishads.

Six students of Vedanta reached the ashram of Pippalada Maharshi and respectfully requested him to shed light on some of their doubts in Vedanta, the Hindu philosophy. The Maharshi was not able to assess the ability of the students to grasp the subject. So he wanted them to stay in his Ashram for a period of one year following all the rules and regulations of the Ashram. After that, he will try to answer their questions if he knows the answers. The students agreed to it and spent one year in the Maharshi Ashram under strict controls of the Ashram. 

Prasnopanishad is the documentation of the question answer session between teacher and students.

Monday, October 11, 2021

178 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-3 (Mundakopanishad )

యజ్ఞ యాగాదులు క్రమం తప్పకుండా చేసి మంచి గృహస్థు అని పేరుతెచ్చుకున్న శౌనికుడు, మహా ఋషి బ్రహ్మజ్ఞాని అయిన అంగీరసుని ఆశ్రమానికి వచ్చి గురువుగారిని "ఏవి నేర్చుకుంటే ఇంకా ఏవీ నేర్చుకోవక్కరలేదు?" అని అడుగుతాడు.

అందుకు గురువుగారు "విద్యలు రెండు రకాలు అవి పరా, అపరా " అని చెబుతారు.  ప్రతిఫలాపేక్షతో చదివి చేసిన కర్మలన్నీ అపరా విద్యలు. వాటిని జిజ్ఞాసతో చేస్తే పుణ్యఫలం కలుగుతుంది గానీ అది అశాశ్వితము, పుణ్యఫలం కరిగి పోయిన వెంటనే పుణ్యలోకాలనుండి క్రిందకు దిగి వచ్చుట తధ్యము." అని చెబుతారు. 

ఈ జగత్ సృష్టించినప్పుడు , బ్రహ్మ తన సృష్టి అన్నిటిలోను తన "అంశ " ఉంచటం జరిగింది. అందుకే "అహం బ్రహ్మ" అని తెలుసుకోవాలి. నీలో ఉన్న ఆ బ్రహ్మ రూపాన్ని తెలుసుకుని దాన్ని ఆరాధిస్తే దానికన్నా జీవితంలో కావలసినవి ఏవీ ఉండవు. జీవితమంతా సత్ చిత్ ఆనందంతో గడుపుతావు అని గురువుగారు చెబుతారు.

ప్రకాశవంతమైన అనంతమైన బ్రహ్మ నీ హృదయంలో నెలకొని ఉన్నది. దానిలో శ్వాస పీల్చేవి రెప్పలార్పేవి అన్నీ ప్రతిష్ఠమై ఉన్నాయి. దానిని గురించి తెలుసుకొనుటయే శ్రేష్టమైన పరావిద్య.(2-2-1)

మనకున్న పరిజ్ఞానంతో మనలోని  ఆత్మ ఉన్నదని గ్రహించవచ్చు గానీ చూడలేము తాకలేము. ఉదాహరణకి పగలు పూట ఆకాశంలో నక్షత్రాలు ఉన్నా చూడలేము కదా . 

ఇంకొక ఉదాహరణ మనము చూసే "వెలుగు". మనము ఒక తలుపు తెరుచుకొని ఒక గదిలోకి వెళ్ళాము అనుకోండి. గదిలో ఏమున్నాయి అంటే ఏమి చెబుతాము ? మనకు కనపడేవి కుర్చీ, బల్ల, పుస్తకం, కలం అని చెబుతాము. అవి మనకు కనపడేవి, తాకితే అందేవి. తలుపు మూసేసి గదిలో ఏమున్నాయో చెప్పండి. ఏవీ కనపడవు. మొదట మనకి కనపడటానికి కారణం తరువాత కనపడక పోవటానికి కారణం "వెలుగు". ఈ వెలుగుని మనం చూడలేము, పట్టుకోలేము, వర్ణించలేము. అందుకే గదిలో మనం గుర్తించిన వాటిలో అదిలేదు. అసలు మనకి అది మనకు తెలుసనుకుంటాము గానీ తెలియదు (అతీతము ).
 
వెలుగులాగే మనలో ఉన్న, మన ఉనికికి కారణమయిన జీవాత్మని మనము చూడలేము వర్ణించలేము పట్టుకోలేము. మనని మనం ఎల్లా చూడలేమో మనలో ఉన్నజీవాత్మని గూడా మనము చూడలేము. అది ఒక అనుభూతి. మనకి మనం చూడటానికి ఉపయోగపడే అద్దం లాంటి పరికరం మనలోని జీవాత్మను చూడటానికి లేదు. (3-1-8)

అందుకే ఉపనిషత్  చెబుతోంది;  ఉపనిషత్తులు అందించిన ధనస్సుతో నీ ఉపాసనల ప్రభావముచే తీక్షణమైన బాణాన్ని బ్రహ్మచింతనతో ఎక్కుపెట్టి, నీ గమ్యం బ్రహ్మని చేరు. పరమాత్మే లక్ష్యంగా ఓంకార మంత్రం జపిస్తూ పరమాత్మతో మమేకమైపో. (2-2-4,2-2-5)

సకలజీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని ఎవరు గ్రహిస్తారో అతను మితభాషిగా ఉండి ఆత్మతోనే విహరిస్తూ ఆనందం పొందుతాడు. అన్ని కర్మలూ చేసి ఆదర్శంగా ఉన్న ఇతడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. (3-1-4)

జీవితంలో సత్యవాదులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. (3-1-6)
మన నోట్ల మీద మూడు సింహాల తో ఉండే  "సత్యమేవ జయతే" ఈ ముండకోపనిషత్ లోనుండి తీసుకోవటం జరిగింది. 

మనలో ఆత్మని  కనుగొనటానికి ఒక చిన్న పరిశోధన చెయ్యవచ్చు. మనకేమీ కనపడకుండా కళ్ళు మూసేసుకుందాము, ఏమీ వినపడకుండా చెవులు మూసేసుకుందాము, మన జ్ఞానేంద్రియాలు పని చెయ్యకుండా (తెలియకుండా) చూసుకుందాము, చివరికి మిగిలిన మన మనస్సుని ఎక్కడికీ పోకుండా అదుపులో పెట్టుకుందాము, మనకు తెలిసినంత వరకూ మనలో చివరికి మిగిలింది ఆత్మ ఏ కదా మనము చూడగలమా ? అనుభూతి పొందగలమా ? జ్ఞానులు మాత్రమే దానిని చూడగలుగు తారని (1-1-6) మంత్రం చెబుతోంది.

మనం ఆత్మానుభూతి పొందాలంటే, మనము సత్యవాదులమై , సక్రమమైన మార్గంలో నడుస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు గారు సరిఅయిన మార్గం చూపించాలి. (1-2-11,1-2-12,1-2-13)

నా మాట:

వేదాంత భాషలో,
పరమాత్మ అంశ జీవాత్మ భౌతిక శరీరంలో ప్రవేశించి మన ఆటలు చూస్తూ ఉండి,  సమయం రాగానే మన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళి పోతుంది. మన జీవిత కాలంలో ఆడిన ఆటల సారాంశం మనం జీవితంలో చేసిన పుణ్య పాపాలు. ఆ పుణ్య పాపాలను బట్టి మన పునర్జన్మలు ఉంటాయి. 
మన జీవిత ఆటలు మనము అనుసరించిన పంచ మహా యజ్ఞాలు అయితే, మన జీవాత్మతో మనము మమేకమై జీవిస్తే, పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. 

1. మనకు ప్రాణమిచ్చి సర్వేంద్రియాలచేత పనిచేయించేది మనలో ఉన్న ఆత్మ. అదే జీవాత్మ అదే పరమాత్మ అంశ. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే.
2. ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలోనూ ఉండేది అదే పరమాత్మ అంశ.
3. మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించ గలిగితే , మనచుట్టూతా ఉన్న అందరిలోనూ ఆ పరమాత్మను చూడగలుగుతాము. 
4. మనలో (జీవుల్లో) ఎక్కువ తక్కువలు లేవు అందరూ ఒకటే అని తెలుసుకుంటాము.

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

This Mundaka Upanishad is a conversation between a student Sounika and a Guru Angeerasa.

A well-known famous family man named Sounika approaches a Brahma Rushi (teacher) Angeerasa and questions him "After learning which there is nothing to learn anymore".

Sounika is well-known in the community who does all his duties including the fire sacrifices as prescribed in the vedas.

Rushi Angeerasa has an ashram and teaches Vedic scriptures to his students. Angeerasa is in the lineage of people who learned Brahma vidya (creation of the world).

Vishnu created Brahma and asked him to create the world. Brahma created the world as we see today and told all the secrets to his eldest son. In those days, knowledge passed through generations by reciting and remembering scriptures. So Brahma Vidya passed through generations and finally reached Rushi Angeerasa.

Angeerasa tells Sounika that there are two types of knowledge one is para vidya and the other is apara vidya. Everything you do for getting rewarded is Apara Vidya. Whatever you learned and practiced until now is Apara vidya, by knowing and performing rituals as described in it you will not be seeing the end of the tunnel. Only Para vidya, the knowledge of God in you, will lead to salvation. And that is the Vidya (Brahma Vidya) you should learn.

When Brahma created the world, he put a piece of him in all things he created. That god in you is the one which makes you alive until it decides to leave the body. So what Angeerasa is telling Sounika is to realize the god in you through meditation, by that realization you will be with god all the time and the day to day things will not affect you.

Angeerasa teaches Sounika how to gain that knowledge, Brahma vidya, by concentrating and meditating on "OM".

The following Video in English of help in understanding the Upanishad.
ముండక ఉపనిషత్


ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని  ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.



*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 1  (2-2-1):

ఆవి: సం ని హితం గుహాచరం నామ : ప్రకాశవంతమైన చాలాదగ్గరగా హృదయమనే గుహలో సంచరించేదయిన

మహత్పదమత్రైతత్ సమర్పితమ్ : అనంతమైన బ్రహ్మలో ఇవన్నీ నెలకొని ఉన్నాయి

ఏజత్ ప్రాణాన్నిమిషచ్చ యదేతత్ జానథ సదసద్వరేణ్యం : చరించేవి జీవమున్నవీ చూడగలిగినవీ మీరందరూ తెలుసుకోండి కనపడేవి కనపడనివి ఉత్తమలక్ష్యం

పరం విజ్ఞానాద్ యద్వరిష్టం ప్రజానామ్ : పరావిద్య అదిశ్రేష్ఠం

ప్రకాశవంతమైన అనంతమైన బ్రహ్మ నీ హృదయంలో నెలకొని ఉన్నది. దానిలో శ్వాస పీల్చేవి రెప్పలార్పేవి అన్నీ ప్రతిష్ఠమై ఉన్నాయి. దానిని గురించి తెలుసుకొనుటయే పరావిద్య శ్రేష్టమైన విద్య అని తెలుసుకోండి.
*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 3  (2-2-3):

ధనుర్గ హీత్వౌ పనిధం మహాస్త్రం : ఉపనిషత్తులు చెప్పే ధనుస్సు మహాస్త్రాన్ని తీసుకుని

శరం హి ఉపాసానిశితం సన్దయీత : ధ్యానంచేసి పదునుచేయబడిన బాణాన్ని సంధించాలి

అయమ్య తద్భావగతేన చేతసా : బ్రహ్మ భావనతో నిండిన మనస్సుతో లోపలికిలాగి

లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి : లక్ష్యాన్ని బ్రహ్మ తెలుసుకో సౌమ్యుడా

సౌమ్యుడా ఉపనిషత్తులు అందించిన ధనస్సుతో నీ ఉపాసనల ప్రభా వముచే తీక్షణమైన బాణాన్ని బ్రహ్మచింతనతో ఎక్కుపెట్టి, నీ గమ్యం బ్రాహ్మని చేరు.

*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 4  (2-2-4):

ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మం తల్లక్ష్య ముచ్యతే : ఓం కార మంత్రం ధనుస్సు ఆత్మయే బాణం పరమాత్మే ఆ లక్ష్యం

అప్రమత్తే న వేద్ధవ్యం శరవత్థన్మయో భవేత్ : ఏమరుపాటులేని మనసుతో ఛేదించాలి బాణం లాగా ఆ లక్ష్యంతో ఒకటైపోవాలి

పరమాత్మే లక్ష్యంగా ఓంకార మంత్రం జపిస్తూ పరమాత్మతో మమేకమైపోవాలి.
*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 5:

యాస్మిన్ ద్యౌ: పృథివీ చాన్తరిక్షమోతం :  పరమాత్మ అనే దారంలో భూలోకం భువర్లోకం 

మనః సహ ప్రాణైశ్చసర్వై:  :  సువర్లోకం నెలకొని ఉన్నాయి మనసు ప్రాణాలు కూడా అన్నీ 

తమేవైకం జానథ ఆత్మానమ్ అన్యా  : ఆ పరమాత్మ జీవాత్మ రెండూ ఒకటేనని తెలుసుకోండి 

వాచోవిముఞ్చథా అమృతస్యైష సేతు:    : వేదాంతం కాని వాటినన్నిటినీ వదిలిపెట్టండి ఇది అమరత్వానికి వారధి 

పరమాత్మ అనే దారంలో లోకాలన్నీ నెలకొని ఉన్నాయి.  పరమాత్మ జీవాత్మ ఒకటే. అమరత్వానికి  వేదాంతం కాని వాటిని వదిలి పెట్టండి.
*********************************************************
మూడవ ముండకం ప్రధమ ఖండం మంత్రం 4 (3-1-4):

ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి : ఈ పరమాత్మను సకల జీవులలో ప్రకాశిస్తున్నది

విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ : ఏవివేకి గ్రహించిన వ్యక్తి మితభాషి అవుతాడు

ఆత్మక్రీడ ఆత్మరతి: క్రియావాన్ : ఆత్మలోనే రమిస్తాడు ఆత్మలోనే ఆనందిస్తాడు కర్మలను చేసేవాడు

ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ: : ఇతను ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడు

సకలజీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని ఎవరు గ్రహిస్తారో అతను మితభాషిగా ఉండి ఆత్మతోనే విహరిస్తూ ఆనందం పొందుతాడు. అన్ని కర్మలూ చేసి ఆదర్శంగా ఉన్న ఇతడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. 
*********************************************************

మూడవ ముండకం ప్రధమ  ఖండం మంత్రం 6  (3-1-6):

సత్యమేవ జయతే నానృతం : సత్యం మాత్రమే జయిస్తుంది అసత్యంకాదు 

సత్యేన పన్దా  వితతో దేవయానః : సత్యం చేత శుక్లగతి ఏర్పడి వుంది 

యేనాక్రమన్తి  ఋషయో హి ఆప్తకామా : దానిద్వారా కోరికలు తీరినవారు సగుణ బ్రహ్మ ఉపాసకులు వెళ్తారు 

యత్ర తత్సత్యస్య  పరమం నిధానమ్ : ఆ బ్రహ్మలోకం సత్యం యొక్క శ్రేష్ఠమైన మోక్ష మనే నిధి 

సత్యవాదులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. సత్యమే పలికే సగుణ బ్రహ్మ ఉపాసకులు, శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మలోకంలో శ్రేష్టమైన మోక్ష మనే నిధిని కనుగొంటారు. 

Monday, October 4, 2021

177 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-2 (Mundakopanishad )

విష్ణుమూర్తి బ్రహ్మని సృష్టించి తనని ప్రపంచమును సృష్టించమని చెప్తాడు. బ్రహ్మ "జగత్" ని సృష్టించటం జరిగింది(పరమాత్మ). సృష్టించటమే కాదు దానిని "ఆటోమేట్" కూడా చేశాడు (అది పూర్ణం దాని నుండి వచ్చిన ఇది పూర్ణం). అంతేకాదు తాను సృష్టించిన ప్రతిదానిలోనూ తన "అంశ" ఉంచటం జరిగింది (జీవాత్మ ). జీవు లన్నిటిలో ఉండే జీవాత్మని బ్రహ్మన్  (Brahman ) అనికూడా అంటారు.

బ్రహ్మ తన సృష్టి రహశ్యాలన్నీ మొదట తన జేష్ఠ పుత్రుడు అధర్వునికి చెప్పాడు. అప్పటినుండీ తరతరాలుగా ఆ రహస్యం ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెంది అంగీరసుని వరకూ చేరింది. 

ఈ ఉపనిషత్ లో ముఖ్యభాగం గురుశిష్యుల సంవాదాము. శిష్యుడు గృహస్థు మహాశాలి శౌనికునికి,  గురువుగారు బ్రహ్మజ్ఞాని అంగీరసునికి  మధ్యన అంగీరసుని ఆశ్రమంలో జరిగిన సంవాదన.

జీవితమంతా శాస్త్ర ప్రకారం నిత్యకర్మలూ యజ్ఞ యాగాదులూ చేస్తూ మేటి గృహస్థుడు గా పేరుబడ్డ శౌనికుడు

 "ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోటానికి ఇంకేమీ ఉండదు? అంతా తెలుకున్నట్లు అవుతుంది? " 

అని గురువుగారైన బ్రహ్మజ్ఞాని అంగీరసుని అడుగుతాడు. దానికి గురువుగారు సమాధానం చెబుతారు.

విద్యలు రెండు రకాలు అపరా విద్యలు, పరా విద్యలు. అపరా విద్య లన్నీ బయట ప్రపంచానికి సంబంధించినవి. బయట ప్రపంచానికి సంబంధించి, పంచేంద్రియాల కోరికలు తీర్చటానికి ఫలాపేక్షతో నేర్చుకున్న విద్యలన్నీ అపరా విద్యల కిందకి వస్తాయి. ఆత్మకు సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం నేర్చుకున్నది పరా విద్య.

ఫలాపేక్షతో చేసిన యజ్ఞ యాగాదులు మొదలయినవి అపరా విద్యలు. వీటి వలన ఫలితం  తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

బ్రహ్మ జ్ఞాన విద్య పరా విద్య. ఫలా పేక్ష లేకుండా చేసిన పరా విద్య తో కలిగే ఫలితం శాశ్వితం. ఇదే మోక్ష మార్గం. ఇంతవరకూ అపరా విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వారు అదే జిజ్ఞాసతో పరా  విద్యలు అభ్యసిస్తే/ఆచరిస్తే పర త్త్వాన్ని పొంది మోక్షము సాధిస్తారు. 

*************************

మొదటి ముండకం మొదటి ఖండం మంత్రం 2 (1-1-2):

అథర్వ ణే   యాం ప్రవదేత బ్రహ్మా : బ్రహ్మ దేవుడు దేనిని అథర్వునికి చెప్పాడో 

అథర్వా  తాం పురోవాచాంగిరే  బ్రహ్మవిద్యమ్ ఆ బ్రహ్మవిద్యను అథర్వుడు పూర్వం అంగిరునుకి చెప్పాడు 

స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ : అంగిరుడు భారద్వాజ గోత్రమునకు చెందిన సత్యవాహినికి చెప్పాడు 

భరద్వాజో అంగీరసే పరవరామ్ : భరద్వాజుడు అంగిరసునికి బోధించాడు 

లోకం సృష్టించిన బ్రహ్మ దేవుడు ఆ రహస్యాలన్నీ తన పెద్ద కుమారుడు అథర్వునికి చెప్పాడు. అధర్వుడు అంగిరునికి చెప్పాడు. అంగిరుడు భరద్వాజ గోత్రుడైన సత్యవాహినికి చెప్పాడు. భరద్వాజుడు అంగీరసునికి చెప్పాడు.

********************

మొదటి ముండకం రెండవ ఖండం 10వ మంత్రం (1-2-10):

ఇష్టాపూర్తం మన్యమానా  వరిష్టం : అనేక యజ్ఞాలూ అనేక పుణ్యకార్యాలూ ఇవే గొప్పవనుకుంటారు 

నాన్యచ్చ్రేయో వేదయన్తే ప్రమూడా: : తక్కిన శ్రేష్ఠమయినవి తెలిసికొనుటలేదు పరమ మూర్ఖులు 

నాకన్య పృష్టే తే  సుకృతే నుభూత్వా : వారు స్వర్గంలో పైలోకాలు పుణ్యఫలం అనుభవించాక 

ఇమంలోకం హీనతరం వా  విశన్తి  : ఈ భూలోకంలో పుడతారు లేదా ఇంకా హీనమైన లోకాల్లో పుడతారు 

ఫలాపేక్షతో యజ్ఞ యాగాదులు మొదలైయినవి చేసి అవే గొప్ప అనుకుంటారు. వీటి వలన ఫలితం లభిస్తుంది కానీ అది తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

********************

నా మాట:

సంవత్సరాల క్రిందట కమ్యూనికేషన్ చాలావరకు వాక్ (నోటి) ద్వారానే ఉండేది. నోటికీ మనసుకీ ఇంపుగా ఉండి గుర్తు పెట్టుకునే విధంగా ఉండటానికి ఛందో నియమాలు సృష్టించి నోటి మాటలుగా రచనలు చేసేవారు. గురువులు వాటిని ఆశ్రమాల్లో (ఆ నాటి పాఠశాలలు ) శిష్యుల చేత వల్లె వేయించేవారు. ఆ విధంగా తరతరాలుగా వేదాలూ ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి.

కొంత కాలానికి ఉచ్చారణ మూలాధారంగా అక్షరాలూ లిపి తయారు చేశారు. అక్షరాలకు ఉచ్చారణ మూలాధారం అగుటచే మన భాషల లిపి మనము ఉఛ్చరించి నట్లు వ్రాస్తాము (phonetic).

వ్యాసమహర్షి ఆనాటి వాడుకలో నోటిద్వారా ప్రాచుర్యము పొందిన వేదాలు ఉపనిషత్తులు మొదలయినవి సేకరించి వాటిని గ్రంథ రూపంలో తాటాకుల మీద వ్రాయటం జరిగింది. 
వ్యాసుడు అంటే కూర్పరి (composer, compiler  ) అని అర్ధం.

ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.