Showing posts with label Lakkaraju. Show all posts
Showing posts with label Lakkaraju. Show all posts

Monday, February 14, 2022

194 ఓ బుల్లి కథ -- డిన్ టాయ్ ఫంగ్ Din Tai Fung (A Taiwanese Restaurant)

Din Tai Fung restaurant 

ఇవ్వాళ డిన్నర్ చైనీస్ అంటేను నేను రాను ఇంట్లోఉంటాను అని చెప్పాను. ఆరోజే కొత్తింట్లోకి మారాము. నీకు టెలిఫోన్ లేదు ఇంట్లో వైఫై లేదు కనీసం టీవీ కూడా లేదు ఏంచేస్తావు, ఇక్కడ కూర్చునేది అక్కడేకూర్చుందు గాని రమ్మన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రియమైన భార్యవైపు చూస్తే ఆవిడ మొహం తిప్పేసుకుంది, ఆవిడ అప్పటికే తయ్యారు అయ్యి కూర్చుంది. ఇంక తప్పదు వెళ్లాను. సామాన్యంగా చైనీస్ రెస్టరెంట్ లో ఆర్డర్ చేసినవన్నీ మధ్యలో పెట్టి ఎవరికి ఇష్టమయినవి వాళ్ళు తమ ప్లేట్లల్లో వేసుకుని తింటారు. ఊర్కేనే కూర్చోవచ్చులే అనుకున్నాను.

నా ఉద్దేశంలో చైనీస్ రెస్టరెంట్ అంటే, చాప్ సూయీ, ఎగ్ ఫు యంగ్, ఫ్రైడ్ రైస్, ఎగ్ డ్రాప్ సూప్ మొదలయినవి . అక్కడ వాసన భరించటం కొంచెం కష్టం. ఇండియన్ రెస్టరెంట్ అయినా అంతే అనుకోండి కానీ అది మనకు తెలిసిన భరించే వాసన.

రెస్టారెంట్ యూనివర్సిటీ విల్లేజ్ అనే షాపింగ్ సెంటర్ లో ఉంది. తీరా చూస్తే ఆ  చైనీస్ రెస్టరెంట్ మల్టి లెవెల్ పార్కింగ్ లాట్లో ఉంది. జీవితంలో ఎప్పుడూ పార్కింగ్ లాట్లో ఉన్న రెస్టారంట్ చూడలేదు. రోడ్ పక్కన టిఫిన్ తిన్నాను, కాఫీ టీ తాగాను ( అందులో ఒకటి, భోపాల్ ట్రైన్ స్టేషన్ దగ్గర పొద్దున్న ఆరింటికి పరగడుపున పళ్ళు తోముకోకుండా తాగిన టీ ఎంత బాగుందో అది ఇప్పటికీ గుర్తుంది)   కానీ ఇంత వరకూ పార్కింగ్ లాట్ రెస్టరెంట్ లో తినలేదు. 

అక్కడికి వెళ్లేసరికి పెద్ద క్క్యూ. మా కోడలు వెళ్లి రిజర్వేషన్ చేసింది. దాదాపు లోపలకి వెళ్ళటానికి ఒక అరగంట పట్టవచ్చన్నారు. మేము పదిమంది అంత మందికి ముందర రిజర్వేషన్ సౌకర్యం లేదుట.

మా మనవడు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పదార్ధాలు ఎల్లా చేస్తారో చూపెట్టాడు. పై బొమ్మలో ఎడమ వైపున వంటవాళ్లు పదార్ధాలు చెయ్యటం చూడవచ్చు.ఇది తైవానీస్ చైనీస్ రెస్టరెంట్. బహుశ మెన్యు లో తేడా ఉండవచ్చు . దాదాపు ఇరవై మంది అయిదు బల్లల దగ్గర నుంచుని పని చేస్తున్నారు. కజ్జికాయల్లాగా కొన్ని, కుడుములు లాగా కొన్ని చేస్తున్నారు. వాటిని డంప్లింగ్స్ అంటారుట. 

 వీటిని తయారు చేసిన తర్వాత  ఒక చిన్న జల్లెడ లాగా ఉండే ట్రే లో పెడతారు .


ఆ ట్రే లన్నీ ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి అన్నిట్లోకీ నీటి ఆవిరి పంపి ఉడికిస్తారు.

లోపలికి రమ్మని పిలుపు కోసం బయట కూర్చున్నాము. ఇది మిడ్ వింటర్, సియాటిల్ అయినా బయట 30F (-1.1C). చలి. ఇంకో ఫ్లోర్ కి వెళ్లి కొంచెం వెచ్చగా ఉండే చోట కూర్చున్నాము. పిల్లలూ కొందరు పెద్దలూ షాపింగ్ సెంటర్ చూడటానికి వెళ్లారు. ఇది కొంచెం ఖరీదయిన షాపింగ్ సెంటర్ ట. 

ఒక అరగంట తర్వాత లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. ఒక పెద్ద డైనింగ్ హాల్ లో నుండి పెద్ద ఫామిలీ రూమ్ లోకి తీసుకు వెళ్లారు.  రక రకాల డంప్లింగ్స్, తీపి కుడుములు తీసుకు వచ్చి టేబుల్ మధ్యలో పెట్టారు. వచ్చిన పదార్ధాలన్నీ వేగన్. తెచ్చిన కుడుముల్లో రెండు రకాలు నువ్వులు బెల్లం మధ్యలోపెట్టినవి, తీపి రెడీబీన్స్ మధ్యలోపెట్టినవి. చాప్ స్టిక్స్ ఉన్నాయి కానీ నాకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాడటం చేత కాలేదు. నాబోటి వాళ్ళకోసం ఫోర్క్స్ ఉంటే అవి వాడాను. 

Server 

అందరూ వారికి కావాల్సినవి వారు తిన్నారు. నేను చైనీస్ టీ తాగి బీన్స్, ఫ్రైడ్ రైస్, తీపికి రెడ్ బీన్ డంప్లింగ్ తిన్నాను. చెప్పద్దూ అంత రుచికరమైన బీన్స్ నేను ఎప్పుడూ తినలేదు. 


రెడ్ బీన్ డంప్లింగ్ 

తిని, తాగి ఒక గంట తర్వాత ఇంటికి బయలుదేరాము. నేను మొదట దీని గురించి వ్రాద్దామని అనుకోలేదు. కానీ ఈ రెస్టారెంట్ గురించి చదువుతుంటే క్రింది విషయం వెలుగులోకి వచ్చింది.
వ్రాయక తప్పలేదు. నేను ప్రపంచం లో ఉన్న పది మంచి రెస్టారెంట్లల్లో ఒక రెస్టారెంట్ లో భోజనం చేశాను అని గర్వంగా చెప్పుకోవచ్చు.


Named one of the top ten gourmet restaurants in the world by The New York Times.


Tuesday, January 18, 2022

191 ఓ బుల్లి కథ -- ఛూ ఛూ ట్రైన్ --- బర్కిలీ Berkeley

 


Caboose 


మా US వెస్ట్ కోస్ట్ ప్రయాణంలో సియాటిల్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కి మా అమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అదో గంటన్నర ప్లేన్ ప్రయాణం. ఇక్కడ దదాపు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కాకపోతే సూర్యుడు కనపడుతూ ఉంటాడు. మేముండే చోట రిచ్ మండ్ లో బయట నడుస్తూంటే ఆలివ్ చెట్లూ నారింజ చెట్లూ నిమ్మ చెట్లూ, ఇంటి ముందర పెరుగుతూ పేవుమెంట్ మీద కాయలు రాల్చు తున్నాయి. నేను కొందరి పెరట్లో తాడి చెట్లు కూడా చూశాను.

ఈరోజు  ఉష్ణోగ్రత 40F (అంటే 4.4C)  డిగ్రీలు. దగ్గరలో ఉన్న బర్కిలీ లో ఉన్న స్టీమ్ ట్రైన్ ఎక్కు దామని వెళ్ళాము (Tilden Park Steam Train). ఇంజిన్ లో బొగ్గులు వేసి నీళ్లు కాగబెట్టి వచ్చిన ఆవిరితో ఇంజిన్ చక్రాలు తిప్పుతారు. ఆ ఇంజిన్ కి పెట్టెలు తగిలించి దానిలో ప్రయాణీకులిని కూర్చోబెట్టి ఇంకో ఊరుకి  చేర్చుతారు. మా చిన్నప్పుడు ప్రయాణాలన్నీ పెద్ద పెద్ద స్టీమ్ ఇంజిన్ తో నడిచే రైళ్ళల్లో జరిగేవి. ఈ రైలు ప్రయాణానికి ఎంతో ఆనందంతో ఎదురు చూసే వాళ్ళం. ప్రయాణం పూర్తయ్యేసరికి చొక్కాలమీద అంతా  బొగ్గు నలుసులు పేరుకుంటాయి కానీ అప్పట్లో అవి మాకు బాధ పెట్టలేదు. 

ఈ పిల్లల స్టీమ్ ట్రైన్  బర్కిలీ అనే ఊరులో ఉంది( ప్రఖ్యాత బెర్కిలీ యూనివర్సిటీ ఇక్కడే). ఇక్కడ కనపడే ఇళ్ళన్నీ బొమ్మరిల్లు లాగా ఉంటాయి. అవే ఒక్కొక్కటీ మిలియన్ డాలర్స్ పైనే. ఇక్కడకి  వెళ్లాలంటే కొండా కోనల్లో ఒక గంట ప్రయాణించాలి. డ్రైవింగ్ ఎత్తులూ పల్లాలూ. మేము మూడు సార్లు దోవ తప్పాము. దోవ సరి చేసుకోవటం కూడా కష్టమే. థాంక్ గాడ్ మాకు దగ్గరలో  పార్కింగ్ దొరికింది. ప్లాట్ఫారం మీదికి వెళ్ళి టిక్కెట్లు కొనుక్కొని రైలెక్కాము. రైలు ఎక్కటం దిగటం నాలాంటి వాళ్లకి కొంచెం కష్టమే. ఇక్కడ హైస్కూల్ పిల్లలు పనిచేస్తారు. వాళ్ళు ఎక్కటానికి దిగటానికి సహాయం చేస్తారు. 

రైల్ ప్రయాణం 12 నిమిషాలు, కొండమీద అడవిలో తిప్పుతూ చివరికి బయలుదేరిన చోటికి  తీసుకువచ్చి దింపుతారు. మాతో ఉన్న మా మనవరాలు ఇంకోసారి రైల్ ప్రయాణం చేద్దామంది. దానితో పిల్లా పెద్దా (నేను తప్ప) మళ్ళా  టిక్కెట్లు కొనుక్కొని రైలు ఎక్కారు. నేను ప్లాట్ఫార్మ్ మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. రైలు ప్రతి సారీ షుమారు 50 మంది  పిల్లా పాపా తో సగం దాకా నిండుతోంది. 

Berkeley Rose Garden 

ఇంటికి వెళ్ళటానికి క్రిందికి దిగివస్తూ బర్కిలీ "రోజ్ గార్డెన్ " దగ్గర ఆగాము. గులాబీలు ఇంకో రెండు మూడు నెలల్లో "బ్లూమ్" అవుతాయిట. ఈ తోటని చూడటానికి ముచ్చటగా ఒక కొండలోయలో నిర్మించారు. ఇక్కడ చదువుకునే పిల్లలూ పెద్దలూ వచ్చి పోతూ ఉన్నారు. పక్కన టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. 

బుద్ద ప్రార్ధన శాల 

Prayer Wheels

Buddhist Monks
వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర ఉన్న "Gyuto Foundation" వారి "Buddhist Monastery" కి వెళ్ళాము. ఇక్కడ  బౌద్ధ భిక్షువులకి చదువు చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం. పచ్చటి చెట్లతో విశాలమైన ప్రాంగణం ఆకర్షణీయంగా ఉన్నది.అక్కడవున్న ప్రార్ధన శాలలో కాసేపు కూర్చుని ప్రేయర్ చక్రాలు తిప్పి ఇంటికి బయలుదేరాము. ప్రసాదం నారింజ కాయలు ఒక పళ్లెంలో పెట్టి ఉన్నాయి. మేము తీసుకున్నాము.

వస్తూ వస్తూ "Trader Joe " లో ఆగి పిల్లలకి మరునాడు సంక్రాంతి భోగి పళ్ళు పొయ్యటానికి పూలు సామగ్రి కొనుక్కుని ఇంటికి జేరాము.

Thursday, January 13, 2022

190 ఓ బుల్లి కథ -- అదో క్రేజీ బ్రేక్ఫాస్ట్ డే

 


పొద్దున్న తొమ్మిదిన్నరకి అక్కడుండాలి. బయట కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అంటే,
పొద్దున్న ఆరున్నరకే లేచి ప్రయత్నాలు మొదలెట్టాము. ఇక్కడ రెండు మూడు సంగతులు చెప్పాలి. పిల్లలకి వాళ్ళ తలిదండ్రులు వచ్చినప్పుడు కొత్త డిస్కవరీస్ చూపించాలని కోరిక. దీనికి ఎన్నుకున్నది వాళ్ళ కిష్టమయిన రెస్టరెంట్. అమెరికాలో ఓమిక్రాన్ ఉదృతంగా ఉండటంతో రెస్టరెంట్ లోపల కాకుండా బయట కూర్చుని తినటం. మూడవది తినే పదార్ధాలు మా కిష్టమైన విధంగా తయారు చేయించుకోవటం.

మాకు రెస్టోరెంట్ బయట తినటం గురించి తెలుసు. మేము న్యూయార్కులో ఒక గ్రీక్ రెస్టారెంట్ ముందర డేరాలో కూర్చుని తిన్నాము. వాళ్ళు వేడి కోసం హీటర్లు అవీ పెడతారని, మాకు ఫరవా లేదు అనిపించింది. గార్లిక్ తినని వాళ్ళు గ్రీక్ రెస్టారెంట్ కి ఎల్లా వెళ్లారు అనే అనుమానం వస్తే అది పెద్ద గాధ ఇప్పుడు చెప్పలేను కానీ ఒక క్లూ ఇస్తాను "నేచర్స్ కాల్".

మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇంటిదగ్గర తొమ్మిదికి బయలుదేరాలి.  ఎనిమిది గంటలకి రెస్టారెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బయట సీటింగ్ కుదరదని. ఏం చెయ్యాలి ఇప్పుడు ?. నేనయితే వెళ్ళటం మానేద్దాము అనుకున్నాను. కొన్ని కొన్ని చోట్ల మన ఇష్ట ఇష్టాలు కుదరవు. అందుకని గమ్మున ఊరుకున్నాను. వాటెవర్ హప్పెన్స్  విల్ హప్పెన్. 

మేము ఏమీ చెప్పలేదు. బిజినెస్ పోతుందేమో అని అనుకున్నారేమో (మేము 9 మంది ఆయె ) ఎనిమిదిన్నరకి రెస్టారెంట్ నుండి మళ్ళా ఫోన్ వచ్చింది. బయట సీటింగ్ పెడతాము కానీ పదిన్నర కల్లా మీరు వెళ్ళిపోవాలని. మేము సరే అన్నాము.

అనుకున్న సమయానికి రెస్టారెంట్ కి వెళ్ళాము. మీరు పైబొమ్మలో చూస్తున్నారే రెండుకుర్చీలు. అవి తీసేసి పెద్ద బల్లలు రెండు, 10 మంది పట్టేటట్లు కుర్చీలు, వరండాలో వేశారు. పైనుండి వేడి గాలి వచ్చేటట్లు హీటర్ ఉంది. టేబుల్ కి రెండు పక్కలా కింద హీటర్లు పెట్టారు. ప్రతి కుర్చీలోనూ కప్పుకోటానికి జంపాకానలు ఉన్నాయి. నేను కప్పుకున్నాను. మిగతావారు కప్పుకున్నారో లేదో నేను చూడలేదు. ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్డర్ చేసుకోవటం, రావటం తినటం కూడా చక చకా అయిపోయాయి. ఫ్రూట్ బార్ కూడా ఉందిట. పిల్లలు లోపలి వెళ్లి తెచ్చుకున్నారు. నేను వెళ్ళ లేదు, తరువాత డబ్బులు వాయిస్తారని భయం. మా ఆవిడ స్వీడిష్ పాన్కేక్స్ ఆర్డర్ చేసింది. నాకు రుచి చూపిస్తానన్నది కానీ చూపించాలేదు. స్వీడిష్ పాన్కేక్స్ మన రవ్వ దోశలు లాగా ఉంటాయి. మేము ఇదివరకు ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసుకుని తీసుకు వెళ్ళి వాటిని తినే వాళ్ళము. ఏదేశం పోయినా జిహ్వ మారదు .

పక్కన కార్లూ జనం పోతూ ఉంటే, సూర్యుడి కిరణాలు కళ్ళల్లో పడుతూ ఉంటే,రోడ్డుపక్కన మా బ్రేక్ఫాస్ట్, మా కున్న సమయంలో ముగిసింది. బిల్లు ఎంతయిందో తెలియదు, మాలోని కొ త్తగా కస్టమ్ మేడ్ BMW ని జర్మనీ నుంచి తెప్పిచుకున్న కుర్రాడు పే చేశాడు. "సూర్యకిరణాల" ని గుచ్చిపెట్టి వ్రాశాను ఎందుకంటే, అది ఒక అదృష్టం,  సియాటిల్ లో మేమున్న రెండు వారాల్లో సూర్యుణ్ణి చూసింది నాలుగు సర్లే మిగతా రోజులన్నీ రోజంతా వర్షం లేక మబ్బులు. తరువాత నన్ను ఇంట్లో వదిలేసి మిగతా వాళ్ళు పార్కులకు బీచ్ లకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చారు.

నేను ఫోటో పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు దీనికి కారణం ఉంది. ఆదివారం బయట 40F (అంటే 4.4C) పొద్దున్న 10 గంటలు , చలి, నేను లోపల థర్మల్ వేర్ వేసుకున్నాను దానిపైన Columbia Zip కోటు దానిపైన winter coat , దానిపైన వాళ్ళిచ్చిన జంపఖానా, నెత్తిన కుచ్చు టోపీ, నన్ను మీరు చూడలేరు.

Sunday, January 9, 2022

189 ఓ బుల్లి కథ -- లింఫెటిక్ సిస్టం -- Lymphatic System

 

Lymph System - Cleveland Clinic

Lymph Nodes --- Plymouth Hospitals (UK)

మన శరీరంలో ప్రసరణ (circulatory system ) రెండు రకాలుగ జరుగుతుంది. రక్త ప్రసరణ, లింఫ్ ప్రసరణ. రక్త ప్రసరణ అంటే మనకందరికీ తెలుసు. 

మన శరీరం లో లింఫ్ ప్రసరణ రక్త ప్రసరణ కన్నా భిన్నంగా జరుగుతుంది. రక్తప్రసరణలో ఉండే "pump " , గుండె, లేకపోవటంతో లింఫ్, ముందుకు కదలటానికి, లింఫ్ నాళాలకు పక్కనున్న కండరాల సహాయం తీసుకుంటుంది. అందుకని లింఫ్ కదలాలంటే మన కండరాల కదలిక చాలా ముఖ్యము. ఇంకొకటి లింఫ్ నాళాలు గుండె వేపు వెళ్ళే రక్తనాళాల తోటి మాత్రమే కలుస్తాయి. అందుకని గుండెవేపు కదలికలే లింఫ్ ప్రసారానికి ముఖ్యము అవుతాయి. మన పూర్వికులు చెప్పిన, యోగా లో ఉన్న, దీర్ఘ ఉచ్వాస నిశ్వాసలు ఎంత మంచివో ఇప్పుడు అర్ధమవు తుంది. 

ఈ లింప్ శరీరంలోని అన్ని కణాలలోనూ ఉండి, అక్కడ తయారు అయిన చెడు పదార్ధాలను సేకరించి, వాటిని దగ్గరలో దాచి పెట్టి (nodes ), వాటి మలినాల్ని "తెల్ల కణాలు " ద్వారా నిర్వీర్యం చేసి వాటిని శరీరంలో నుండి బయటికి పంపటానికి రక్తంలో కలుపుతుంది. పై బొమ్మలోని "nodes " లో మనకు తెలిసిన గజ్జలు , చంకలను తేలికగా గుర్తించవచ్చు, ఈ nodes మెడ, మోకాలు వెనుక కూడా ఉన్నాయి.

లింఫ్ అంటే "గ్రీక్ " భాషలో "నీళ్ళు " అని అర్ధం. మనము వాడే మెడికల్ పదాలు దాదాపు అన్నీ "గ్రీక్" భాష నుండి వచ్చినవే. డెల్టా వేరియెంట్ , ఓమిక్రాన్ (ఒమేగా నుండి వచ్చింది). ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమేగా, సిగ్మా  ఇవన్నీ "గ్రీక్ " అక్షరాలు. లింఫ్ మన జీర్ణ ప్రక్రియలో వేరుపడ్డ కొవ్వుని (fat ) సేకరించటం మూలంగా దీని రంగు తెల్లగా ఉంటుంది. 

లింఫెటిక్ సిస్టం మన శరీరంలో "garbage collector " లాంటిది , చెడుపదార్ధాలను తీసివేసి, immunity cells ను శరీరమంతా వ్యాపించ జేసి, రోగ నిరోధ శక్తిని పెంచి, శరీరంలో fluid balance ను సరిచేసి, తిన్న ఆహారాన్ని సరీగ్గా జీర్ణం చేసి, చర్మానికి కాంతినిచ్చి, inflammation ను తగ్గించి, ఒక్కమాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది.

కొన్ని కొన్ని ఆపరేషన్స్ మూలంగానూ, కొన్ని వ్యాధుల మూలంగానూ లింఫ్ nodes కి హాని జరిగినప్పుడు, లింఫ్ ఎక్కడికీ పోలేక అక్కడే పేరుకుపోయి, చాలా బాధలకు దారి తీస్తుంది (Lymphatic congestion ). మందులు లేని ఈ వ్యాధులకు ఒకటే మార్గము,  Lymph Drainage ,పేరుకుపోయిన లింఫ్ ను బయటికి పంపి సరిచేయాలి.

మెదడులో ఉన్న కణాలు (cells ) కూడా అన్ని కణాలు లాగానే రోజూ మలినాలని ఉత్పత్తి చేస్తాయి. లింఫ్ పేరుకుపోవడం కూడా జరగవచ్చు. మెదడు కు వచ్చే రోగాలకి (Headache , MS ,Stroke etc.), Lymph Drainage ఎంతవరకూ ఉపయోగ పడుతుంది అనే అంశం మీద అమెరికా లోని Center for Brain Immunology and Glia (BIG) at the University of Virginia's Department of Neuroscience వారు పరిశోధనలు చేస్తున్నారు.

అటువంటి లింఫ్ మార్గాన్ని సరిచేసే నిపుణురాలు:

Lisa Levitt Gainsley, CLT (Certified Lymphedema Therapist) 

అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు మందుల్లేని రోగాల్ని సరిచెయ్యటానికి వారి వారి పేషంట్స్ ని ఈవిడ దగ్గరకి పంపిస్తూ ఉంటారు.

తన patients తోటి అనుభవాలు, తాను వారి బాధలను నివారించిన విధానాలు వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకం పేరు This Book of Lymph, 2021 ప్రచురణ. 

లింఫ్ నాళములు చర్మము నకు దగ్గరగా ఉండుట మూలమున, Lymph Drainage కి, చాల మృదువుగా అంగ మర్దనము (massage ) చెయ్యాలి. ఆ విధి విధానాలు, అవి ఏ విధంగా శరీరంలోని శక్తి చక్రాలతోనూ (మూలాధార, స్వాధిష్టాన,  మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార ) , యోగా, ఆయుర్వేద, చైనీస్ మెడిసిన్ లతోనూ మిళితమై ఉన్నాయో ఈ పుస్తకంలో వివరించటం జరిగింది.

లింఫ్ సిస్టం ను జాగర్తగా ఉంచుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది నిర్వివాదాంశం. దీనికి కావలసింది మృదువుగా శరీరాన్ని హృదయం వేపు రుద్దటం. అదే మన పూర్వికులు తలస్నానం అని చెప్పి పండగలకి ముఖ్యంగా చేయించేవారు. నా చిన్నప్పుడు పండగలకి చిన్నపెద్ద అందరూ ఆముదం తలమీద అంటుకుని, సున్నిపిండితో వంటిమీద నలుగు పెట్టుకుని, తల స్నానం చేసేవారు. ఇండియాలో "ఆల్ జై మర్స్" తక్కువకి కారణం ఇదేనేమో. 

మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ధర $26.99.

The Book of Lymph (2021)

Self-Care Practices to Enhance
Immunity, Health, and Beauty
By Lisa Levitt Gainsley, CLT
HarperCollins Publishers
195 Broadway, New York, NY 10007

Summary of the post:

We have two  circulatory systems in the human body. One is the cardio vascular circulatory system which has heart as the "pump" to circulate the blood, the second one is the Lymph system where in there is no pump for circulating the Lymph; The movement of muscles around the vessels aids the movement of Lymph until it reaches the cardiovascular system to take advantage of its pumping system.

Lymph is a white colored fluid (white color comes because of its absorption of fat in the small intestine). It resides in all cells in the body and is called the body's garbage collector, filtering bacteria and toxins and channeling them to what are called Lymph Nodes in the body. The Lymphatic system is twice the size of the circulatory system and is an essential part of the immune system, producing white blood cells. 

The lymph vessels are connected to the veins carrying blood going towards the heart and mixed with the blood in the veins for further elimination and purification.

The Lymph System does not have a "heart" like pump in the circulatory system, to move the Lymph in the vessels. It depends upon the pulsing of nearby arteries and skeletal muscle contractions. As such self-massage, breathing and physical exercises are essential for good lymphatic health.

Problems may arise because of the elimination of lymph nodes in surgery. As lymph nodes do not regenerate, this may result blockages of the lymph flow resulting in unwanted problems in the body. By channeling the collected limp to the circulatory veins trough various means, we can eliminate these problems of the lymph blockage. 

This information is taken from the book published in 2021:  The Book of Lymph by Lisa Levitt Gainsley , CLT. This book may be available in the Libraries.



Wednesday, January 5, 2022

188 ఓ బుల్లి కథ -- లేక్ ష లా న్ Lake Chelan



అమెరికాలో సియాటిల్ పట్టణానికి 165 మైళ్ళ దూరంలో "లేక్ ష లా న్ " అనే ఒక సరస్సు ఉంది. అది 50 మైళ్ళ పొడుగూ ఒక మైలు వెడల్పు 1400 అడుగుల లోతు ఉన్న పెద్ద సరోవరం. ఊరు పేరు కూడా అదే. ఈ ఫ్యూరీ జనాభా 8 వేలు. చిన్నప్పుడు హిమాలయాల్లో మానససరోవరం గురించి తెలుసుకున్నప్పుడు, కొండల్లో చెరువు ఎల్లా ఉంటుందనేది అర్ధం కాలేదు. పైనున్న రెండు ఫోటోలు మేముంటున్న "ఎయిర్ బియన్ బీ " ఇంట్లో నుండి తీసినవి. చుట్టూతా కొండలూ వాటి మీద పడ్డ స్నో, కింద ఉన్న చెరువు. అర్ధమయ్యింది కదా సరోవరాలు కొండల్లో ఎల్లా పుడుతాయో. స్నో కరిగిన నీళ్లు. ఇంకోటి కూడా తెలుసుకున్నాను జారుడు నీళ్ళల్లో ద్రాక్ష బాగా పెరుగుతుందని. కొండల మీదా కిందా బోలెడన్ని ద్రాక్ష తోటలు (ద్రాక్ష తీగలన్నీ చలికాలం లో నిద్రుస్తున్నాయి). రోడ్డు పక్కన బోలెడన్ని "ద్రాక్ష రసం " రుచి చూసే షాపులు. దీనిని "wine tasting " అంటారు. ఊర్కెనే రుచి చూపిస్తారు అనుకునేరు. మేము అల్లాగే బోల్తా పడ్డాము. 

ఒకసారి కాలిఫోర్నియా లో "thousand buddhas " అనే చోటికివెళ్ళి తిరిగివస్తూ ఊరుకోలేక రోడ్డుపక్కన కనపడ్డ "wine tasting " కి  వెళ్ళాము. డబ్బులు వదిలించుకుని  "తాగు బోతు" అనే బోర్డు తగిలించు కోవాల్సొచ్చింది. నా ఉద్దేశంలో ఒక చుక్క తాగినా తాగుబోతు కింద లెక్కే. అనవసరంగా డబ్బులు పెట్టామనే బాధో, లేక ఆ వైన్ తయారు చేసిన మూలాలు తెలుసుకోవాలనే పట్టుదలో, లేక "wine tasting " మైకమో, చూడటానికి మనోజ్ఞంగా ఉన్న నల్ల ద్రాక్ష గుత్తులో, తిరిగివస్తూ రోడ్డు పక్క ఆగి మా ఇంటావిడా ఆవిడ స్నేహితురాలూ పక్కన తోటలోకి దిగి ద్రాక్ష గుత్తులు కోసుకుని తిన్నారు. మేము మగవాళ్ళం, ఎవరన్నా వచ్చి అడిగితే "చూడటానికి వెళ్ళారు"  అని చెబుదామని కారులో కూర్చుని ఉన్నాము. మీరు మాత్రం ఈ విధంగా "wine tasting " చెయ్య బోకండి.

ఈ   "లేక్ ష లా న్"  సరోవరం ఒక చివరి అంచునుండి ఒక సన్నటి జలపాతం కొలంబియా రివర్ అనే నదిలో పడుతుంది. ఇంకో విచిత్రం ఇక్కడ ఏమి చేశారంటే లేక్ లో నుండి ఒక సొరంగం తవ్వి దాని చివర హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

2022 సంవత్సరం ని ఆహ్వానించటం ఇక్కడే జరిగింది. అందరూ తాగుతూ నాకూ రెండు చుక్కలు "షామ్ పైన్" పోశారు. బయట చలి విపరీతంగా ఉంది (17F అంటే -8.33C). ఈ సమయంలో మీరు బయటికి వెళ్ళాలంటే కనీసం రెండు వరసల దుస్తులు అవసరం. నెలల క్రిందట రిజర్వేషన్ చేసినప్పుడు వాతావరణం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు. పొద్దునపూట స్క్రామ్ బుల్డ్ ఎగ్స్ సాయంత్రం పిజ్జా. ఇక్కడ "Safeway " గ్రోసరీ స్టోర్ ఉంది కాబట్టి తినటానికి ఇబ్బంది లేదు. అయినా మా ఆవిడ రైస్ కుక్కర్, బియ్యం తోటి వస్తుంది కాబట్టి నాకెప్పుడూ ఇబ్బంది ఉండదు. తిండి సరీగ్గా తినక బోతే నేను రోజంతా నసుగుతానుట. అన్నము కందిపొడి గోంగూర చింతకాయ మాగాయ, "yogurt " అనే గడ్డ పెరుగుంటే ఇంకేమికావాలి ? అది రోమ్  అయినా పారిస్ అయినా హాంకాంగ్ అయినా హొనలులూ అయినా అల్బుకర్క్ అయినా నాకేటి కొదవ. 




ఇక్కడికి వచ్చే టప్పుడు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళు దాటి వచ్చాము (మచ్చుకి వాటిలో రెండు పేర్లు Cashmere , Sultan).  ఒక పల్లెటూరు లో  (Leavenworth) బోర్డులన్నీ జర్మన్ పేర్లతో కనపడ్డాయి. ఆరా తీస్తే తెలిసిందేమంటే, ఆ ఊళ్ళో పర్యాటకులు ఆగటల్లేదని బాధేసి, ఆవూరి పెద్దలు, అన్నిటికీ జర్మన్ పేర్లు పెట్టి, అలంకరణలు చేసి  ఒక "బెవే రియన్ (జర్మన్)" పల్లెటూరుగా తయారు చేశారు. ఇక్కడ ప్రసిద్ధి  "nutcracker museum" (కాయల్ని పగలగొట్టే వస్తువులు ). అప్పటినుండీ ఈ ఊరికి పర్యాటకులు ఎక్కువైనారు. మేమూ వెళ్ళాము (నేను తప్ప -- చలి). పై ఫోటోలు అక్కడివే.

ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణించిన 165 మైళ్ళలో మొదటి  50 మైళ్ళు చదును ప్రదేశం తర్వాత అంతా కొండలు ఎక్కటమే. "ఇక్కడి నుండీ  కారు టైర్లకి "chains " వెయ్యాలి లేకపోతే కారు all wheel drive అన్నా అవ్వాలి" అనే బోర్డు కనపడింది. రోడ్లమీద స్నో తో కారు జారచ్చని ముందు హెచ్చరిక. రోడ్డుపక్కన కార్లు ఆపి టైర్లకి చాలామంది గొలుసులు వేసుకుంటున్నారు (మాది AWD).  వెళ్తూ ఉంటే కొలంబియా రివర్ దానిపక్కన చిన్న ఊళ్ళు వస్తూ పోతూఉన్నాయి. మేము ఊరు చేరుకోటానికి సియాటిల్ నుండి 5 గంటలు పట్టింది.

తిరిగివచ్చేటప్పుడు మంచు తుఫాను వస్తుందని తెలిసి కొంచెం ముందర బయలుదేరాము. పెద్ద గందరగోళం, ఉత్కంఠ.  మా బృందంలోని ఎనిమిది మందిలో ఏడాది పిల్లాడి నుండీ 80 ఏళ్ళ కుర్రాడి వరకూ ఉండటంతో వాళ్ళ వాళ్ళ అవసరాలు వివిధ రకాలు. మొదట మాకున్న కారులో అందరం పట్టం కాబట్టి పెద్ద వాన్ అద్దెకు తీసుకోవాల్సొచ్చింది. 

వచ్చేటప్పుడు కొంచెం దారి తప్పి ఒక చిన్న ఊళ్లోకి వెళ్ళి  పోయి గూగుల్ మా ప్స్ తో సరి అయిన దోవలోకి వచ్చాము. మొదటి 50 మైళ్ళు బాగానే గడిచింది కానీ తర్వాత "snow storm " మొదలైంది. రోడ్డు సరీగ్గా కనపడక చాల నెమ్మదిగా పోవాల్సి వచ్చింది. ప్రపంచం లో మీరు గమనించారో లేదో కొందరికి కష్టమయినది ఇంకొందరికి  ఇష్టంగా ఉంటుంది. స్కీ చేసేవాళ్ళకి స్నోపడటం అంటే చాలా ఇష్టం, వాళ్ళు వాళ్ళ ఆటవస్తువులని పట్టుకుని ఆ సన్నటి దోవలో రోడ్డు పక్కన ఉత్సాహంగా నడుస్తున్నారు. జాగర్తగా కారు తోలుకుంటూ కొంత దూరం వచ్చేసరికి స్నో పోయి వర్షం రావటం మొదలయింది. అదీ గొడవే. అది దాటుకుని వచ్చేసరికి పిల్లలు ఆకలి గొడవ. "subway  " మహత్యంతోటి అందరినీ శాంతపరిచి, చీకటి పడుతుంటే ఇంటికి జేరుకున్నాము.

ఇదీ క్లుప్తంగా మా "వింటర్ ఔటింగ్". 

Sunday, December 19, 2021

186 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ -7 (Prasnopanishad )

ప్రశ్నోపనిషత్ లో ఇంతవరకూ అయిదుగురు శిష్యులు వేసిన వేదాంత ప్రశ్నలకు గురువుగారు పిప్పలాదుల  సమాధానాలు చూశాము. చివరి ప్రశ్న ఆరో ప్రశ్న సుకేశ భరద్వాజ క్రింది విధంగా వేశాడు : 

"కోసల దేశానికి యువరాజయిన హిరణ్యనాభుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, పదహారు అంగాల పురుషుడు (షోడశకలం పురుషం వేత్థ ) ఎవరో నీకు తెలుసా ? అని.  అబధ్ధం చెబితే వారు సమూలంగా నశించి పోతారు. (అందుకని)నాకు తెలియదు అని చెప్పాను. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడో  చెప్పండి " అని . (6-1)

అతనితో మహర్షి ఇలా చెప్పాడు: "ఓ సౌమ్యా ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోపల హృదయంలో ఉన్నాడు. ఆ బ్రహ్మ నుంచే పదహారు అంశాల ప్రపంచం ఉద్భవించింది"అని. (6-2)

ఆత్మ నుండి ప్రాణము, తన నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇంద్రియాలూ, మనస్సు, ఆహారం ఉద్భ వించాయి. ఆహారం నుండి శక్తి , తపస్సు, మంత్రాలూ, లోకాలూ, క్రియలూ వచ్చాయి. లోకాల పేర్లు సృష్టించ బడ్డాయి. (6-4)

మంత్రంలో చెప్పినవన్నీ మనం బ్రతకటానికి కావాలి. "బ్రతకటం" అనేది శరీరమునుండి విడిపోయినప్పుడు, శక్తి స్వరూపాలు అన్నీ వాటి వాటి మూలాల్లో కలిసి స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. అంతేకాదు నదులు, ఏ విధంగా సముద్రంలో కలిసినప్పుడు వాటి నామరూపాలు వదిలే స్తాయో ఆవిధంగా, జీవించటానికి సృష్టించ బడిన వన్నీ మరణ కాలంలో వాటి వాటి నామరూపాలు వదిలి ఆత్మలో కలిసిపోతాయి.

(పిప్పలాదులు) వారితో చెప్పాడు : నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినదింతే . ఇంతకుమించి ఏమీ లేదు. (6-7)

గురువుగారు తనకు తెలిసిన దంతా చెప్పాను అన్న తరువాత శిష్యు లందరూ వారికి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించినందుకు గురువుగారికి, గురువుగారి గురువులందరికీ (గురు పరంపర) నమస్సులు అర్పిస్తారు. (6-8)

నామాట:

వేటినయినా సృష్టించాలంటే శక్తి (energy ) కావాలని మనందరికీ తెలుసు. దానికి ఆకారం, రంగు రుచి వాసనా లేవని కూడా తెలుసు. దానిని చూడలేము పట్టుకోలేమని కూడా తెలుసు. ఉదా: విద్యుత్, మైక్రోవేవ్, ఆకర్షణా శక్తి  వగైరా. 

విద్యుత్ శక్తి నుండి మైక్రోవేవ్ శక్తి  వస్తుంది, ఆకర్షణా శక్తి  కూడా వస్తుంది. మనం అర్ధం చేసుకోవటం కోసం మూడింటినీ శక్తి-1, శక్తి-2, శక్తి-3 అని పిలవకుండా విడి విడిగా పేర్లు పెట్టుకున్నాము.  

అల్లాగే శక్తి స్వరూపమయిన సృష్టికర్తకు, తాను సృష్టించిన శక్తి  స్వరూపాలకు, మన అవగాహన కోసం పేర్లు పెట్టి పిలుస్తున్నాము.

విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రాణం, సూక్ష్మ శరీరం, కారణశరీరం ఇవన్నీ శక్తి  స్వరూపాలు. శరీరం లోకి జేరి దానికి జీవత్వం ఇస్తాయి, వచ్చిన  పని అయిపోగానే జీవాత్మ లోకి శక్తి స్వరూపాలు మిళిత మవుతాయి; అస్తమించే టప్పుడు సూర్య భగవానుడు లోకి కిరణాలు కలిసిపోయి నట్లు. మళ్ళా ఇంకొక శరీరం చూసుకుని ఆ  శరీరంలో విప్పారి, ఉదయపు సూర్య కిరణాలు విప్పారినట్లు, మిగిలి పోయిన పాప కర్మలు అనుభవించేటట్లు చేస్తాయి. 

జీవితంలో మనకిచ్చిన చిన్న విచక్షణ జ్ఞానంతో చేసిన పాప పుణ్యాలన్నీ సూక్ష్మ, కారణ శరీరాల్లో క్రోడీకరించి ఉంటాయి, తప్పించుకోలేము. మనసులో వాటిని తలుచుకోండి చాలు బయటికి వస్తాయి. వాటి పరిణామాలు మనం అనుభవించే దాకా మనము పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అందుకనే ఈ చావు బ్రతుకుల విలయం నుండి తప్పించుకోటానికి మంచి పనులు చెయ్యటానికి ప్రయత్నించటం మంచిది.

క్లుప్తంగా ఇదీ సంగతి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

Prashna Upanishad - Ancient Indian View on Creation, Time, Matter and Soul

ఉపనిషత్ లు    

Monday, December 6, 2021

185 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 6 (Prasnopanishad )

సూక్ష్మంగా చెప్పాలంటే ప్రశ్నోపనిషత్ అంతా ఆరుగురు శిష్యులు అడిగిన ప్రశ్న లకు గురువుగారి సమాధానములు. నలుగురు శిష్యుల ప్రశ్నలకి గురువుగారు సమాధానములు చెప్పిన తరువాత, గురువుగారిని శిష్యుడు శైబ్య సత్యకామ అయిదవ ప్రశ్న క్రింది విధంగా వేశాడు : 

అధ్యాయం 5 శ్లోకం 1: (5-1)

అథ హైనం శై బ్య:  సత్యకామః  ప్రపచ్చ  : దాని తర్వాత శైబ్య సత్యకామ అడిగాడు 

స యో హ వై తద్భగవన్మనుష్యేషు  : ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా 

ప్రాయణా న్త మో ర  మభిధ్యాయీత : మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే  

కతమం వావ స  తేన లోకం జయతీతి : అతడు దానివలన ఏ లోకానికి వెళ్తాడు అని 

ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకాలకి వెళ్తారు? అని శిష్యుడు  శైబ్య సత్యకామ గురువుగారు పిప్పలాదుడిని అడిగాడు.

ఇక్కడ ఓం కారం గురించి ఒక మాట చెప్పాలి. "ఓం" అని నోటితో అనాలంటే మనం  "అ " "ఉ " "మ " అనే మూడక్షరాలను కలిపి ఉచ్చరించాలి.  

అధ్యాయం 5 శ్లోకం 6: (5-6)

తిస్రో మాత్రా మృత్యుమత్య: ప్రయుక్తా అన్యోన్యసక్తా :  : ఈ మూడు మాత్రలూ విడిగా వాడితే (ఉచ్చరిస్తే ) అనిత్య ఫలం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా 

అనవిప్రయుక్తా:  క్రియాసు : ధ్యానంలో సరీగ్గా వాడితే 

బాహ్యాభ్యన్తరమధ్యమాసుజ్ఞ సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతేజ్ఞః  : జాగృత్ సుషుప్తి స్వప్నావస్తలకు పరమాత్మను గుర్తించిన జ్ఞాని చలించడు.

ఇక్కడ చెప్పేదేమిటంటే విడి విడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే అది పనిచేయదు, ఓంకార ఫలం పొందాలంటే ఓంకారం జపించేటప్పుడు అక్షరాలన్నీ పెనవేసుకుని ఒకటిగా రావాలి.

విడివిడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే, ఒక మాత్ర  "అ " తో జపిస్తే నూ, రెండుమాత్రలు "అ " "ఉ " లతో జపిస్తే దేవతలు వారి వారి లోకాలకు తీసుకువెళ్ళి వారి వారి ఫలితం అనుభవించిన తరువాత మనుష్యలోకానికి తెస్తారు. మూడక్షరాలూ పెనవేసుకుని ఓంకారం జపిస్తే సామవేద దేవత వల్ల  బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం పొందుతారు.    (5-7)

నామాట :

"పై లోకాలు" అనే మాటని అర్ధం చేసుకోటానికి ఈ క్రింది విశ్లేషణ ఉపయోగ పడచ్చు :

1. లోకాలు ఉన్నాయి అనే మాట విని ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు. మన ఎదురుకుండా మనమే ఒక లోకాన్ని సృష్టించాము. అదే "Satellite " లోకం. మనము సృష్టించిన కొన్నివేల ఉపగ్రహాలు దానిలో తిరుగుతున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడికి మానవులు వెళ్తున్నారు వస్తున్నారు (space Station). 

2. మన శరీరం ఒకటిగా పైకి కనిపించినా అది వేద శాస్త్ర ప్రకారం మూడు శరీరాల కలయిక అని చెబుతారు ("స్థూల శరీరం" (physical body ) , "సూక్ష్మశరీరం" (subtle body ), "కారణ శరీరం" (casual body )). 

మన "స్థూల శరీరం" (physical body ) మనకు కనపడే మన శరీరం. 

జ్ఞానేంద్రియాలనుండి వచ్చే సంకేతాలను వాటికి తగినట్టు ప్రతిస్పందన చేసిన తర్వాత  "మనసు" లో నిక్షిప్తం (record ) చేసేది "సూక్ష్మశరీరం" . మన జీవత్వానికి కారణం ఇదే.

మన మనసులో దాచిపెట్టబడిన సంకేతాలతో మన మనస్సు మనకి కొన్ని గుణాలు ఇస్తుంది.

"బుద్ధి" "జ్ఞానం" అనేవి నిక్షిప్తమైన సంకేతాల్ని వడగట్టితే (process ) వచ్చేది. 

"చిత్తం " అనేది మనసులోనున్న సాంకేతాలను అవసరమైనప్పుడు బయటకు తెచ్చేది.

"అహంకారం" మన మనసులో పోగు చేసుకున్న సమాచారాన్ని మన సొంతం అని వక్రీకరించగా వచ్చేది. ఇవి మనం అందరం మనకు తెలీకుండా రోజూ ఉపయోగించేవే. 

మన జీవిత రహస్యాలను దాచి పెట్టుకునేది "కారణ శరీరం" (casual body ). మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనని కనిపెట్టుకుని ఉండేది ఇదే. మనం గాఢ నిద్ర పోయామని మరునాడు గుర్తు పెట్టు కొని చెప్పేది కూడా మనలోని "కారణ శరీరం".  

మన శరీరం వదిలిన తరువాత మన జ్ఞాపకాలతో ప్రయాణించేవి సూక్ష్మ, కారణ శరీరాలు. మన ప్రారబ్ధం నిర్ణయించేది వీటిలో నిక్షిప్తం చేసిన సమాచారమే.

మనం నిద్ర కుపక్రమించే టప్పుడు wake up state లో ఉంటాము , తరువాత Dream లోకి వస్తాము ఆ తరువాత Deep Sleep లోకి వెళ్తాము  వీటినే జాగృత్, స్వప్న, సుషిప్తి అంటారు. వీటిని గురించి మాండూక్యోపనిషత్ లో వివరంగా తెలుసుకుందాము.

3. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్ గురించి చర్చించే టప్పుడు ఇంకా తెలుసుకుందాము.  ఓంకారం ఏవిధంగా ఉచ్చరించాలనేది గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి క్రింద లింక్ ఒకటి ఇచ్చాను.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

ఓం

ఉపనిషత్ లు    

11-Neema Majmudar

Wednesday, December 1, 2021

184 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 5 (Prasnopanishad )

 శిష్యుల వేదాంత ప్రశ్నలకి గురువుగారి సమాధానాలే  ఈ  ప్రశ్నోపనిషత్.  ఇంతవరకూ వేసిన ప్రశ్నలు, జగత్ సృష్టి ఎల్లా మొదలయింది, దానిలో మనుషులు ఎల్లా ఉద్భవించారు, ఎల్లా జీవిస్తున్నారు, ఎల్లా నిష్క్రమిస్తారు అని.

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

"ప్రాణం" శరీరం లోకి ప్రవేశించి అయిదు విధాలుగా విభజించుకుని మానవునిలో జీవత్వానికి మూలం అవుతుంది. కర్మ ఫలములు అనుభవించిన తరువాత  "ప్రాణం" శరీరంలోనుండి నిష్క్రమించిన వెంటనే శరీరంలో జీవత్వం పోతుంది.

ఇంక ఈ నాలుగవ అధ్యాయంలో శిష్యుడు అడిగిన నాల్గవ ప్రశ్నకి గురువుగారిసమాధానం చూద్దాం.

అధ్యాయం 4 శ్లోకం 1: (4-1)

అధ హైనం సౌర్యాయణీ గార్ఘ్యహః ప్రపచ్చ : మూడవ ప్రశ్న తరువాత సౌర్యాయణీ గార్గ్యుడు గురువుగారిని అడిగాడు 

భగవన్నెత స్మిన్పురుషే కాని స్వపస్తి కాన్యస్మి  జ్ఞాగ్రతి ? : ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేలుకొని ఉంటాయి?

కతర ఏష దేవః  స్వప్నాన్పశ్యతి కస్త్యైతత్సుఖం భవతి? : ఏ దేవుడు కలలను చూస్తాడు? ఈ సుఖం ఎవరికి చెందుతుంది?

కస్మిన్ను సర్వే  సమ్ప్రతిష్ఠితా భవన్తీతి   : ఎందులో అన్నీ లయమవుతాయి అని.

మనని ఎవరన్నా రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగితే ఏం చెబుతాము ? నిద్ర పట్టలేదనో, లేక రాత్రంతా కలలు అనో లేక హాయిగా నిద్ర పోయననో చెప్తాము.నిద్ర పట్టక పోవటం, రాత్రి కలలు రావటం ఒక విధంగా మనకు తేలుస్తాయనుకోవచ్చు. కానీ గాఢనిద్ర పోతున్నప్పుడు మన అవయవాలు ఏమీ పని చేయవే అటువంటప్పుడు మనము  హాయిగా  నిద్ర పోయామని ఎలా గుర్తుపెట్టుకుని చెబుతాము?

ఇదే సందేహం శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  కి వచ్చి గురువుగారిని అడుగుతాడు.

ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో నిద్రిస్తున్నప్పుడు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి , ఏవి కలలను చూస్తాయి, (గాఢనిద్ర) పోతున్నప్పుడు వ్యక్తి శరీరంలో ఆ సుఖం అనుభవించి గుర్తుపెట్టుకుని చెప్పే వారు ఎవరు ? అని అడుగుతాడు. (4-1)

గురువు పిప్పలాదుడు శిశుడు గార్గ్యకి చెబుతాడు: అస్తమించే సూర్యుడు తన కిరణాలనన్నీ తీసుకు పోయి మరునాడు ఉదయిస్తున్నప్పుడు తన కిరణాలను ఎలా విస్తరిస్తాడో అలాగే  శరీరంలోని ఇంద్రియాలు నిద్రలో మనసుతో లీనమయి, మెలుకవ తో వాటి పనులతో ప్రజ్వరిల్లుతాయి. అందుకని నిదురలో ఉన్న వ్యక్తి,  వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించడు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు , నిద్రిస్తాడు. (4-2)   

ప్రాణ రూపంలో ఉన్న అగ్నులు మాత్రమే ఈ శరీరంలో మేలుకొని ఉంటాయి. (4-3)

( పంచ ప్రాణాలూ, మనస్సు మాత్రమే మేలుకొని ఉంటాయి. ఇక్కడ అగ్నులు అంటే మనం మనశరీరంలో కణాలలో అగ్ని ద్వారా జరిగే శక్తి  ప్రక్రియ అని అన్వయించుకోవచ్చు.  )

"సమానం" ఉచ్వాస నిశ్వాసాలను సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాగే "ఉదానం" మనసనే యజమానిని (నిద్రతో) ఆనందం పొందేలా చేస్తుంది. (4-4) 

ఇక్కడ ఈ మనస్సు అనే దైవం కలలో, చూసిన వాటినీ చూడనివాటినీ , చూస్తుంది, వినినవాటినీ వినని వాటిని కూడా వింటుంది, అనుభవించినవీ అనుభవించనివీ, నిజమైనవీ నిజంకానివీ అన్నింటినీ చూస్తుంది.  (4-5)

(ఇక్కడ అనుభవించనివీ, చూడనివీ ఎల్లా చూస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి పండితులు చెప్పే సమాధానం అవన్నీ పూర్వ జన్మ వాసనలయి ఉండచ్చని. ).

వాసనలు నిలువచేసి ఉన్న చిత్తానికి అడ్డు తగిలినప్పుడు కలలు వచ్చుటకు వీలులేక "సుషుప్తి" (గాఢ నిద్ర) శరీరానికి వచ్చి ఆనందిస్తుంది. (4-6)

ఓ సౌమ్యుడా పక్షులు పగలు ఏవిధంగా దేశసంచారము  చేసి రాత్రికి వాటి చెట్టులో ఉన్న గూటికి చేరుకుంటాయో అటులనే అవి అన్నీ (శరీరంలో ని వన్నీ) పరమాత్మను చేరుకుంటాయి.  (4-7)

అవి అంటే శరీరంలో ఉన్న పంచ భూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచప్రాణాలూ, నాలుగు అంతః కరణాలూ  పరమాత్మను చేరుకుంటాయి (తురీయంలో లయమవుతాయి).  (4-8)

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

అన్నీ బ్రహ్మలో ఐక్యమయిన తరువాత బ్రహ్మ గురించి ఎల్లా తెలుస్తుంది. మనమే బ్రహ్మగా మారినప్పుడు బ్రహ్మ జ్ఞానము ఎల్లా తెలుస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

హే సౌమ్యుడా కారణ శరీరంలేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

జీవాత్మ, ఇంద్రియాలూ, పంచ ప్రాణాలూ, పంచ భూతాలూ అన్నీ దేనిలో లీనమవుతాయో (అక్షర బ్రహ్మలో) తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వ వ్యాపకం చెందుతాడు.  

నా మాట:

శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  "నిద్ర " గురించి అడిగిన ప్రశ్నకి  గురువుగారు పిప్పలాద మహర్షి చక్కటి ఉపమానం చెబుతారు. 

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన కిరణాలు లోపలికి ఎల్లా తీసుకుంటాడో , "నిద్ర" వచ్చేటప్పుడు ఒక వ్యక్తిలో అటువంటిదే జరుగుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా వాటి పాటవాన్ని తగ్గించుకుంటూ విశ్రమణకు చేరుకుంటాయి. అందుకనే ఆ వ్యక్తి  నెమ్మదిగా విశ్రమించు స్థితి లోకి జారుకుంటాడు. రాను రానూ వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించ డు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు, నెమ్మదిగా నిద్రకి ఉపక్రమిస్తాడు. 

జీవితంలో మనస్సులో నిక్షిప్త మయి సంఘటనలు కలల రూపంలో నిద్రలో కనిపిస్తాయి. ఒకప్పుడు మనకెప్పుడూ జరగని సంగతులు కూడా కలల లోకి రావచ్చు. వాటికి కారణం మన పూర్వ జన్మ నిక్షేపాలు కావచ్చు. కలల గమనానికి అడ్డు తగిలినప్పుడు, కలలు ఆగిపోయి "గాఢ నిద్ర" లో మునిగిపోతారు.

సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాల్ని ఎలా వ్యాపిస్తాడో అల్లాగే వ్యక్తి మేలుకుని నిద్ర లేస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి వాటి స్వస్థానాలకి వచ్చి తమ తమ పనులను చెయ్యటానికి ఉపక్రమిస్తాయి. 

పక్షులు పగలు దేశసంచారము చేసి రాత్రికి చెట్టులో ఉన్న గూటికి ఎలా చేరుకుంటాయో  అటులనే రాత్రిపూట ఇంద్రియాలు వాటి వాటి స్వస్థలానికి చేరుకుంటాయి. "ప్రాణం", మనస్సు తోపాటు అన్నీ జీవాత్మలో విలీనం అవుతాయి.

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

హే సౌమ్యుడా కారణం శరీరం లేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే  అని ఎవరు గ్రహిస్తాడో  అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు    

Monday, November 22, 2021

183 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 4 (Prasnopanishad )

ఇంతవరకూ జరిగిన వృతాంతం:ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ  కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ  గార్గ్య, సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు పిప్పలాద ఋషి .

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ ప్రశ్న భార్గవ వైదర్భి గురువుగారికి వేస్తాడు : భగవాన్ ఒక వ్యక్థి స్థితికి ఎవరు కారకులు వారిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఇక్కడ స్థితి అంటే జీవించటం అని అర్ధం చెప్పుకోవచ్చు.

దానికి గురువుగారు పిప్పలాదులు చెబుతారు : మొదట ఇంద్రియాలు, వాటి వల్లనే వ్యక్తి జీవించకలుగుతున్నాడని గర్వంగా చెప్పేవి కానీ  "ప్రాణం"  మధ్యలో వచ్చి తానే జీవత్వానికి కారణం అని చెప్పి నిరూపిస్తుంది. అందుకని అన్ని ఇంద్రియాలకీ "ప్రాణం"  పొసే "ప్రాణం" శ్రేష్టమైనది అని పిప్పలాదులు సమాధానం చెబుతారు.

మూడవ అధ్యాయం లో గురువుగారికి శిష్యుడు మూడవ ప్రశ్న వేస్తాడు.

మూడవ అధ్యాయం మొదటి మంత్రం: (3-1)

అధ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః  ప్రపచ్చ  : ఆ తరువాత కౌసల్య అశ్వలాయన అడిగాడు 

భవన్కుత ఏష ప్రాణో జయతే కధమాయాత్యస్మిరీరే ? : మహర్షీ ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ శరీరంలోకి ప్రాణం ఎల్లా వచ్చింది ?

ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే ? : తనను తాను విభజించుకుని ఎల్లా ప్రతిష్ఠించు కున్నది? 

కేనో త్క్ర మతే ? కథం బాహ్య మభిధత్తే  ?: ఎలా బయటకు వెళ్తుంది (శరీరం నుండి) ? ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది ?

కధ మధ్యా త్మ మితి ? : 

మూడవ అధ్యాయం రెండవ  మంత్రం: (3-2)

తస్మై స హోవాచాతి ప్రశ్నా స్ప్రుచ్చ  సి : శిష్యునితో (గురువుగారు) అన్నారు నువ్వు కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు 

బ్రాహ్మిష్టో సీతి తాస్మాత్తే  హం బ్రవీమి : నీవు బ్రహ్మజ్ఞానివి (అర్ధం చేసుకునే శక్తి ఉన్నది) అందుకు దీనికి సమాధానం చెబుతాను 

మూడవ అధ్యాయం మూడవ  మంత్రం: (3-3)

ఆత్మన ఏష ప్రాణో జాయతే : ఆత్మ నుండి ప్రాణం పుట్టింది 

యథైషా పురుషే చ్చ యైత స్మిన్నే తదాత తం : పురుషుని వల్ల  ఏర్పడిన నీడలా  

మనోకృతేనా యాత్య స్మి ఇంమి రీరే : కర్మల వలన శరీరంలోకి వస్తుంది 

కౌసల్య అశ్వలాయన గురువుగారికి వేసిన మూడవ ప్రశ్న,మనిషిలో  "ప్రాణం" ఎల్లా వస్తుంది, శరీరంలో ఎల్లా ప్రతిష్ఠించు కుంటుంది, చివరికి శరీరాన్ని వదలి ఎల్లా వెళ్ళి పోతుంది?, చెప్పమని. (3-1)

గురువుగారు శిష్యుడికి తన సమాధానం అర్ధం కాదేమోనని  కొంత తటపటాయించినా, శిష్యుని సామర్ధ్యం తెలిసినవాడు కనుక, ఇది చాలా క్లిష్టమయిన ప్రశ్న అంటూనే దానికి సమాధానం చెబుతారు.  (3-2)

ఈ జగత్ అంతటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుండి "ప్రాణం" పుట్టింది. ఎల్లా పుట్టింది అంటే మనం ఎండలో నుంచుంటే నీడ వస్తుందే అలా. "ప్రాణం" పరమాత్ముని నీడ లాంటిది. నీడ ఎంత మిధ్యో పరమాత్ముని అంశం ఈ జగం కూడా అంతే మిధ్య . అది ఏశరీరంలోకి వస్తుంది? మనం చేసిన పూర్వ జన్మ కర్మల ప్రభావం వలన.  (3-3)

ఏవిధంగా ఒక చక్రవర్తి పరిపాలన సౌలభ్యంకోసం మంత్రులూ సామంత్రులు మొదలగు వారిని నియమించుకుని పాలిస్తారో అటులనే "ప్రాణం" శరీరంలో తన వారిని  విడివిడిగా తగిన స్థానాలలో నియమించుకుని శరీరాన్ని పరిపాలిస్తుంది. (3-4)

"ప్రాణం" తన అంశతో నలుగురు సహాయకులను సృష్టించుకుని , అపానం, సమానం, వ్యనం, ఉదానం అనే నలుగురు, శాఖా బాధ్యతలు అప్పజెప్పింది. అపానం బాధ్యత విసర్జన క్రియ, జీవోత్పత్తి , సమానం కి జీర్ణక్రియ, వ్యనం కి రక్తప్రసరణ క్రియ, ఉదానం కి తిరోగమన క్రియ అప్పజెప్పి ముఖ్యమయిన శ్వాసక్రియ దానికి కావాల్సిని కళ్ళు చెవులు ముక్కు (చక్షు శ్రోత్రే ముఖ నాసికాభ్యం ) తన పరిధిలో  ఉంచుకుంది "ప్రాణం". (3,5) (3,6) (3,7)

"సమానం" కి ఉన్న శాఖ జీర్ణక్రియ. తనకు హోమాగ్ని లాగా అర్పించబడిన ఆహారాన్ని తీసికుని పోయి ఏడు  జ్వాలలను ఉత్పత్తి చేసి ఏడు ఇంద్రియాలకు శక్తిగా ఇస్తుంది (2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక )

"వ్యానం " శాఖ  రక్త ప్రసరణం. ఆత్మ హృదయంలో ఉంది. ఈ హృదయంనుండి 101 నాడులు వస్తాయి (నాడీ నామ్ ఏతత్ ఏకశతమ్ ). వాటిలో ఒక్కొక్క దానికీ నూరు శాఖా నాడులు ఉన్నాయి. ప్రతి శాఖా నాడికీ 72000 ఉపనాడులు ఉన్నాయి (సహస్రాణీ ద్వాసప్తతి:). వీటిల్లో రక్త ప్రసరణక్రియ   "వ్యానం "నిర్వహిస్తుంది. (3-6)

"ఉదానం" స్థానం ఊర్ధ్వ భాగం. దీని శాఖ తిరోగమన క్రియ. మనం పడంది తింటే విసర్జన ద్వారా బయటికి పంపుతుంది. ప్రాణాన్ని సరి అయిన లోకాలకు చేర్చటం కూడా దీని పనే. పైకి వెళ్ళే ముఖ్యమైన నాడి  "సుషుమ్న" నాడి ద్వారా ఉపాసన చేసిన వారిని "ఉదానం" బ్రహ్మ లోకానికి తీసుకు వెళ్తుంది. మిగతా నాడులు మిగతా వారిని వారి వారి ప్రారబ్ధ కర్మ ప్రకారం, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి , పాపం చేస్తే నరకానికీ తీసుకు వెళ్తాయి. రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి తీసుకు వెళ్తాయి (పాప ముభాభ్యామేవ మనుష్యలోకమ్ ). (3-7)

సూర్యుడే బాహ్య రూపంలో "ప్రాణం". పృథ్వి బాహ్య రూపంలో"అపానం". అంతరిక్షం బాహ్య రూపంలో "సమానం". వాయువు బాహ్య రూపంలో "వ్యానం "  (3-8)

శరీరంలో అగ్ని తత్త్వం వెళ్ళి పోయినప్పుడు అన్ని ఇంద్రియాలూ మనస్సులో లీనమయి పోయి ఇంకొక జన్మలో మరల బయటికి వస్తాయి. (3-9) 

మరణం సమయంలో అయిదు ప్రాణులూ ఏకమవుతాయి. అందుకనే జీర్ణక్రియ లాంటివి జరుగవు. ఈ సమైఖ్య  "ప్రాణం ", మనిషి కోరిన చివరి సంకల్పం ప్రకారం దాని స్ధానానికి వెళ్తుంది.      (3-10)

ఎవరైతే "ప్రాణం" గురించి అర్ధంచేసుకుని ఉపాసన చేస్తారో అతని సంతతి ఎన్నటికీ నశించదు, బ్రహ్మ లోకానికి వెళ్తాడు. (3-11) 

ఫల శృతి:

"ప్రాణం" ఎలాపుట్టింది? శరీరంలోకి ఎలా వచ్చింది? శరీరంలో ఎక్కడ ఉంది? ఎలా పరిపాలిస్తోంది? ఐదుగా ఎలా విభజించుకుంది ? ఇవన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వ్యక్తి అమరత్వం పొందుతాడు. (3-12)

నా మాట :

మొదట ఈ అధ్యాయం క్లిష్టంగా కనపడుతుంది గానీ రెండుమూడు సార్లు చదివితే తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

సూక్ష్మంగా చెప్పాలంటే "ప్రాణం" మానవ శరీరంలోకి  ప్రవేశించి, శరీర దైనందిన కార్యక్రమాలకోసం, తనకుతాను అయిదు భాగాలుగా విభజించుకుని, జీవి చేత ప్రారబ్ధ కర్మ ప్రకారం "మానవ జన్మ" అనే శిక్ష అనుభవింప చేసి చివరకి "సుషుమ్న" నాడి ద్వారా నిష్క్రమిస్తుంది. 

ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన శాలలో రోజూ ఇటువంటివే ముఖ్యమయిన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. 

అది ఏమిటి? ఎలా వచ్చింది ? ఏమి పనిచేస్తుంది? మనకేమి ఉపయోగం? ఎట్లా పోతుంది?     అనేవి.

ఎన్నో వేల ఏళ్ళ  నాటి క్రింద భారత దేశంలో మన పూర్వికులు ఈ పంధాలో ఆలోచించారంటే నిజంగా మనకి మనం మెచ్చుకోవాలి గర్వపడాలి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు  

Tuesday, November 16, 2021

182 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 3 (Prasnopanishad )

ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రాహ్మని  సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది  అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ అధ్యాయం మొదటి మంత్రం.

అధ హైనం భార్గవో వైదర్భి: పప్రచ్చ  : ఆ తర్వాత విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అడిగాడు 

భగవన్కత్యేవ దేవాః ప్రజాం విధారయన్తే ?  :  ఏ దేవతలు ఒక వ్యక్తికి స్థితికారకులు  

కతర ఏతత్ప్రకాశయన్తే ?  :   వారిలో ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు 

కః పునరేషాం వరిష్ఠ ఇతి  :  వారిలో ఎవరు శ్రేష్ఠులు అని            ( 2-1)

కబంధీ కాత్యాయనుడి మొదటి  ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత భార్గవుడు రెండవ ప్రశ్న వేశాడు. ఏ దేవతలు ఒక వ్యక్తి జీవించటానికి కారకులు ? వారిలో ఎవరు శ్రేష్ఠులు అని.

భార్గవుని ప్రశ్నలో  దేవతలు అనే పదం వాడారు కానీ ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి లో ఉన్న ఇంద్రియాలు పని చేయటానికి ఎవరు కారకులు, వారిలో ఎవరు గొప్ప అని. మనం దీన్ని ఉదాహరణకి మనకు తెలిసిన  జ్ఞానేంద్రియాలు అని అనుకుందాము. జ్ఞానేంద్రియాలు లేక పోతే మనిషికి ఒక స్థితి అంటూ ఉండదు. 

మనం ఇంకో ఉదాహరణకి కన్ను తీసుకుంటే, కన్ను ఒక గాజు ముక్క, తన పని అల్లా కాంతికిరణాలని వెనకాల ఒక తెరమీదికి చేర్చటమే. మనము ఆ కిరణాల సముదాయాన్ని గుర్తించటం అనే పని ఇంకొక చోట, మనము చూడలేని చోట, జరుగుతుంది. మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఈ విధంగానే పని చేస్తాయి.  

వేల సంవత్సరాల క్రిందట ఈ ప్రశ్న వచ్చిందంటే నిజంగా గొప్పే. ఏ సమాధానం కనపడని  ప్రశ్నలకి మనకు కనపడని  దేవతలు చేస్తున్నారు అనుకోవటం నా ఉద్దేశంలో సహజమే.

రెండవ అధ్యాయం రెండొవ  మంత్రం.  (2-2)

తస్మై స హోవాచ  : అతడితో పిప్పలాద చెప్పాడు 

ఆకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాప:  : ఆకాశం వాయువు అగ్ని నీరు   

పృథివీ వాజ్ఞ న శ్చక్షు: శ్రోత్రం చ  :  పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు 

తే ప్రకాశ్యాభివదన్తి  :  దేవతలు వాటి పనిని గురించి గొప్పల చెప్పుకుంటున్నాయి 

వయమే తద్బాణ మవష్టభ్య విధారయా మః  :  శరీరం కలిపివుంచి మేమే శరీరాన్ని భరిస్తున్నాము      

మొదట ఆకాశం వాయువు అగ్ని నీరు పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ శరీరాన్ని కలిపివుంచి శరీరాన్ని భరిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని పిప్పలాదుడు చెప్పారు.

నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం , వారే (సంసారం) అంతా భరిస్తున్నా రంటారు.

 తాన్వరిష్ఠ:  ప్రాణ ఉవాచ  : వాటిలో శ్రేష్ఠమైన ప్రాణం అన్నది 

మా మొహమా ప ద్యధాహ  మేవై : ఎవరుగొప్ప అను భ్రాంతి లో పడకండి   (2-3)

కానీ  మధ్యలో "ప్రాణం" వచ్చి నన్ను నేనే ఐదుగా విభజించుకుని ఈ శరీరాన్ని స్థంబం లాగా నిలబెడుతున్నాను. ఇంకొకళ్ళు గొప్ప అనే భ్రాంతి లో పడవోకండి అని అన్నది. కానీ  ఆ దేవతలు నమ్మలేదు అని చెప్పారు.

అందుకని "ప్రాణం" ఊర్ధ్వ దిశగా వెళ్ళిపోదామని బయలు దేరింది.  జ్ఞానేంద్రియాలలో  "ప్రాణం" ఉన్నది కాబట్టి అవి కూడా ప్రాణంతో వెళ్ళటానికి సిద్దమైనాయి. మరల "ప్రాణం" తన యధాస్థితికి వచ్చిన వెంటనే అవి గూడావాటి యధాస్థితికి  జేరినాయి. అందుకని అన్నిటికన్నా ప్రాణమే శ్రేష్టమైనది అని పిప్పలాదులు అన్నారు.

నా మాట:

నిజ జీవితం లో కూడా ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో గమనించకపోతే కాపురాలూ, కంపెనీలూ పేక మేడల్లాగా కూలిపోతాయి. అటువంటప్పుడే  "ప్రాణం" లాగా ఎవరో వచ్చి మేలుకొలిపి రక్షిస్తూ ఉంటారు.

మన దేహం లో అగ్ని లేకపోతే శక్తి లేదు. నీరు లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవదు. వాయువు లేకపోతే మన శ్వాస లేదు. అల్లాగే మిగతా దేవతలన్నీ "ప్రాణ" ప్రేరేపణతో పనిచేసేవే.

ఈ రెండో అధ్యాయం లో మిగతా విశ్లేషణ అంతా "ప్రాణ" స్తుతి. అది ఎంత గొప్పదో చెబుతారు. మనిషిలో ప్రాణం లేకపోతే ఏమిజరుగుతుందో మనకందరికీ తెలుసు.

Monday, November 1, 2021

180 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 2 (Prasnopanishad )

బ్రహ్మ నిష్ఠా గరిష్టు లైన ఆరుగురు శ్రోత్రియులు సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన, గురువు గారికి సరి అయిన కానుకలతో పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఇక్కడ గమనించవలసినది ఎవరో వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత గురువుగారికి లేదు. పోనీ తాను చెబితే వాళ్ళకి తెలుస్తుందా లేక కంఠశోష మాత్రమే అవుతుందా అనేది గురువుగారికి తెలియదు. అందుకనే మీరు ఒక సంవత్సరం ఆశ్రమ నియమాలు పాటిస్తూ తన ఆశ్రమంలో ఉన్న తర్వాతే సందేహాలకి సమాధానాల సంగతి చూస్తాను అంటాడు గురువుగారు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు.

భగవన్కుతో హ వా ఇమాః  ప్ర జా: ప్రజాయన్తీ ఇతి   :  (1-3)

భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

కాత్యాయన ప్రశ్నకి గురువుగారు క్రింది మంత్రాలలో సమాధానం చెబుతారు.

ప్రజాకామోవై  ప్రజాపతి:  :  ప్రాణులను సృష్టించ దలచి  ప్రజాపతి 

స తపః అతప్యత  :   తపస్సు చేశాడు 

స తపః తపస్తప్యా స మిథునం ఉత్పాదయతే :   తపస్సు తరువాత జంటను సృష్టించాడు  

రాయించ ప్రాణం చేత్యేతౌ  మే  బహుధా ప్రజా: కరిష్యత  ఇతి :  రయిని, ప్రాణాన్ని (సృష్టించి) ఈ రెండూ నాకోసం అనేక జీవాల్ని  ఉత్పత్తి చేస్తాయి అనుకున్నాడు.  (1-4)

ప్రాణకోటి ఎల్లా పుట్టింది అనే కాత్యాయన ప్రశ్నకి గురువుగారు ప్రజాపతి తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించి, మూల ప్రకృతిగా (అనేక జీవుల పుట్టుకకు) దోహదపడుతుంది అని చెబుతారు. 

ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరోకాదు విష్ణుమూర్తి సృష్టించిన బ్రహ్మ.  (ముండక ఉపనిషత్)

ఈ మంత్రం అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం కానీ ప్రయత్నిద్దాము. "ప్రాణం" అనే దానికి శక్తి  ఉత్పాదించేది  అనే అర్ధం చెప్పుకుంటే, శక్తిని ఉపయోగించేది  "రయి "  అవుతుంది. ప్రపంచంలో మనం చూసేవన్నీ జంటలు. సూర్యుడూ చంద్రుడూ, మగా ఆడా, పగలూ రాత్రీ, పుట్టుక చావు, తయారుచేసేవి తినేవి. 

ఉదాహరణకి సూర్యుడూ చంద్రుడూ తీసుకుందాము. సూర్య కాంతి లేనిది చంద్ర కాంతి లేదు. పగలూ రాత్రీ లేదు. శక్తి నిచ్చేది సూర్యుడు శక్తిని తీసుకునేది చంద్రుడు . వీటినుండి కాలమానం ఎల్లా వచ్చిందో చూడండి.

సూర్యుడు చంద్రుడూ తిరిగితే కానీ ఒక రోజు, 24 గంటలు పూర్తవదు. ఈ జంట వలన మనము కాలం గుర్తించి  రోజులు గుర్తించ గలుగుచున్నాము, పూర్ణమి అమావాస్య, ఉత్తరాయణం దక్షిణాయనం, కృష్ణ పక్షం శుక్ల పక్షం. వీటినుంచి ఋతువుల క్రమం కూడా గుర్తించాము.  ఇంతెందుకు మనం మన రోజూ దిన చర్య మొదలుకుని అంతా వీటి చుట్టూతా తిరుగుతాము.  

ఇంకో ముఖ్య ఉదాహరణ ఆడా మగా. వీళ్లిద్దరూ కలియక పోతే  మానవ జన్మ ఉండదు. భూమిమీద  మనుషులు కూడా ఉండరు.

అన్నం వై ప్రజాప్రతిస్తతో హ వై తద్రేతస్తస్మాదిమః  ప్రజా: ప్రజాయంత ఇతి   (1-14)

ఆహారమే ప్రజాపతి. అన్నం నుంచే మనుష్య బీజం ఉత్పత్తి అవుతుంది. ఆ బీజం నుండే మనుష్య సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది. (ఇక్కడ అన్నం అంటే తినే ఆహారమని అర్ధం)

శుక్రశోణిత సంయోగమేవ సృష్టి:  : స్త్రీ పురుషుల నుండి శుక్ర శోణిత బీజాలు కలిస్తే సృష్టి జరుగుతుంది.

వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

నా మాట: మనంజీవించటానికి సూర్య చంద్రులు చాలాముఖ్యం. అందుకనే సూర్యనమస్కారాలు వచ్చాయి. మనం నమస్కారాలు చెయ్యవలసిన అవసరం లేదు సూర్య దేవు డేమీ బాధపడడు. కానీ జీవితంలో మనకు సహాయం చేసిన వారినీ చేస్తున్న వారిని గుర్తించటం మన సభ్యత భాద్యత కూడా.

కాలం సృష్టించిన సూర్య చంద్రులు వందేళ్ల క్రిందటా ఇలాగే ఉన్నారు వందేళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటారు. వారు సృష్టించే ఈ కాలంలో అరిగిపోయి ఒరిగిపోయేది మనమే . 

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Six pundits reached the Ashram of  Rishi Pippalada and requested him to clear some doubts they gathered during their philosophical journey. Pippalada suggested to them that they should stay with him for an year and then if they ask he may tell if he know the answer to those questions. 

The year went by and the first question came from Kathyayana about the theory of creation, how the creatures were born ?.  

To that question the guru replied, Lord Vishnu created Prajapathi(Brahma) and assigned the duty of creating the world. Prajapathi meditated on this assignment and produced a pair "Rayi" and "Prana"to create the world.

That is why every significant thing in this world comes in pairs. Ex: Sun and Moon, Male and Female.

Without Sun and Moon there is no concept of time, Year, month and seasons.

Without Male and Female there is no human beings.

ఇంకా మీరు చదివి తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ లు ఉపయోగ పడతాయి.

ప్రశ్నోపనిషత్

ఉపనిషత్తులు









Monday, October 4, 2021

177 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-2 (Mundakopanishad )

విష్ణుమూర్తి బ్రహ్మని సృష్టించి తనని ప్రపంచమును సృష్టించమని చెప్తాడు. బ్రహ్మ "జగత్" ని సృష్టించటం జరిగింది(పరమాత్మ). సృష్టించటమే కాదు దానిని "ఆటోమేట్" కూడా చేశాడు (అది పూర్ణం దాని నుండి వచ్చిన ఇది పూర్ణం). అంతేకాదు తాను సృష్టించిన ప్రతిదానిలోనూ తన "అంశ" ఉంచటం జరిగింది (జీవాత్మ ). జీవు లన్నిటిలో ఉండే జీవాత్మని బ్రహ్మన్  (Brahman ) అనికూడా అంటారు.

బ్రహ్మ తన సృష్టి రహశ్యాలన్నీ మొదట తన జేష్ఠ పుత్రుడు అధర్వునికి చెప్పాడు. అప్పటినుండీ తరతరాలుగా ఆ రహస్యం ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెంది అంగీరసుని వరకూ చేరింది. 

ఈ ఉపనిషత్ లో ముఖ్యభాగం గురుశిష్యుల సంవాదాము. శిష్యుడు గృహస్థు మహాశాలి శౌనికునికి,  గురువుగారు బ్రహ్మజ్ఞాని అంగీరసునికి  మధ్యన అంగీరసుని ఆశ్రమంలో జరిగిన సంవాదన.

జీవితమంతా శాస్త్ర ప్రకారం నిత్యకర్మలూ యజ్ఞ యాగాదులూ చేస్తూ మేటి గృహస్థుడు గా పేరుబడ్డ శౌనికుడు

 "ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోటానికి ఇంకేమీ ఉండదు? అంతా తెలుకున్నట్లు అవుతుంది? " 

అని గురువుగారైన బ్రహ్మజ్ఞాని అంగీరసుని అడుగుతాడు. దానికి గురువుగారు సమాధానం చెబుతారు.

విద్యలు రెండు రకాలు అపరా విద్యలు, పరా విద్యలు. అపరా విద్య లన్నీ బయట ప్రపంచానికి సంబంధించినవి. బయట ప్రపంచానికి సంబంధించి, పంచేంద్రియాల కోరికలు తీర్చటానికి ఫలాపేక్షతో నేర్చుకున్న విద్యలన్నీ అపరా విద్యల కిందకి వస్తాయి. ఆత్మకు సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం నేర్చుకున్నది పరా విద్య.

ఫలాపేక్షతో చేసిన యజ్ఞ యాగాదులు మొదలయినవి అపరా విద్యలు. వీటి వలన ఫలితం  తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

బ్రహ్మ జ్ఞాన విద్య పరా విద్య. ఫలా పేక్ష లేకుండా చేసిన పరా విద్య తో కలిగే ఫలితం శాశ్వితం. ఇదే మోక్ష మార్గం. ఇంతవరకూ అపరా విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వారు అదే జిజ్ఞాసతో పరా  విద్యలు అభ్యసిస్తే/ఆచరిస్తే పర త్త్వాన్ని పొంది మోక్షము సాధిస్తారు. 

*************************

మొదటి ముండకం మొదటి ఖండం మంత్రం 2 (1-1-2):

అథర్వ ణే   యాం ప్రవదేత బ్రహ్మా : బ్రహ్మ దేవుడు దేనిని అథర్వునికి చెప్పాడో 

అథర్వా  తాం పురోవాచాంగిరే  బ్రహ్మవిద్యమ్ ఆ బ్రహ్మవిద్యను అథర్వుడు పూర్వం అంగిరునుకి చెప్పాడు 

స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ : అంగిరుడు భారద్వాజ గోత్రమునకు చెందిన సత్యవాహినికి చెప్పాడు 

భరద్వాజో అంగీరసే పరవరామ్ : భరద్వాజుడు అంగిరసునికి బోధించాడు 

లోకం సృష్టించిన బ్రహ్మ దేవుడు ఆ రహస్యాలన్నీ తన పెద్ద కుమారుడు అథర్వునికి చెప్పాడు. అధర్వుడు అంగిరునికి చెప్పాడు. అంగిరుడు భరద్వాజ గోత్రుడైన సత్యవాహినికి చెప్పాడు. భరద్వాజుడు అంగీరసునికి చెప్పాడు.

********************

మొదటి ముండకం రెండవ ఖండం 10వ మంత్రం (1-2-10):

ఇష్టాపూర్తం మన్యమానా  వరిష్టం : అనేక యజ్ఞాలూ అనేక పుణ్యకార్యాలూ ఇవే గొప్పవనుకుంటారు 

నాన్యచ్చ్రేయో వేదయన్తే ప్రమూడా: : తక్కిన శ్రేష్ఠమయినవి తెలిసికొనుటలేదు పరమ మూర్ఖులు 

నాకన్య పృష్టే తే  సుకృతే నుభూత్వా : వారు స్వర్గంలో పైలోకాలు పుణ్యఫలం అనుభవించాక 

ఇమంలోకం హీనతరం వా  విశన్తి  : ఈ భూలోకంలో పుడతారు లేదా ఇంకా హీనమైన లోకాల్లో పుడతారు 

ఫలాపేక్షతో యజ్ఞ యాగాదులు మొదలైయినవి చేసి అవే గొప్ప అనుకుంటారు. వీటి వలన ఫలితం లభిస్తుంది కానీ అది తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

********************

నా మాట:

సంవత్సరాల క్రిందట కమ్యూనికేషన్ చాలావరకు వాక్ (నోటి) ద్వారానే ఉండేది. నోటికీ మనసుకీ ఇంపుగా ఉండి గుర్తు పెట్టుకునే విధంగా ఉండటానికి ఛందో నియమాలు సృష్టించి నోటి మాటలుగా రచనలు చేసేవారు. గురువులు వాటిని ఆశ్రమాల్లో (ఆ నాటి పాఠశాలలు ) శిష్యుల చేత వల్లె వేయించేవారు. ఆ విధంగా తరతరాలుగా వేదాలూ ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి.

కొంత కాలానికి ఉచ్చారణ మూలాధారంగా అక్షరాలూ లిపి తయారు చేశారు. అక్షరాలకు ఉచ్చారణ మూలాధారం అగుటచే మన భాషల లిపి మనము ఉఛ్చరించి నట్లు వ్రాస్తాము (phonetic).

వ్యాసమహర్షి ఆనాటి వాడుకలో నోటిద్వారా ప్రాచుర్యము పొందిన వేదాలు ఉపనిషత్తులు మొదలయినవి సేకరించి వాటిని గ్రంథ రూపంలో తాటాకుల మీద వ్రాయటం జరిగింది. 
వ్యాసుడు అంటే కూర్పరి (composer, compiler  ) అని అర్ధం.

ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.

Monday, September 20, 2021

176 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-1 (Mundakopanishad )

ముండకోపనిషత్ అధర్వణ వేదం నుండి తీసికొన బడినది. ఇది మనకున్న పది ముఖ్య ఉపనిషత్ లలో ఒక ముఖ్య ఉపనిషత్. దీనిలోని 65 శ్లోకాలు 3 భాగాల్లో ఉన్నాయి. ఒక్కొక్క భాగమూ మళ్ళా రెండు ఖండాలుగా గ విభజించబడ్డాయి. 1-1-3 అంటే  మొదటి ముండకం లోని మొదటి ఖండంలో 3వ మంత్రం. దీనిలో భాగాన్ని ముండకం అంటారు.

సామాన్యంగా ఉపనిషత్ లు శిష్యుడి ప్రశ్నతో మొదలయ్యి దానికి గురువుగారి సమాధానంతో ముగుస్తుంది. ఇక్కడ శిష్యుడు శౌనికుడనే గృహస్థు, గురువుగారిపేరు అంగీరసుడు.

గృహస్థయిన శౌనికునికి తాను చెయ్యవలసిన కర్మకాండలు, యజ్ఞ యాగాదులూ అన్నీ చేసినా ఇంకా ఏదోమిగిలిపోయిందన్న దిగులు. దగ్గర ఆశ్రమంలో ఉన్న అంగీరసుడనే మహాముని దగ్గరకు వెళ్ళి తన అసంతృప్తిని చెప్పి జీవితంలో ఏవి చదివితే అంతా తెలిసిపోయి ఇంకా  చదవవలసిన/చెయ్యవలసిన అవసరము ఉండదో చెప్పమని అర్ధిస్తాడు .

ముండకం 1 ఖండం 1 మంత్రం 3  (1-1-3):

శౌనకో హ వై మహాశాలో ఆంగీరసం   : శౌనికుడనే మహాశాలి అంగీరసుని 

విధివధుప్రసన్న హ  పప్రచ్చ           : శాస్త్రోక్తరీత్యా సమీపించి ప్రశ్నించాడు 

కాస్మిన్ను భగవో విజ్ఞతే                       : దేనిని తెలుసుకుంటే భగవంతుడూ 

సర్వమిదం విజ్ఞాతం భావతీతి           : ఈ సర్వస్వమూ  తెలిసికోబడుతుంది అని 

ముండకం 1 ఖండం 1 మంత్రం 4 (1-1-4):

తస్మై స  హోవాచ           : అతనితో అతను చెప్పాడు 

ద్వే విద్యే వేదితవ్యే ఇతి : రెండు విద్యలు  తెలుసుకోవలసినవి అని 

హ స్మ యద్                        : అవి 

బ్రహ్మవిదో వదన్తి                : మహాత్ములు చెబుతారు 

పరా చైవాపరా చ                 :  పరా విద్య అపరా విద్య 

శౌనికుడు యజ్ఞ యాగాదులు చేస్తూ సౌభాగ్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక గొప్ప గృహస్థు . అంగీరసుడు వారసత్వముగా బ్రహ్మజ్ఞానము తెలిసికొనిన గురుపరంపరలో ఏడవ వ్యక్తి. 

వేసిన ప్రశ్న: ఏది తెలుసుకుంటే అంతా తెలుకున్నట్లు అవుతుంది? (ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవటానికి ఇంకేమీ ఉండదు అని)

ఈ ప్రశ్నకిసమాధానం 4 వ మంత్రంలో గురువుగారు చెబుతారు. పర విద్య, అపరా విద్య అని రెండు విద్యలు ఉన్నాయి అవి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే అని మహాత్ములు చెబుతారు అని.

శౌనికుని ప్రశ్న మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళీ చదువు? ఈ  చదువులన్నీ ఎప్పుడు ఆపెయ్యాలి ? పిల్లలు అడిగే ఈ ప్రశ్నకి మనం సామాన్యంగా సమాధానం చెప్పం కానీ గురువుగారు శౌనికుని ప్రశ్నకి సమాధానం చెప్పటం ప్రారంభించారు. 

విద్యలు రెండు రకాలు పరా విద్య , అపరా విద్య . ఇంతవరకూ నీవు నేర్చుకున్న వన్నీ అపరా విద్యలు (వేదాలూ ఉపనిషత్తు లతో సహా ), నువ్వు గనక పరా విద్య కూడా నేర్చుకుంటే ఇంకేమీ  నేర్చుకోవక్కరలేదు, అని శిష్యుడు శౌనికుని తో చెబుతారు గురువుగారు అంగీరసుడు.

ముండకం 1 ఖండం 1 మంత్రం 5 (1-1-5):

తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో  అథర్వవేదః : వాటిలో అపరా విద్య ; ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం

శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్దో జోతిషమితి  :   శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం ఇవి 

అథ పరా యయా తదక్షరమథి గమ్యతే  : ఇక దేనిచేత ఆ అక్షరం బ్రహ్మ ; పొందుతారో; పరావిద్య 

ఇప్పటివరకూ చదివిన  ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం అవన్నీ అపరావిద్య కిందకు వస్తాయి;  బ్రహ్మ జ్ఞాన సముపార్జన  పరావిద్య; అని గురువుగారు చెబుతారు. 

నా మాట:

మనలో చాలామంది "నేను" అంటే తన పంచేంద్రియాలూ అవి పనిచేసే పనులు అనుకుంటారు. ఇంకొంచెం ముందుకు పోయిన  వారు "మనసుని" గుర్తించి దాని పోకడల మీద, ప్రేమ పాటలు, విరహ పాటలూ, పాడుకుంటూ ఉంటారు. "నేను" అంటే ఇదేనా ! 

కాదు కాదు అంటారు పండితులు. ఇంకా మనకి తెలియనిది ఉంది మనలోఉన్న అంతఃకరణ (Conscience ) అని అంటారు. దానిని అర్ధం చేసుకోటానికి  ప్రపంచంలో  పెద్దపెద్ద తలకాయలు (Columbia , Harvard , MIT మేధావులు) కుస్తీ పడుతున్నారు. 

రాబోయే పోస్టుల్లో మన శాస్త్రాలు (ఉపనిషత్తులు) లో చెప్పిన పరా విద్య కి Conscience కి సంబంధం ఉందేమో తెలుసుకుందాము.

ఉపనిషత్తుల మీద తెలుగులో వ్రాసిన ఈ క్రింది ఉపన్యాసాలు చాలా ఉపయోగపడతాయి:

ఉపనిషత్

Monday, September 6, 2021

174 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 5 ముగింపు (Ishopanishad)

దాదాపు రోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. మన పని రోజు మొదలవుతుంది. అలాగే సాయంత్రం అస్తమిస్తాడు. మన పని రోజు ఆగిపోతుంది. రాత్రి మొదలవుతుంది.

రాత్రిపూట చంద్రుని వెలుగులో విశ్రమిస్తాము. అది కూడా సూర్య భగవానుడు మనకోసం ఇచ్చిందే. స్వయంగా చంద్రునికి కాంతి నిచ్చే శక్తి  లేదు. సూర్యునికి మనమీద ఎందుకు అంత  ప్రేమ ? 

సూర్యుడు సముద్రాలూ నదులలో నీళ్ళని ఆవిరిగా మార్చి మేఘాలుగ చేసి మన వేపు తీసుకు వచ్చి వర్షాలు కురిపించి పంటలు పండిస్తాడు. ఎందుకలా సూర్యుడుచెయ్యాలి ?

మనం బతకాలంటే గాలి లోని ప్రాణవాయువు పీల్చాలి. బొగ్గుపులుసు గాలిని వదలాలి. మళ్ళా  గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువు తో నింపటానికి సూర్యుడు కావాలి. చెట్ల ఆకులద్వారా బొగ్గుపులుసు వాయువు తీసుకుని దానిని మార్చి ప్రాణవాయువు గాలిలోకి పంపుతాడు. 

ఇంతెందుకు మన జీవితం సుఖంగా గడపటానికి కావలసిన విటమిన్ డి ఇచ్చేది కూడా సూర్యుడే. శరీరానికి కొంత సేపు ఎండ తగిలితే చాలు. 

మనం గుర్తించినా గుర్తించక పోయినా మన జీవితం అంతా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి అవన్నీ ఎందుకు చేయాలి ?. తన కర్తవ్యం కాబట్టి. 

అందుకే యాజ్ఞవల్క్య మహా ముని రోజూ సూర్య భగవానుని ఆరాధించే వాడు. అప్పుడు  తన మనసులో మెదిలిన భావాలతో కూర్చినదే, ఈశా వాస్య  ఉపనిషత్. దానిలో కొన్ని ముఖ్య మంత్రాలు.

శాంతి మంత్రం:

 ఓం పూర్ణ మదః  పూర్ణమిదం  : అది పూర్ణం ఇది పూర్ణం 

పూర్ణా పూర్ణ ముదశ్చతే      : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినది 

పూర్ణస్య  పూర్ణమాదాయ పూర్ణ మేవా  వశిష్యతే  : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినా ఆ పూర్ణం పూర్ణమే 

ఓం శాంతి  శాంతి శాంతిః॑

పరమాత్మ పూర్ణం. ఆ పూర్ణం నుండి వచ్చిన ఈ జగత్ పూర్ణం. అంతేకాదు ఈ పూర్ణం ఆ పూర్ణం నుండి రావటం మూలాన ఆ పూర్ణం ప్రతిభ ఏమీ తగ్గలేదు అది ఇంకా పూర్ణముగానే ఉంది. 

ఇక్కడ పూర్ణం అంటే సంపూర్ణం అని అర్ధం తీసుకుంటే మనకి శ్లోకం తేలిగ్గా అర్ధం అవుతుంది. ఉదాహరణకి: ఒక గింజ మొక్కగా మారుతుంది. అదే పెద్దదయి పూవులు కాయలు గాచి గింజలు తయారుచేసి ఎండిపోయి నశిస్తుంది. మళ్ళా ఆ గింజల నుంచి మళ్ళా మొక్కలు చెట్లు వస్తున్నాయి. మొక్క జీవితం ఒక స్వయం ప్రవర్తక క్రియ (automatic ). నిదానించి చూస్తే ప్రకృతిలో ఇటువంటివి ఎన్నో.

మనతో సహా ఈ జగత్ ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టే, ఆ "పూర్ణం"నుండి వచ్చిన ఈ "పూర్ణం", స్వ  "పూర్ణం"  మన ప్రమేయం లేకుండా, రోజూ తన పని తాను చేసుకుపోతుంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి , పంటలు పండుతున్నాయి. మనం జీవించటానికి ఆహారం, నీళ్ళు, గాలి లభ్యమవుతున్నాయి. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. మన ప్రమేయంలేకుండా నే కాలచక్రం ముందుకు కదిలిపోతూ ఉంది ఎందుకంటే మనమూ మనని సృష్టించిన పరమాత్మ రెండూ  సం "పూర్ణం"(Complete ) మరియూ స్వ "పూర్ణం"(automatic ) కూడా. 

మొదటి మంత్రం:

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  :   తప్పకుండా(వాస్య) పరమాత్మ(ఈశా) అని గుర్తించు 

యత్కించ  జగత్యామ్  జగతు     :       ప్రపంచంలో నీకు కనపడేదంతా

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)      :      ఈ కొత్త దృక్పధంతో చూడటం నేర్చుకుని (జీవితం) ఆనందంగా గడుపు

మాగృతః  కస్య  సిద్దనం                :     ఇంకొకళ్ళ ధనం కావాలని కోరుకోకుండా 

ప్రపంచంలో కనపడే అన్ని జీవులలోనూ పరమాత్మ అంశాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఇంకొకళ్ళ సంపదకు ఆరాటపడకుండా జీవితం ఆనందంగా  గడుపు. 

ఇక్కడ ఆనందంగా గడుపు అంటే బార్లకి, క్లబ్బులకి వెళ్ళి తాగి తందనాలాడమని కాదు. పరమాత్మను స్మరిస్తూ ప్రార్ధిస్తూ జీవితం ఆనందంగా గడపమని. అలాచేయలేము అనుకుంటే క్రింది శ్లోకంలో చెప్పినట్లు చెయ్యమని ఉపనిషత్ చెబుతోంది..

రెండవ మంత్రం  :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రత్త గా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.

మన జీవితంలో మనం చేసే పనులు చాలావరకు ఇతరులతో చెయ్యవలసి ఉంటుంది. అందరినీ అన్నిటినీ మనం కట్టుబాటులో ఉంచలేము. వారి వారి కర్మ ఫలాల ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెయ్యగలిగినదల్లా మంచి జరగాలని ప్రార్ధించటమే.

చివరి పద్దెనిమిదవ మంత్రం :

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్ :  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్ : మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో : మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ :   నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా నీకు నన్ను నేను అర్పించుకోవటమే. 


Monday, August 30, 2021

173 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 4 (Ishopanishad)

మనకున్న వేదాలు నాలుగు. ప్రతీ వేదం శాంతి మంత్రం తో మొదలవుతుంది. శాంతి మంత్రం ఆ వేదంలో చర్చించబోయే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. దానిలో ఉన్న ఉపనిషత్ చర్చాంశాన్ని  వివరంగా చెబుతుంది. వేదముల లోని విషయాలూ చర్చలూ సంస్కృత పదాలతో అల్లిన శ్లోకాలతో మృదువుగా గుంభనగా గోప్యంగా ఉంటాయి. వాటి ముడులు విప్పి సౌరభాలు ఆస్వాదించాలంటే నిష్ణాతులైన గురువులు అవసరం. ఈశావాస్య ఉపనిషత్ లో ఇటువంటి శ్లోకాలు 18 ఉన్నాయి.

ఈ సృష్టికి కారణం పరమాత్మ అనీ ఆయన అంశం ఆయన సృష్టించిన ఈ జగత్ లో జీవులన్నిటిలోనూ  జీవాత్మగా ఉంటుందనీ, చూడటానికి, తాకటానికి అది అతీతమని చెప్పే శాంతి మంత్రం తో శుక్ల యజుర్వేదం మొదలవుతుంది.

నిర్గుణ నిర్వికార అనంత మూర్తి జీవాత్మను సంభోదించేది "ఓం" కారం తోనే. ధ్యానించేది "ఓం" కారం తోనే. అలా ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఆత్మ  తో మమేకమై ఆ ఆనందంతో మైమరచిపోతే జీవితం ఆధ్యాత్మిక తో ఆనందంగా గడపవచ్చును. ఇదే మొదటి శ్లోక సారాంశం.

ఏ కారణము చేత నయినా తనలోని జీవాత్మని భౌతిక శరీరాన్ని విడివిడిగా చూడలేక పోతే, వంద ఏళ్ళు బ్రతికి తోటి జీవులకి తోడుగా ఉంటూ, తనలోని ఆత్మని అందరిలో చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవించాలని నిర్ణయించుకోవాలి. ఇదే రెండవ శ్లోక సారాంశం.

భౌతికశరీరము  లోని పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ, కామినీ కాంచన కీర్తికోసం పరితపిస్తూ  జీవితం గడిపితే చనిపోయిన తరువాత కారుచీకటి లోకం "అసుర" లో తనలాంటి తోటి జీవులతో ఇంకొక దేహం కోసం వేచి ఉండి మరల మరల భువి మీద జన్మించాల్సి ఉంటుంది. ఇదే మూడవ శ్లోక సారాంశం.

శ్లోకాలు 4 నుంచీ 14 దాకా ఆత్మ (ఈశ ) గురించి వర్ణించటం జరుగుతుంది. మనము సామాన్యంగా "నేను" అనేది మన శరీరం, దానిలోఉండే పంచేంద్రియాలూ, అవిచేసే విన్యాసాలుగా గుర్తిస్తాము. అవే మనని కామినీ కాంచన కీర్తుల కోసం పరితమించమని చెబుతాయి. ఈ విన్యాసాలకు (మన కోరికలకు) అంతు ఉండదు ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంతులేని వాటికోసం పరితపిస్తూ ఒకటి తరువాత ఒకటి కోరికలు తీర్చుకుంటూ (తీర్చుకోలేక విషాదంతో కుమిలిపోతూ) జీవితం గడుపుతూ ఉంటాము. ఇవే సుఖ దుఃఖాలకి కారణాలు. 

మనం గనక ఈ భౌతిక శరీరాన్నీ (దానిలోని పంచేంద్రియాల్తో సహా ) నడిపించే ఆత్మ (conscious ) మీద కేంద్రీకరిస్తే, మనలో దాని ఉనికిని గ్రహిస్తే, దానితో మమేకమయితే, ఈ భౌతిక శరీరం  గుప్పించే విన్యాసాలకు అతీతం అవుతాము. మనము చెయ్యాల్సిన పనిని చేస్తాము కానీ ఆకర్షణలకు లొంగము. సినిమా హాల్లో తెల్లటి తెర ఉంటుంది. ఆ తెరమీద రంగురంగుల సినిమాలు ఎన్నో వేస్తుంటారు. దానికి ఏ రంగూ అంటదు. అటువంటిదే మన ఆత్మ. దానితో మమేక మయితే భౌతిక శరీర విన్యాసాలకు అవి కురిపించే సుఖ దుఃఖాలకి మనం అతీతల మవుతాము. ఇక్కడ గమనించ వలసినది మనం ముందర మన కర్తవ్యకర్మ చేసిన తరువాతే ఆత్మ జ్ఞానము మీద కేంద్రీకరించాలి.

శ్లోకాలు 15 నుండీ 18 దాకా సూర్య ప్రార్ధన శ్లోకాలు. శుక్ల యజుర్వేదము రచయిత యాజ్ఞవల్క్య  ముని సూర్య ప్రార్ధన ఫలితమే ఈశా వ్యాస ఉపనిషత్ అని కూడా అంటారు. 

శ్లోకం 15:

హిరణ్మయేన పాత్రేణ            బంగారపు మూతతో 

సత్య శ్యాపి హితం ముఖం   "సత్యం" ముఖం కప్పి ఉన్నది 

తత్వం పూషణ్ అపా వృణో     ఓ సూర్య దేవా!  ఆ మూత తీసివేయి 

సత్య ధర్మాయ దృష్టయే   సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది 

ఓ సూర్య దేవా (పూషణ్ ) బంగారపు మూతతో "సత్యం" కప్పి ఉన్నది. ఆ బంగారపు మూత తీసివేయవా. సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది. ( శ్లోకం 15)

(పూషణ్  అంటే పోషక కర్త. సూర్య దేవుడు సముద్రమునుండి నీరు తీసి మేఘముల ద్వారా వర్షము కురిపించి ఆహారము కొరకు పంటలుపండిస్తూ , సముద్రమును నింపుతూ జీవత్వము కొనసాగే విధంగా చేఇస్తున్నాడు. అంతే కాదు మన శరీరతత్వం కూడా సూర్యోదయము , సూర్యాస్తమయం  మీద ఆధారపడి ఉంటుంది.) 

నీవిచ్చిన ప్రాణం తోటి ఈ శరీరం ద్వారా ఇప్పటిదాకా "సత్యం" గా జీవితం గడిపాను. నా చరమ దశ ఆసన్నమైంది. ఈ నా శరీరాన్ని భస్మం చేసి  నువ్విచ్చిన నాలోని ప్రాణాన్నితీసుకుని నన్ను నీతో కలుపుకో .  శ్లోకం 17.

ఈ క్రింది చివరి ప్రార్ధన శ్లోకం మన అందరికోసం వ్రాసింది :

శ్లోకం 18:

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్  మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో  మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ    నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా  నీకు నన్ను నేను అర్పించుకోవటమే. శ్లోకం 18.

Summary written in English for people who do not know how to read Telugu.

The devotee is praying sun God, who is responsible for our existence and survival on this earth, to bless him to see his true figure so that he can show his gratitude. The Sun is actually instrumental for our existence on this earth by absorbing water from the Ocean , creating clouds and rain, which in turn fill the Ocean and raises crops and provide food for our survival. The Sun rise and Sun set are somewhat closely mingled with our biological system and daily activities.

నా మాట:

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి

1.Swami Aparajitananda

2. The Upanishads





Monday, July 19, 2021

171 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 2 (Ishopanishad)

వేదములు నాలుగు. ఋగ్వేదము సామ వేదము యజుర్వేదము అధర్వణ వేదము. వాటిలో  యజుర్వేదములు రెండు, శుక్ల యజుర్వేదము, క్రిష్ణ యజుర్వేదము. అన్నిటిలోనూ ఉన్నవి సంస్కృత శ్లోకములు. వీటినే మంత్రాలు అని అంటారు.

ఒక్కొక్క వేదము నాలుగు భాగాలుగ విభజించబడినది. మంత్రం, బ్రాహ్మణీకం, ఆరణ్యకం, ఉపనిషత్. ఈ నాలుగు వరుసగా జీవితంలో ఆచరించవలసిన బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు సంబంధించినవి. ఉపనిషత్ ని వేదాంతం అని కూడా అంటారు (వేదముల చివర). అన్నివేదములలోనూ మంత్ర భాగంలో మొదటి మంత్రం శాంతి మంత్రం. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ శుక్ల యజుర్వేదంలో మాత్రం ఉపనిషత్ మంత్ర భాగంలో ఉన్నది. ఈ మంత్రాలన్నీ చక్కటి సంస్కృత సమాసాలతో పొందుపరిచిన భావాలతో గుబాళిస్తూ ఉంటాయి.  

క్రిందటి పోస్టులో శుక్ల యజుర్వేదములో శాంతి మంత్రము గురించి తెలుసుకున్నాము. ఈ పోస్టులో  ఈ ఉపనిషత్ లోని ముఖ్యమయిన మొదటి మంత్రం గురించి తెలుసుకుందాము. 

మొదటి శ్లోకం :

ఓం  ఈశా  వాస్య  మిదగం సర్వం 

యత్కించ  జగత్యామ్  జగతు 

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)

మాగృతః  కస్య  సిద్దనం 

మన జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించేది మనల్నే. ఆ తరువాతే ఎవ్వరినైనా. మన శరీరం మీద గాయమయితే వచ్చే (ఇతరులు చీదరించుకునే) చీము నెత్తురికి కూడా ప్రేమగా జాగర్తతో కట్లు కడతాము, మన ప్రేమలూ పెళ్ళిళ్ళూ, బాధలూ భయాలూ ,సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇతరులకి చెప్పుకుంటూ ఉంటాము. అంతా నేను నేను నేను.

మనని మనం పరిశీలించుకుంటే --- మనం మన పంచేంద్రియా లకి కట్టుబడి ఉన్నామని  తెలుస్తుంది. చాలావరకు వాటి సలహాలు/ఆజ్ఞలను మనం శిరసావహిస్తాము. వాటిల్లో మనకి బాధపెట్టేవి, మనము ఏమీ చెయ్యలేనివీ, ఎక్కువగా ఉంటాయి. వాడికి మనకన్నా ఎక్కువ డబ్బులున్నవనో, డబ్బులున్నవాడు పిసినిగొట్టు అనో, వాడి ఇల్లు పెద్దదనో, మన కారు వాడి కారు కంటే మరీ చిన్నదనో, పెళ్ళాం పిల్లలు తన మాట వినటల్లేదనో, బాస్ ఎక్కువ పని చేయిస్తున్నాడనో, తన కింద పనిచేసే వాళ్ళు సరీగ్గా పనిచెయ్యటల్లేదనో, ఏవో భావాలు ఎప్పుడూ మనస్సులో మెదులుతూ మనని కెలుకుతూ ఉంటాయి. 

దీనికి కారణం తాను దోష శూన్య మైన వాడిననీ (perfect ) మిగతావాళ్ళు కాదనీ (imperfect ) అని చెప్పవచ్చు. మన మనుకుంటున్న Imperfect వాళ్ళు గనక Perfect గ మారితే మన సమస్యలన్నీ పోతాయి. కానీ ఏది తేలిక? మన చుట్టూతా ఉన్న మనమనుకుంటున్న imperfect వాళ్ళని మార్చటమా లేక మనం ఒక్కళ్ళమే మారటమా?  మీ సమస్యలన్నీసరి అవ్వాలంటే ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి.  

"అందరినీ సృష్టించింది నేనే. అన్నిటి లోనూ ఉన్నది నేనే. నీలో ఉన్న భగవదంశని గుర్తిస్తే  అందరిలోనూ నన్ను చూడగలవు. ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా, ఉన్న దానితో జీవితం ఆనందంగా గడుపుతావు."

చిన్న చిన్న లొసుగులు అందరిలోనూ ఉంటాయి. ఎన్ని లొసుగులున్నా నిన్ను నీవు ప్రేమించుట లేదా అటులనే అందరూ నీలాంటి వారే అనుకో. 

మనం ఉంటున్న ఈ జగత్ ఎప్పుడూ ఒక చోట ఉండదు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సృష్టి ఎప్పుడూ ముందుకి జరిగి పోతూనే ఉంటుంది. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ జీవించకు, ఆ క్షణం తిరిగిరాదు. 

(దోష నిర్ధారణ నేను చూసుకుంటాను. ప్రాణం ఇచ్చేది తీసేది నేనే. నీ పద్దతి మార్చుకో. )"

ఇదే క్లుప్తంగా ఈ శ్లోక తాత్పర్యం.

యత్కించ  జగత్యామ్  జగతు  : నీతోపాటు ముందుకి సాగిపోతున్నఈ  జగత్ సృష్టిలో  నేనున్నాను. నేనేకదా వాటిని సృష్టించింది !.

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  : "ఓం" అంటూ ప్రార్థిస్తూ  (meditate)  నీలో ఉన్న నన్ను గుర్తిస్తే  నీ చుట్టుపక్కల వారిలో గూడా నన్ను గుర్తిస్తావు. 

మాగృతః  కస్య  సిద్దనం : ఇంకొకళ్ళ సంపద  మీద కోరిక  పెట్టుకోకు.

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా) : నన్ను అందరిలోనూ  గుర్తించి నీ పాత ధృక్పధాన్ని మార్చుకుని ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా నీ జీవితం సంతోషంగా గడుపు.

సూక్ష్మంగా: నీలో ఉన్న ఆత్మ ని గ్రహించినప్పుడు, అదే ఆత్మ నీ చుట్టుపక్కల సృష్టి లోనూ ఉన్నదని గుర్తించి, వారూ నీలాంటి వాళ్ళే అని గ్రహించి సుఖంగా జీవితం గడుపుతావు .

1. క్షణ క్షణమూ మారిపోతున్న ఈ జగంలో (ప్రపంచంలో) పాత సంగతులు గుర్తుపెట్టుకోవడం మూలాన వచ్చేది ఏమీ లేదు. బాధలు తప్ప. వాటిని మెరిచిపో.

2. పక్కవాడి సంపద కోసం పాకులాడబోకు. అది మనోవేదనకి తప్ప పనికిరాదు.

3. నీలో ఉన్న ఆత్మని ఏకాగ్రతతో ధ్యానించి దానితో మమేకమవ్వు.

4. అందరిలో ఉన్నది నేనే. నిదానించి చూస్తే నీ పక్కనున్న వారిలో నూ నీ ఆత్మ కనపడుతుంది. అందరితో శత్రుత్వం పోయి మిత్రత్వం పెంచుకుంటావు. నేనే కదా మీ అందరినీ సృష్టించినది.

ఈ నాలుగు సూత్రాలూ అర్ధం చేసుకుని పాటించగలిగితే మీరు సత్ చిత్ ఆనంద్ లు అయి సంతోషంగా జీవితం గడుపుతారు. ఈ ఉపనిషత్  లో మిగతా శ్లోకాలు మీకు అనవసరం. అవి పై సూత్రాలు  పాటించలేని వారికి.

Summary written in English for people who do not know how to read Telugu.

We think most of the problems we encounter in life relate to the imperfect nature of others. And we want them to change so that we can solve all our problems. This is difficult to do because there are many. Instead if we change ourselves it is easy to get along with others.


Here the Upanishad says you are part of a creation as everybody else around you. In every living being I am there as a creator. First you get a sense of me in you by meditating . Once you realize me in you, you can see me everywhere around you and start loving everybody as you recognize everybody as you (We all love ourselves first). As the world is moving forward all the time, whatever happened in the past, forget them and enjoy your life without aspiring for another person's wealth.

నా మాట:
దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి.

1. Swami Aparajitananda

2. The Upanishads