Thursday, May 2, 2024

206 ఓ బుల్లి కధ ---చికాగో టు సియాటిల్ ప్రయాణం

 అమెరికాలో చలికాలం వెళ్ళి వసంతకాలం వచ్చింది . ఇంక జనం తిరగటం మొదలెడుతారు . దాదాపు అందరూ, తక్కువదూరం అయితే కార్ల ల్లోనూ , ఎక్కువదూరం అయితే విమానాలలోనో వెళ్తూ  ఉంటారు.  కొందరు వాళ్ళ వాళ్ళ చిన్న విమానాలలో కూడా వెళ్తూ ఉంటారు. మా ఇంటి పక్క ఒక చిన్న విమానాశ్రయం ఉంది. ఆ చుట్టు  పక్కల ఉన్నఇళ్ళ వాళ్ళకి చిన్న చిన్న  విమానాలు ఉన్నాయి. మనం కార్లో వెళ్ళొచ్చినట్లు విమానాల్లో వెళ్ళొచ్చి విమానాల్ని వాళ్ళ ఇంటి గరాజ్ లో పెట్టుకుంటారు. కాకపోతే గరాజ్ లు కొంచెం పెద్దగా ఉంటాయి. మాకు అటువంటి సౌకర్యము లేక సియాటిల్ వెళ్ళటానికి కమ్మర్షియల్  ప్లేన్ లో వెళ్లాలని రిజర్వేషన్ చేసుకున్నాము. మేముండే చోటుకి ఏర్పోర్ట్ ముఫై మైళ్ళ దూరం. అందుకని టాక్సీ మాట్లడుకున్నాము. ప్లేన్లో  నాలుగు గంటల  ప్రయాణానికి ఏర్పోర్టు కి  రెండుగంటల ముందు వెళ్ళాలి. టాక్సీ ప్రయాణం ఒక గంట. మొత్తం సియాటిల్ ప్రయాణం ఏడు  గంటల పడుతుంది . అంటే రెండు వేల మైళ్ళ ప్రయాణం ఏడు గంటల్లో చేసెయ్యవచ్చు. మంచి సౌకర్యమే. సాయంత్రం భోజనం టైం కి ఇంటికి జేరతాం.

సామాన్లు సర్దటం త్వరగా పూర్తవటం మూలంగా టాక్సీ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చున్నాను . సామాన్యంగా ప్రయాణం చేయబోయే రోజు ఇంట్లో మేము మాట్లాడుకోము. అంతా  నిశ్శబ్దం. మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోవటమే. ఏ ప్రయాణంలో అయినా మన కంట్రోల్  లో లేనివి చాలా ఉంటాయి. అందరూ టెన్షన్  లో ఉంటారు. ఎవరికయినా కోపాలొస్తే పెద్ద గొడవ అవుతుంది. ఒకసారి ఏర్పోర్ట్ కి సగం దూరంలో ఉన్నప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయినదని సమాచారం వస్తే టాక్సీ వాడ్ని బతిమాలుకొని  అదే టాక్సీలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. రిజర్వేషన్స్  అన్నీ ఇంటావిడ చేస్తుంది. నేను నోరు మెదపలేదు. ఆరోజు చాలా మౌనం పాటించాము. టాక్సీ ఆయన బతిమాలించుకుని రాను పోనూ చార్జీలు రెండూ తీసుకుని మమ్మల్ని ఇంట్లో దింపాడు. ఆ రోజు వాతావరణం ఏమీ బాగుండలేదనుకొండీ. ఏ పనీ  లేకుండా ఊరికెనే కూర్చుంటే మనస్సు అర్ధం పర్ధం లేని ఆలోచనలతో ఎటో పోతుంది. నా కెందుకో చిన్నప్పటి సంగతులు గుర్తుకు వస్తున్నాయి ఈరోజు .

నా చిన్నప్పుడు ఒకసారి శలవలకి తాతయ్యగారింటికి నెప్పల్లి వెళ్ళాము . అప్పుడు త్రివిక్రమ  పెళ్ళికి గుడివాడ మొగ పెళ్ళివారితో  కలిసి వెళ్ళాము. పిల్లాళ్ళకి ఆరోజుల్లో  పెద్దవాళ్ళు ఏది చెబితే అది చెయ్యటమే. సొంత  ఆలోచనలంటూ ఏమీ ఉండేవి కాదు. అయినా పెద్దవాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని అడిగే వాళ్ళు కాదు. ఆ పెళ్ళికి వెళ్ళిన రోజు ఎందుకో నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను ఐదోక్లాస్ చదివే రోజులనుకుంటాను. మధ్యాహ్నము పెళ్ళివాళ్ళమంతా  రెండెడ్ల బళ్ళల్లో ఎక్కాము. నెమ్మదిగా వెళ్తూ సాయంత్రానికి దారిలో ఒక సత్రంలో ఆగాము. పిల్లలందరికీ అమ్మమ్మ కందిపొడీ, ఆవకాయ ముద్దలు చేసి చేతుల్లో పెట్టింది. రాత్రికి సత్రంలో పడుకున్నాము. మర్నాడు మధ్యాహ్ననికి పెళ్లి ఇంటికి వెళ్ళాము. నాకు పెళ్లి పందిరిలో పెద్ద పెద్ద అరిసెలు లడ్డులూ తిన్నట్లు గుర్తుంది కానీ ఇంకేమీ గుర్తు లేవు.

నాకు అమ్మమ్మను తలుచుకుంటుంటే ఇంకొకటి కూడా గుర్తుకు వచ్చింది. నా వడుగుకి తిరుపతికి రైల్లో వెళ్ళాము. తిరుపతి చేరటానికి రేణిగుంట స్టేషన్  లో దిగి ఇంకో రైలు ఎక్కాలి. సాయంత్రం రేణిగుంట స్టేషన్లో దిగాము. ప్లాటుఫారం మీద కుళాయి దగ్గర మూటవిప్పి అమ్మమ్మ, అమ్మక్కయ్యా కందిపొడీ ఆవకాయ పెద్ద పెద్ద ముద్దలు కలిపి పిల్లల చేతుల్లో పెట్టారు. ముద్దలు అంటే అన్నం ముద్దలు.

నాకు ఎందుకిల్లా ఆలోచనలు అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయో  తెలియదు. ఆ తాతయ్యలూ అమ్మమ్మలూ అమ్మక్కయ్యాలూ ఇప్పుడు ఎవ్వరూ లేరు. అప్పటి సత్రాలు ఇప్పుడు ఉన్నయ్యో లేవో కూడా తెలియదు. రేణిగుంట స్టేషన్ ఉంది కానీ ఆ కుళాయి ఇప్పుడు అక్కడ ఉందో లేదో తెలియదు. కానీ రేణిగుంట నుండి తిరుపతి రైలు ఇప్పుడు పెద్ద పట్టాలమీద పోతోందిట. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే రేణిగుంటలో దిగాల్సిన అవుసరమే లేదుట. ఎందుకో ఆ  జ్ఞాపకాలు అన్నీ  అప్పుడప్పుడూ మనసులో మెదులుతూనే ఉంటాయి.

ఇంటి దగ్గరకు వచ్చినట్లు టాక్సీ ఆయన ఫోన్ చేశాడు.సామాన్లు  తీసుకుని టాక్సీలో ఎక్కాము. ఇంకేముంది ఏర్పోర్ట్ కి వెళ్లిన తర్వాత  క ర్బ్ సైడ్ లో సామాను ఇచ్చేసి సెక్యూరిటీ లో పని పూర్తి చేసి , గెట్ దగ్గర సియాటిల్  ప్లేన్ ఎక్కటమే.