Monday, September 6, 2021

174 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 5 ముగింపు (Ishopanishad)

దాదాపు రోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. మన పని రోజు మొదలవుతుంది. అలాగే సాయంత్రం అస్తమిస్తాడు. మన పని రోజు ఆగిపోతుంది. రాత్రి మొదలవుతుంది.

రాత్రిపూట చంద్రుని వెలుగులో విశ్రమిస్తాము. అది కూడా సూర్య భగవానుడు మనకోసం ఇచ్చిందే. స్వయంగా చంద్రునికి కాంతి నిచ్చే శక్తి  లేదు. సూర్యునికి మనమీద ఎందుకు అంత  ప్రేమ ? 

సూర్యుడు సముద్రాలూ నదులలో నీళ్ళని ఆవిరిగా మార్చి మేఘాలుగ చేసి మన వేపు తీసుకు వచ్చి వర్షాలు కురిపించి పంటలు పండిస్తాడు. ఎందుకలా సూర్యుడుచెయ్యాలి ?

మనం బతకాలంటే గాలి లోని ప్రాణవాయువు పీల్చాలి. బొగ్గుపులుసు గాలిని వదలాలి. మళ్ళా  గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువు తో నింపటానికి సూర్యుడు కావాలి. చెట్ల ఆకులద్వారా బొగ్గుపులుసు వాయువు తీసుకుని దానిని మార్చి ప్రాణవాయువు గాలిలోకి పంపుతాడు. 

ఇంతెందుకు మన జీవితం సుఖంగా గడపటానికి కావలసిన విటమిన్ డి ఇచ్చేది కూడా సూర్యుడే. శరీరానికి కొంత సేపు ఎండ తగిలితే చాలు. 

మనం గుర్తించినా గుర్తించక పోయినా మన జీవితం అంతా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి అవన్నీ ఎందుకు చేయాలి ?. తన కర్తవ్యం కాబట్టి. 

అందుకే యాజ్ఞవల్క్య మహా ముని రోజూ సూర్య భగవానుని ఆరాధించే వాడు. అప్పుడు  తన మనసులో మెదిలిన భావాలతో కూర్చినదే, ఈశా వాస్య  ఉపనిషత్. దానిలో కొన్ని ముఖ్య మంత్రాలు.

శాంతి మంత్రం:

 ఓం పూర్ణ మదః  పూర్ణమిదం  : అది పూర్ణం ఇది పూర్ణం 

పూర్ణా పూర్ణ ముదశ్చతే      : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినది 

పూర్ణస్య  పూర్ణమాదాయ పూర్ణ మేవా  వశిష్యతే  : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినా ఆ పూర్ణం పూర్ణమే 

ఓం శాంతి  శాంతి శాంతిః॑

పరమాత్మ పూర్ణం. ఆ పూర్ణం నుండి వచ్చిన ఈ జగత్ పూర్ణం. అంతేకాదు ఈ పూర్ణం ఆ పూర్ణం నుండి రావటం మూలాన ఆ పూర్ణం ప్రతిభ ఏమీ తగ్గలేదు అది ఇంకా పూర్ణముగానే ఉంది. 

ఇక్కడ పూర్ణం అంటే సంపూర్ణం అని అర్ధం తీసుకుంటే మనకి శ్లోకం తేలిగ్గా అర్ధం అవుతుంది. ఉదాహరణకి: ఒక గింజ మొక్కగా మారుతుంది. అదే పెద్దదయి పూవులు కాయలు గాచి గింజలు తయారుచేసి ఎండిపోయి నశిస్తుంది. మళ్ళా ఆ గింజల నుంచి మళ్ళా మొక్కలు చెట్లు వస్తున్నాయి. మొక్క జీవితం ఒక స్వయం ప్రవర్తక క్రియ (automatic ). నిదానించి చూస్తే ప్రకృతిలో ఇటువంటివి ఎన్నో.

మనతో సహా ఈ జగత్ ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టే, ఆ "పూర్ణం"నుండి వచ్చిన ఈ "పూర్ణం", స్వ  "పూర్ణం"  మన ప్రమేయం లేకుండా, రోజూ తన పని తాను చేసుకుపోతుంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి , పంటలు పండుతున్నాయి. మనం జీవించటానికి ఆహారం, నీళ్ళు, గాలి లభ్యమవుతున్నాయి. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. మన ప్రమేయంలేకుండా నే కాలచక్రం ముందుకు కదిలిపోతూ ఉంది ఎందుకంటే మనమూ మనని సృష్టించిన పరమాత్మ రెండూ  సం "పూర్ణం"(Complete ) మరియూ స్వ "పూర్ణం"(automatic ) కూడా. 

మొదటి మంత్రం:

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  :   తప్పకుండా(వాస్య) పరమాత్మ(ఈశా) అని గుర్తించు 

యత్కించ  జగత్యామ్  జగతు     :       ప్రపంచంలో నీకు కనపడేదంతా

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)      :      ఈ కొత్త దృక్పధంతో చూడటం నేర్చుకుని (జీవితం) ఆనందంగా గడుపు

మాగృతః  కస్య  సిద్దనం                :     ఇంకొకళ్ళ ధనం కావాలని కోరుకోకుండా 

ప్రపంచంలో కనపడే అన్ని జీవులలోనూ పరమాత్మ అంశాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఇంకొకళ్ళ సంపదకు ఆరాటపడకుండా జీవితం ఆనందంగా  గడుపు. 

ఇక్కడ ఆనందంగా గడుపు అంటే బార్లకి, క్లబ్బులకి వెళ్ళి తాగి తందనాలాడమని కాదు. పరమాత్మను స్మరిస్తూ ప్రార్ధిస్తూ జీవితం ఆనందంగా గడపమని. అలాచేయలేము అనుకుంటే క్రింది శ్లోకంలో చెప్పినట్లు చెయ్యమని ఉపనిషత్ చెబుతోంది..

రెండవ మంత్రం  :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రత్త గా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.

మన జీవితంలో మనం చేసే పనులు చాలావరకు ఇతరులతో చెయ్యవలసి ఉంటుంది. అందరినీ అన్నిటినీ మనం కట్టుబాటులో ఉంచలేము. వారి వారి కర్మ ఫలాల ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెయ్యగలిగినదల్లా మంచి జరగాలని ప్రార్ధించటమే.

చివరి పద్దెనిమిదవ మంత్రం :

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్ :  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్ : మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో : మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ :   నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా నీకు నన్ను నేను అర్పించుకోవటమే. 


No comments:

Post a Comment