Monday, June 21, 2021

167 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -2 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతా నీ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని, ఆ ప్రశ్నకి బదులు నీకు భోగభాగ్యాలూ, వజ్ర వైఢూర్యాలూ, అప్సరసలూ ఇస్తానన్నాను. అవి అన్నీ అశాశ్విత ఉల్లాస వస్తువులు (Pleasurables ) అని వాటిని తిరస్కరించావు. నేర్చుకోవాలనే జిజ్ఞాస నీలో ఉంది అందుకే క్లిష్టమైన నీ ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబట్టావు. నచికేతా నువ్వు నాకు నచ్చావు నీలో మంచి విద్యార్థి లక్షణాలు ఉన్నాయి. గురువుకి మంచి విద్యార్థి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పి నచికేతుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఉపక్రమించాడు యమ ధర్మరాజు.

మన జీవిత రధానికి (Chariot ) పంచేంద్రియాలనబడే  అయిదు గుర్రాలతో సవారీ కట్టాము అనుకుంటే, వాటిని విభిన్న కోరికలతో తోలుతుంటే మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్తాయో  చెప్పలేము. అదే ఒకే కోరికతో  మనస్సుని కేంద్రీకరించి సవారీని నడిపితే మనము అనుకున్న చోటుకు (Our Goal ) అవి చేరుస్తాయి. ప్రలోభాలకు ఆకర్షణలకీ లొంగకుండా మనం సాధించ వలసిన పని మీద మనస్సుని కేంద్రీకృతం చేస్తే ఆ పని సాధ్యమవుతుంది.

మానవులకు జీవిత పయనంలో ఎదురుకుండా కనపడేవి రెండే రెండు మార్గాలు. మొదటిది మంచి మార్గం (Sreyas  ) రెండొవది ఉల్లాస  (Preyas  ) మార్గం. ఏ మార్గములో వెళ్ళాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇది దేవుడు నీ కిచ్చిన వరం. 

నేను అంటే ఈ దేహమే అనుకుని, ఈ దేహం కృంగి కృశించి క్షీణించి పోయి మాయమయ్యేదాకా  పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ ఉల్లాసంగా తిరగవచ్చు. ఈమార్గం పాటిస్తే వివిధ దేహాలతో పునర్జన్మించి మరల మరల నా (యముని) కట్టడికి చేరాల్సి వస్తుంది. 

పంచేంద్రియాల ఆకర్షణలకి లోబడకుండా రెండవ మార్గంలో వెళ్ళి తన దేహంలోని అంతరాత్మ తో మమేకమయితే జన్మ రాహిత్యంతో మోక్షం సంపాదించ వచ్చు.

ఈ మనలోని ఆత్మ ఎవరిలోనో ఒకచోట మాత్రమే జన్మించటం జరగలేదు. అందరిలోనూ ఉంది. దానికి ఆకారం లేదు దానికి చనిపోవటం కూడా లేదు. అది చూడటానికి కనపడదు. కానీ అది ఉందని కనుక్కో వచ్చు (realization ). ప్రతి వారిలోనూ గుండె చుట్టూతా నూటొక్క నరాలు ఉంటాయి. అందులో ఒక నాడి కపాలానికి వెళ్తుంది. దాని పేరు సుషుమ్న(Sushumna ) నాడి. వాటితో ఈ ఆత్మ గుండె లోతుల్లో ఆసీనమై ఉంది. ఎవరైతే  వారి పంచేంద్రియాలనూ అధికమించి కోరికలను జయించి వారి లోని ఆత్మను కనుగొంటారో వారికి బాధలూ భయాలూ లేకుండా జన్మ రాహిత్యం కలుగుతుంది.

ఆత్మ చూసేది కాదు, అది కనపడదు, చెప్పేది కాదు, మాటలతో చెప్పలేము, తెలివితో వెతకలేము, అది మన తెలివికి అందదు. ఎవరికీ వారు ఆస్వాదించి అనుభవించాల్సిందే. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో (సహాయంతో) సాధించ వచ్చు.


ఈ పోస్ట్ ఇంతటితో ముగిస్తాను. చెప్పిన వన్నీ నెమరువేసుకుని జీర్ణించుకుని , ఆత్మ గురించి అంతా చెప్పానో లేదో ఆత్మ పరిశీలన చేసుకుని తర్వాతి పోస్ట్ తో వస్తాను. ఇంతలో మీరుకూడా ఆత్మను గురించి ఆలోచించండి.


నా మాట:

వేల ఏళ్ళక్రిందట నరములు (Nerves System ) గురించి ఆలోచించి దాని ఉనికిని చెప్పటం !, అప్పటి ఋషుల ఆలోచనా ప్రతిభకి వందనాలు. వాళ్ళ ధ్యేయం ఒకటే మానవులు సుఖంగా  బాధలూ భయాలూ లేకుండా జీవించటానికి మార్గాలు వెదకటం. వారందరూ ఆశ్రమాలు స్థాపించి  పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు. జీవనాధారం యాచన. పతంజలి యోగ శాస్త్రము, ధన్వంతరి ఆయుర్వేదం, శు ష్రుత సంహిత (Medicine and surgery )  మొదలగునవి వీటికి ఉదాహరణలు.

ఋషులు వారి వారి మేధా శక్తులతో కొన్ని మంచి పద్దతులను కనుగొన్నారు. మనందరికీ అర్ధం చేసుకునే తెలివితేటలు ఒకేవిధంగా ఉండవు కనుక, ఆ మంచి పద్దతులను, అందరికీ ఉపయోగ పడేలా దైనందిన జీవన శైలిలో ఆచారాలుగా మార్చారని నా నమ్మకం. 

ఇంద్రుడు , యముడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని దేవుడు మొదలగు నవి దేవలోకంలో ఆయా శాఖల అధిపతులపేర్లు(Titles ). వారు సంపాయించిన పుణ్యం బట్టి వారు సీట్లు మారుతూ ఉంటారు. వారి కన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తే సీటు ఇవ్వాల్సిందే. ఉదాహరణకి యమధర్మరాజు తనకు ఆ  ఉద్యోగం రావటానికి కారణం తాను చేసిన యజ్ఞమని నచికేతునితో ఒకానొక సమయంలో చెబుతాడు.


ఈ నా పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda,  and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.

No comments:

Post a Comment