| Snow in Seattle |
Sunday, December 26, 2021
187 ఓ బుల్లి కథ -- స్నో ఇన్ సియాటిల్
Sunday, December 19, 2021
186 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ -7 (Prasnopanishad )
ప్రశ్నోపనిషత్ లో ఇంతవరకూ అయిదుగురు శిష్యులు వేసిన వేదాంత ప్రశ్నలకు గురువుగారు పిప్పలాదుల సమాధానాలు చూశాము. చివరి ప్రశ్న ఆరో ప్రశ్న సుకేశ భరద్వాజ క్రింది విధంగా వేశాడు :
"కోసల దేశానికి యువరాజయిన హిరణ్యనాభుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, పదహారు అంగాల పురుషుడు (షోడశకలం పురుషం వేత్థ ) ఎవరో నీకు తెలుసా ? అని. అబధ్ధం చెబితే వారు సమూలంగా నశించి పోతారు. (అందుకని)నాకు తెలియదు అని చెప్పాను. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి " అని . (6-1)
అతనితో మహర్షి ఇలా చెప్పాడు: "ఓ సౌమ్యా ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోపల హృదయంలో ఉన్నాడు. ఆ బ్రహ్మ నుంచే పదహారు అంశాల ప్రపంచం ఉద్భవించింది"అని. (6-2)
ఆత్మ నుండి ప్రాణము, తన నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇంద్రియాలూ, మనస్సు, ఆహారం ఉద్భ వించాయి. ఆహారం నుండి శక్తి , తపస్సు, మంత్రాలూ, లోకాలూ, క్రియలూ వచ్చాయి. లోకాల పేర్లు సృష్టించ బడ్డాయి. (6-4)
మంత్రంలో చెప్పినవన్నీ మనం బ్రతకటానికి కావాలి. "బ్రతకటం" అనేది శరీరమునుండి విడిపోయినప్పుడు, శక్తి స్వరూపాలు అన్నీ వాటి వాటి మూలాల్లో కలిసి స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. అంతేకాదు నదులు, ఏ విధంగా సముద్రంలో కలిసినప్పుడు వాటి నామరూపాలు వదిలే స్తాయో ఆవిధంగా, జీవించటానికి సృష్టించ బడిన వన్నీ మరణ కాలంలో వాటి వాటి నామరూపాలు వదిలి ఆత్మలో కలిసిపోతాయి.
(పిప్పలాదులు) వారితో చెప్పాడు : నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినదింతే . ఇంతకుమించి ఏమీ లేదు. (6-7)
గురువుగారు తనకు తెలిసిన దంతా చెప్పాను అన్న తరువాత శిష్యు లందరూ వారికి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించినందుకు గురువుగారికి, గురువుగారి గురువులందరికీ (గురు పరంపర) నమస్సులు అర్పిస్తారు. (6-8)
నామాట:
వేటినయినా సృష్టించాలంటే శక్తి (energy ) కావాలని మనందరికీ తెలుసు. దానికి ఆకారం, రంగు రుచి వాసనా లేవని కూడా తెలుసు. దానిని చూడలేము పట్టుకోలేమని కూడా తెలుసు. ఉదా: విద్యుత్, మైక్రోవేవ్, ఆకర్షణా శక్తి వగైరా.
విద్యుత్ శక్తి నుండి మైక్రోవేవ్ శక్తి వస్తుంది, ఆకర్షణా శక్తి కూడా వస్తుంది. మనం అర్ధం చేసుకోవటం కోసం మూడింటినీ శక్తి-1, శక్తి-2, శక్తి-3 అని పిలవకుండా విడి విడిగా పేర్లు పెట్టుకున్నాము.
అల్లాగే శక్తి స్వరూపమయిన సృష్టికర్తకు, తాను సృష్టించిన శక్తి స్వరూపాలకు, మన అవగాహన కోసం పేర్లు పెట్టి పిలుస్తున్నాము.
విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రాణం, సూక్ష్మ శరీరం, కారణశరీరం ఇవన్నీ శక్తి స్వరూపాలు. శరీరం లోకి జేరి దానికి జీవత్వం ఇస్తాయి, వచ్చిన పని అయిపోగానే జీవాత్మ లోకి శక్తి స్వరూపాలు మిళిత మవుతాయి; అస్తమించే టప్పుడు సూర్య భగవానుడు లోకి కిరణాలు కలిసిపోయి నట్లు. మళ్ళా ఇంకొక శరీరం చూసుకుని ఆ శరీరంలో విప్పారి, ఉదయపు సూర్య కిరణాలు విప్పారినట్లు, మిగిలి పోయిన పాప కర్మలు అనుభవించేటట్లు చేస్తాయి.
జీవితంలో మనకిచ్చిన చిన్న విచక్షణ జ్ఞానంతో చేసిన పాప పుణ్యాలన్నీ సూక్ష్మ, కారణ శరీరాల్లో క్రోడీకరించి ఉంటాయి, తప్పించుకోలేము. మనసులో వాటిని తలుచుకోండి చాలు బయటికి వస్తాయి. వాటి పరిణామాలు మనం అనుభవించే దాకా మనము పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అందుకనే ఈ చావు బ్రతుకుల విలయం నుండి తప్పించుకోటానికి మంచి పనులు చెయ్యటానికి ప్రయత్నించటం మంచిది.
క్లుప్తంగా ఇదీ సంగతి.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :
Prashna Upanishad - Ancient Indian View on Creation, Time, Matter and Soul
Monday, December 6, 2021
185 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 6 (Prasnopanishad )
సూక్ష్మంగా చెప్పాలంటే ప్రశ్నోపనిషత్ అంతా ఆరుగురు శిష్యులు అడిగిన ప్రశ్న లకు గురువుగారి సమాధానములు. నలుగురు శిష్యుల ప్రశ్నలకి గురువుగారు సమాధానములు చెప్పిన తరువాత, గురువుగారిని శిష్యుడు శైబ్య సత్యకామ అయిదవ ప్రశ్న క్రింది విధంగా వేశాడు :
అధ్యాయం 5 శ్లోకం 1: (5-1)
అథ హైనం శై బ్య: సత్యకామః ప్రపచ్చ : దాని తర్వాత శైబ్య సత్యకామ అడిగాడు
స యో హ వై తద్భగవన్మనుష్యేషు : ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా
ప్రాయణా న్త మో ర మభిధ్యాయీత : మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే
కతమం వావ స తేన లోకం జయతీతి : అతడు దానివలన ఏ లోకానికి వెళ్తాడు అని
ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకాలకి వెళ్తారు? అని శిష్యుడు శైబ్య సత్యకామ గురువుగారు పిప్పలాదుడిని అడిగాడు.
ఇక్కడ ఓం కారం గురించి ఒక మాట చెప్పాలి. "ఓం" అని నోటితో అనాలంటే మనం "అ " "ఉ " "మ " అనే మూడక్షరాలను కలిపి ఉచ్చరించాలి.
అధ్యాయం 5 శ్లోకం 6: (5-6)
తిస్రో మాత్రా మృత్యుమత్య: ప్రయుక్తా అన్యోన్యసక్తా : : ఈ మూడు మాత్రలూ విడిగా వాడితే (ఉచ్చరిస్తే ) అనిత్య ఫలం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా
అనవిప్రయుక్తా: క్రియాసు : ధ్యానంలో సరీగ్గా వాడితే
బాహ్యాభ్యన్తరమధ్యమాసుజ్ఞ సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతేజ్ఞః : జాగృత్ సుషుప్తి స్వప్నావస్తలకు పరమాత్మను గుర్తించిన జ్ఞాని చలించడు.
ఇక్కడ చెప్పేదేమిటంటే విడి విడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే అది పనిచేయదు, ఓంకార ఫలం పొందాలంటే ఓంకారం జపించేటప్పుడు అక్షరాలన్నీ పెనవేసుకుని ఒకటిగా రావాలి.
విడివిడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే, ఒక మాత్ర "అ " తో జపిస్తే నూ, రెండుమాత్రలు "అ " "ఉ " లతో జపిస్తే దేవతలు వారి వారి లోకాలకు తీసుకువెళ్ళి వారి వారి ఫలితం అనుభవించిన తరువాత మనుష్యలోకానికి తెస్తారు. మూడక్షరాలూ పెనవేసుకుని ఓంకారం జపిస్తే సామవేద దేవత వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం పొందుతారు. (5-7)
నామాట :
"పై లోకాలు" అనే మాటని అర్ధం చేసుకోటానికి ఈ క్రింది విశ్లేషణ ఉపయోగ పడచ్చు :
1. లోకాలు ఉన్నాయి అనే మాట విని ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు. మన ఎదురుకుండా మనమే ఒక లోకాన్ని సృష్టించాము. అదే "Satellite " లోకం. మనము సృష్టించిన కొన్నివేల ఉపగ్రహాలు దానిలో తిరుగుతున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడికి మానవులు వెళ్తున్నారు వస్తున్నారు (space Station).
2. మన శరీరం ఒకటిగా పైకి కనిపించినా అది వేద శాస్త్ర ప్రకారం మూడు శరీరాల కలయిక అని చెబుతారు ("స్థూల శరీరం" (physical body ) , "సూక్ష్మశరీరం" (subtle body ), "కారణ శరీరం" (casual body )).
మన "స్థూల శరీరం" (physical body ) మనకు కనపడే మన శరీరం.
జ్ఞానేంద్రియాలనుండి వచ్చే సంకేతాలను వాటికి తగినట్టు ప్రతిస్పందన చేసిన తర్వాత "మనసు" లో నిక్షిప్తం (record ) చేసేది "సూక్ష్మశరీరం" . మన జీవత్వానికి కారణం ఇదే.
మన మనసులో దాచిపెట్టబడిన సంకేతాలతో మన మనస్సు మనకి కొన్ని గుణాలు ఇస్తుంది.
"బుద్ధి" "జ్ఞానం" అనేవి నిక్షిప్తమైన సంకేతాల్ని వడగట్టితే (process ) వచ్చేది.
"చిత్తం " అనేది మనసులోనున్న సాంకేతాలను అవసరమైనప్పుడు బయటకు తెచ్చేది.
"అహంకారం" మన మనసులో పోగు చేసుకున్న సమాచారాన్ని మన సొంతం అని వక్రీకరించగా వచ్చేది. ఇవి మనం అందరం మనకు తెలీకుండా రోజూ ఉపయోగించేవే.
మన జీవిత రహస్యాలను దాచి పెట్టుకునేది "కారణ శరీరం" (casual body ). మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనని కనిపెట్టుకుని ఉండేది ఇదే. మనం గాఢ నిద్ర పోయామని మరునాడు గుర్తు పెట్టు కొని చెప్పేది కూడా మనలోని "కారణ శరీరం".
మన శరీరం వదిలిన తరువాత మన జ్ఞాపకాలతో ప్రయాణించేవి సూక్ష్మ, కారణ శరీరాలు. మన ప్రారబ్ధం నిర్ణయించేది వీటిలో నిక్షిప్తం చేసిన సమాచారమే.
మనం నిద్ర కుపక్రమించే టప్పుడు wake up state లో ఉంటాము , తరువాత Dream లోకి వస్తాము ఆ తరువాత Deep Sleep లోకి వెళ్తాము వీటినే జాగృత్, స్వప్న, సుషిప్తి అంటారు. వీటిని గురించి మాండూక్యోపనిషత్ లో వివరంగా తెలుసుకుందాము.
3. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్ గురించి చర్చించే టప్పుడు ఇంకా తెలుసుకుందాము. ఓంకారం ఏవిధంగా ఉచ్చరించాలనేది గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి క్రింద లింక్ ఒకటి ఇచ్చాను.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :
Wednesday, December 1, 2021
184 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 5 (Prasnopanishad )
శిష్యుల వేదాంత ప్రశ్నలకి గురువుగారి సమాధానాలే ఈ ప్రశ్నోపనిషత్. ఇంతవరకూ వేసిన ప్రశ్నలు, జగత్ సృష్టి ఎల్లా మొదలయింది, దానిలో మనుషులు ఎల్లా ఉద్భవించారు, ఎల్లా జీవిస్తున్నారు, ఎల్లా నిష్క్రమిస్తారు అని.
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
"ప్రాణం" శరీరం లోకి ప్రవేశించి అయిదు విధాలుగా విభజించుకుని మానవునిలో జీవత్వానికి మూలం అవుతుంది. కర్మ ఫలములు అనుభవించిన తరువాత "ప్రాణం" శరీరంలోనుండి నిష్క్రమించిన వెంటనే శరీరంలో జీవత్వం పోతుంది.
ఇంక ఈ నాలుగవ అధ్యాయంలో శిష్యుడు అడిగిన నాల్గవ ప్రశ్నకి గురువుగారిసమాధానం చూద్దాం.
అధ్యాయం 4 శ్లోకం 1: (4-1)
అధ హైనం సౌర్యాయణీ గార్ఘ్యహః ప్రపచ్చ : మూడవ ప్రశ్న తరువాత సౌర్యాయణీ గార్గ్యుడు గురువుగారిని అడిగాడు
భగవన్నెత స్మిన్పురుషే కాని స్వపస్తి కాన్యస్మి జ్ఞాగ్రతి ? : ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేలుకొని ఉంటాయి?
కతర ఏష దేవః స్వప్నాన్పశ్యతి కస్త్యైతత్సుఖం భవతి? : ఏ దేవుడు కలలను చూస్తాడు? ఈ సుఖం ఎవరికి చెందుతుంది?
కస్మిన్ను సర్వే సమ్ప్రతిష్ఠితా భవన్తీతి : ఎందులో అన్నీ లయమవుతాయి అని.
మనని ఎవరన్నా రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగితే ఏం చెబుతాము ? నిద్ర పట్టలేదనో, లేక రాత్రంతా కలలు అనో లేక హాయిగా నిద్ర పోయననో చెప్తాము.నిద్ర పట్టక పోవటం, రాత్రి కలలు రావటం ఒక విధంగా మనకు తేలుస్తాయనుకోవచ్చు. కానీ గాఢనిద్ర పోతున్నప్పుడు మన అవయవాలు ఏమీ పని చేయవే అటువంటప్పుడు మనము హాయిగా నిద్ర పోయామని ఎలా గుర్తుపెట్టుకుని చెబుతాము?
ఇదే సందేహం శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య కి వచ్చి గురువుగారిని అడుగుతాడు.
ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో నిద్రిస్తున్నప్పుడు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి , ఏవి కలలను చూస్తాయి, (గాఢనిద్ర) పోతున్నప్పుడు వ్యక్తి శరీరంలో ఆ సుఖం అనుభవించి గుర్తుపెట్టుకుని చెప్పే వారు ఎవరు ? అని అడుగుతాడు. (4-1)
గురువు పిప్పలాదుడు శిశుడు గార్గ్యకి చెబుతాడు: అస్తమించే సూర్యుడు తన కిరణాలనన్నీ తీసుకు పోయి మరునాడు ఉదయిస్తున్నప్పుడు తన కిరణాలను ఎలా విస్తరిస్తాడో అలాగే శరీరంలోని ఇంద్రియాలు నిద్రలో మనసుతో లీనమయి, మెలుకవ తో వాటి పనులతో ప్రజ్వరిల్లుతాయి. అందుకని నిదురలో ఉన్న వ్యక్తి, వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించడు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు , నిద్రిస్తాడు. (4-2)
ప్రాణ రూపంలో ఉన్న అగ్నులు మాత్రమే ఈ శరీరంలో మేలుకొని ఉంటాయి. (4-3)
( పంచ ప్రాణాలూ, మనస్సు మాత్రమే మేలుకొని ఉంటాయి. ఇక్కడ అగ్నులు అంటే మనం మనశరీరంలో కణాలలో అగ్ని ద్వారా జరిగే శక్తి ప్రక్రియ అని అన్వయించుకోవచ్చు. )
"సమానం" ఉచ్వాస నిశ్వాసాలను సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాగే "ఉదానం" మనసనే యజమానిని (నిద్రతో) ఆనందం పొందేలా చేస్తుంది. (4-4)
ఇక్కడ ఈ మనస్సు అనే దైవం కలలో, చూసిన వాటినీ చూడనివాటినీ , చూస్తుంది, వినినవాటినీ వినని వాటిని కూడా వింటుంది, అనుభవించినవీ అనుభవించనివీ, నిజమైనవీ నిజంకానివీ అన్నింటినీ చూస్తుంది. (4-5)
(ఇక్కడ అనుభవించనివీ, చూడనివీ ఎల్లా చూస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి పండితులు చెప్పే సమాధానం అవన్నీ పూర్వ జన్మ వాసనలయి ఉండచ్చని. ).
వాసనలు నిలువచేసి ఉన్న చిత్తానికి అడ్డు తగిలినప్పుడు కలలు వచ్చుటకు వీలులేక "సుషుప్తి" (గాఢ నిద్ర) శరీరానికి వచ్చి ఆనందిస్తుంది. (4-6)
ఓ సౌమ్యుడా పక్షులు పగలు ఏవిధంగా దేశసంచారము చేసి రాత్రికి వాటి చెట్టులో ఉన్న గూటికి చేరుకుంటాయో అటులనే అవి అన్నీ (శరీరంలో ని వన్నీ) పరమాత్మను చేరుకుంటాయి. (4-7)
అవి అంటే శరీరంలో ఉన్న పంచ భూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచప్రాణాలూ, నాలుగు అంతః కరణాలూ పరమాత్మను చేరుకుంటాయి (తురీయంలో లయమవుతాయి). (4-8)
చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)
అన్నీ బ్రహ్మలో ఐక్యమయిన తరువాత బ్రహ్మ గురించి ఎల్లా తెలుస్తుంది. మనమే బ్రహ్మగా మారినప్పుడు బ్రహ్మ జ్ఞానము ఎల్లా తెలుస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం.
హే సౌమ్యుడా కారణ శరీరంలేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)
జీవాత్మ, ఇంద్రియాలూ, పంచ ప్రాణాలూ, పంచ భూతాలూ అన్నీ దేనిలో లీనమవుతాయో (అక్షర బ్రహ్మలో) తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వ వ్యాపకం చెందుతాడు.
నా మాట:
శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య "నిద్ర " గురించి అడిగిన ప్రశ్నకి గురువుగారు పిప్పలాద మహర్షి చక్కటి ఉపమానం చెబుతారు.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన కిరణాలు లోపలికి ఎల్లా తీసుకుంటాడో , "నిద్ర" వచ్చేటప్పుడు ఒక వ్యక్తిలో అటువంటిదే జరుగుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా వాటి పాటవాన్ని తగ్గించుకుంటూ విశ్రమణకు చేరుకుంటాయి. అందుకనే ఆ వ్యక్తి నెమ్మదిగా విశ్రమించు స్థితి లోకి జారుకుంటాడు. రాను రానూ వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించ డు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు, నెమ్మదిగా నిద్రకి ఉపక్రమిస్తాడు.
జీవితంలో మనస్సులో నిక్షిప్త మయి సంఘటనలు కలల రూపంలో నిద్రలో కనిపిస్తాయి. ఒకప్పుడు మనకెప్పుడూ జరగని సంగతులు కూడా కలల లోకి రావచ్చు. వాటికి కారణం మన పూర్వ జన్మ నిక్షేపాలు కావచ్చు. కలల గమనానికి అడ్డు తగిలినప్పుడు, కలలు ఆగిపోయి "గాఢ నిద్ర" లో మునిగిపోతారు.
సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాల్ని ఎలా వ్యాపిస్తాడో అల్లాగే వ్యక్తి మేలుకుని నిద్ర లేస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి వాటి స్వస్థానాలకి వచ్చి తమ తమ పనులను చెయ్యటానికి ఉపక్రమిస్తాయి.
పక్షులు పగలు దేశసంచారము చేసి రాత్రికి చెట్టులో ఉన్న గూటికి ఎలా చేరుకుంటాయో అటులనే రాత్రిపూట ఇంద్రియాలు వాటి వాటి స్వస్థలానికి చేరుకుంటాయి. "ప్రాణం", మనస్సు తోపాటు అన్నీ జీవాత్మలో విలీనం అవుతాయి.
చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)
హే సౌమ్యుడా కారణం శరీరం లేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:
Monday, November 22, 2021
183 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 4 (Prasnopanishad )
ఇంతవరకూ జరిగిన వృతాంతం:ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు పిప్పలాద ఋషి .
ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ?
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
రెండవ ప్రశ్న భార్గవ వైదర్భి గురువుగారికి వేస్తాడు : భగవాన్ ఒక వ్యక్థి స్థితికి ఎవరు కారకులు వారిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఇక్కడ స్థితి అంటే జీవించటం అని అర్ధం చెప్పుకోవచ్చు.
దానికి గురువుగారు పిప్పలాదులు చెబుతారు : మొదట ఇంద్రియాలు, వాటి వల్లనే వ్యక్తి జీవించకలుగుతున్నాడని గర్వంగా చెప్పేవి కానీ "ప్రాణం" మధ్యలో వచ్చి తానే జీవత్వానికి కారణం అని చెప్పి నిరూపిస్తుంది. అందుకని అన్ని ఇంద్రియాలకీ "ప్రాణం" పొసే "ప్రాణం" శ్రేష్టమైనది అని పిప్పలాదులు సమాధానం చెబుతారు.
మూడవ అధ్యాయం లో గురువుగారికి శిష్యుడు మూడవ ప్రశ్న వేస్తాడు.
మూడవ అధ్యాయం మొదటి మంత్రం: (3-1)
అధ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః ప్రపచ్చ : ఆ తరువాత కౌసల్య అశ్వలాయన అడిగాడు
భవన్కుత ఏష ప్రాణో జయతే కధమాయాత్యస్మిరీరే ? : మహర్షీ ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ శరీరంలోకి ప్రాణం ఎల్లా వచ్చింది ?
ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే ? : తనను తాను విభజించుకుని ఎల్లా ప్రతిష్ఠించు కున్నది?
కేనో త్క్ర మతే ? కథం బాహ్య మభిధత్తే ?: ఎలా బయటకు వెళ్తుంది (శరీరం నుండి) ? ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది ?
కధ మధ్యా త్మ మితి ? :
మూడవ అధ్యాయం రెండవ మంత్రం: (3-2)
తస్మై స హోవాచాతి ప్రశ్నా స్ప్రుచ్చ సి : శిష్యునితో (గురువుగారు) అన్నారు నువ్వు కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు
బ్రాహ్మిష్టో సీతి తాస్మాత్తే హం బ్రవీమి : నీవు బ్రహ్మజ్ఞానివి (అర్ధం చేసుకునే శక్తి ఉన్నది) అందుకు దీనికి సమాధానం చెబుతాను
మూడవ అధ్యాయం మూడవ మంత్రం: (3-3)
ఆత్మన ఏష ప్రాణో జాయతే : ఆత్మ నుండి ప్రాణం పుట్టింది
యథైషా పురుషే చ్చ యైత స్మిన్నే తదాత తం : పురుషుని వల్ల ఏర్పడిన నీడలా
మనోకృతేనా యాత్య స్మి ఇంమి రీరే : కర్మల వలన శరీరంలోకి వస్తుంది
కౌసల్య అశ్వలాయన గురువుగారికి వేసిన మూడవ ప్రశ్న,మనిషిలో "ప్రాణం" ఎల్లా వస్తుంది, శరీరంలో ఎల్లా ప్రతిష్ఠించు కుంటుంది, చివరికి శరీరాన్ని వదలి ఎల్లా వెళ్ళి పోతుంది?, చెప్పమని. (3-1)
గురువుగారు శిష్యుడికి తన సమాధానం అర్ధం కాదేమోనని కొంత తటపటాయించినా, శిష్యుని సామర్ధ్యం తెలిసినవాడు కనుక, ఇది చాలా క్లిష్టమయిన ప్రశ్న అంటూనే దానికి సమాధానం చెబుతారు. (3-2)
ఈ జగత్ అంతటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుండి "ప్రాణం" పుట్టింది. ఎల్లా పుట్టింది అంటే మనం ఎండలో నుంచుంటే నీడ వస్తుందే అలా. "ప్రాణం" పరమాత్ముని నీడ లాంటిది. నీడ ఎంత మిధ్యో పరమాత్ముని అంశం ఈ జగం కూడా అంతే మిధ్య . అది ఏశరీరంలోకి వస్తుంది? మనం చేసిన పూర్వ జన్మ కర్మల ప్రభావం వలన. (3-3)
ఏవిధంగా ఒక చక్రవర్తి పరిపాలన సౌలభ్యంకోసం మంత్రులూ సామంత్రులు మొదలగు వారిని నియమించుకుని పాలిస్తారో అటులనే "ప్రాణం" శరీరంలో తన వారిని విడివిడిగా తగిన స్థానాలలో నియమించుకుని శరీరాన్ని పరిపాలిస్తుంది. (3-4)
"ప్రాణం" తన అంశతో నలుగురు సహాయకులను సృష్టించుకుని , అపానం, సమానం, వ్యనం, ఉదానం అనే నలుగురు, శాఖా బాధ్యతలు అప్పజెప్పింది. అపానం బాధ్యత విసర్జన క్రియ, జీవోత్పత్తి , సమానం కి జీర్ణక్రియ, వ్యనం కి రక్తప్రసరణ క్రియ, ఉదానం కి తిరోగమన క్రియ అప్పజెప్పి ముఖ్యమయిన శ్వాసక్రియ దానికి కావాల్సిని కళ్ళు చెవులు ముక్కు (చక్షు శ్రోత్రే ముఖ నాసికాభ్యం ) తన పరిధిలో ఉంచుకుంది "ప్రాణం". (3,5) (3,6) (3,7)
"సమానం" కి ఉన్న శాఖ జీర్ణక్రియ. తనకు హోమాగ్ని లాగా అర్పించబడిన ఆహారాన్ని తీసికుని పోయి ఏడు జ్వాలలను ఉత్పత్తి చేసి ఏడు ఇంద్రియాలకు శక్తిగా ఇస్తుంది (2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక )
"వ్యానం " శాఖ రక్త ప్రసరణం. ఆత్మ హృదయంలో ఉంది. ఈ హృదయంనుండి 101 నాడులు వస్తాయి (నాడీ నామ్ ఏతత్ ఏకశతమ్ ). వాటిలో ఒక్కొక్క దానికీ నూరు శాఖా నాడులు ఉన్నాయి. ప్రతి శాఖా నాడికీ 72000 ఉపనాడులు ఉన్నాయి (సహస్రాణీ ద్వాసప్తతి:). వీటిల్లో రక్త ప్రసరణక్రియ "వ్యానం "నిర్వహిస్తుంది. (3-6)
"ఉదానం" స్థానం ఊర్ధ్వ భాగం. దీని శాఖ తిరోగమన క్రియ. మనం పడంది తింటే విసర్జన ద్వారా బయటికి పంపుతుంది. ప్రాణాన్ని సరి అయిన లోకాలకు చేర్చటం కూడా దీని పనే. పైకి వెళ్ళే ముఖ్యమైన నాడి "సుషుమ్న" నాడి ద్వారా ఉపాసన చేసిన వారిని "ఉదానం" బ్రహ్మ లోకానికి తీసుకు వెళ్తుంది. మిగతా నాడులు మిగతా వారిని వారి వారి ప్రారబ్ధ కర్మ ప్రకారం, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి , పాపం చేస్తే నరకానికీ తీసుకు వెళ్తాయి. రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి తీసుకు వెళ్తాయి (పాప ముభాభ్యామేవ మనుష్యలోకమ్ ). (3-7)
సూర్యుడే బాహ్య రూపంలో "ప్రాణం". పృథ్వి బాహ్య రూపంలో"అపానం". అంతరిక్షం బాహ్య రూపంలో "సమానం". వాయువు బాహ్య రూపంలో "వ్యానం " (3-8)
శరీరంలో అగ్ని తత్త్వం వెళ్ళి పోయినప్పుడు అన్ని ఇంద్రియాలూ మనస్సులో లీనమయి పోయి ఇంకొక జన్మలో మరల బయటికి వస్తాయి. (3-9)
మరణం సమయంలో అయిదు ప్రాణులూ ఏకమవుతాయి. అందుకనే జీర్ణక్రియ లాంటివి జరుగవు. ఈ సమైఖ్య "ప్రాణం ", మనిషి కోరిన చివరి సంకల్పం ప్రకారం దాని స్ధానానికి వెళ్తుంది. (3-10)
ఎవరైతే "ప్రాణం" గురించి అర్ధంచేసుకుని ఉపాసన చేస్తారో అతని సంతతి ఎన్నటికీ నశించదు, బ్రహ్మ లోకానికి వెళ్తాడు. (3-11)
ఫల శృతి:
"ప్రాణం" ఎలాపుట్టింది? శరీరంలోకి ఎలా వచ్చింది? శరీరంలో ఎక్కడ ఉంది? ఎలా పరిపాలిస్తోంది? ఐదుగా ఎలా విభజించుకుంది ? ఇవన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వ్యక్తి అమరత్వం పొందుతాడు. (3-12)
నా మాట :
మొదట ఈ అధ్యాయం క్లిష్టంగా కనపడుతుంది గానీ రెండుమూడు సార్లు చదివితే తేలికగా అర్ధం చేసుకోవచ్చు.
సూక్ష్మంగా చెప్పాలంటే "ప్రాణం" మానవ శరీరంలోకి ప్రవేశించి, శరీర దైనందిన కార్యక్రమాలకోసం, తనకుతాను అయిదు భాగాలుగా విభజించుకుని, జీవి చేత ప్రారబ్ధ కర్మ ప్రకారం "మానవ జన్మ" అనే శిక్ష అనుభవింప చేసి చివరకి "సుషుమ్న" నాడి ద్వారా నిష్క్రమిస్తుంది.
ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన శాలలో రోజూ ఇటువంటివే ముఖ్యమయిన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
అది ఏమిటి? ఎలా వచ్చింది ? ఏమి పనిచేస్తుంది? మనకేమి ఉపయోగం? ఎట్లా పోతుంది? అనేవి.
ఎన్నో వేల ఏళ్ళ నాటి క్రింద భారత దేశంలో మన పూర్వికులు ఈ పంధాలో ఆలోచించారంటే నిజంగా మనకి మనం మెచ్చుకోవాలి గర్వపడాలి.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:
Tuesday, November 16, 2021
182 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 3 (Prasnopanishad )
ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.
ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ?
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రాహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
రెండవ అధ్యాయం మొదటి మంత్రం.
అధ హైనం భార్గవో వైదర్భి: పప్రచ్చ : ఆ తర్వాత విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అడిగాడు
భగవన్కత్యేవ దేవాః ప్రజాం విధారయన్తే ? : ఏ దేవతలు ఒక వ్యక్తికి స్థితికారకులు
కతర ఏతత్ప్రకాశయన్తే ? : వారిలో ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు
కః పునరేషాం వరిష్ఠ ఇతి : వారిలో ఎవరు శ్రేష్ఠులు అని ( 2-1)
కబంధీ కాత్యాయనుడి మొదటి ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత భార్గవుడు రెండవ ప్రశ్న వేశాడు. ఏ దేవతలు ఒక వ్యక్తి జీవించటానికి కారకులు ? వారిలో ఎవరు శ్రేష్ఠులు అని.
భార్గవుని ప్రశ్నలో దేవతలు అనే పదం వాడారు కానీ ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి లో ఉన్న ఇంద్రియాలు పని చేయటానికి ఎవరు కారకులు, వారిలో ఎవరు గొప్ప అని. మనం దీన్ని ఉదాహరణకి మనకు తెలిసిన జ్ఞానేంద్రియాలు అని అనుకుందాము. జ్ఞానేంద్రియాలు లేక పోతే మనిషికి ఒక స్థితి అంటూ ఉండదు.
మనం ఇంకో ఉదాహరణకి కన్ను తీసుకుంటే, కన్ను ఒక గాజు ముక్క, తన పని అల్లా కాంతికిరణాలని వెనకాల ఒక తెరమీదికి చేర్చటమే. మనము ఆ కిరణాల సముదాయాన్ని గుర్తించటం అనే పని ఇంకొక చోట, మనము చూడలేని చోట, జరుగుతుంది. మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఈ విధంగానే పని చేస్తాయి.
వేల సంవత్సరాల క్రిందట ఈ ప్రశ్న వచ్చిందంటే నిజంగా గొప్పే. ఏ సమాధానం కనపడని ప్రశ్నలకి మనకు కనపడని దేవతలు చేస్తున్నారు అనుకోవటం నా ఉద్దేశంలో సహజమే.
రెండవ అధ్యాయం రెండొవ మంత్రం. (2-2)
తస్మై స హోవాచ : అతడితో పిప్పలాద చెప్పాడు
ఆకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాప: : ఆకాశం వాయువు అగ్ని నీరు
పృథివీ వాజ్ఞ న శ్చక్షు: శ్రోత్రం చ : పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు
తే ప్రకాశ్యాభివదన్తి : దేవతలు వాటి పనిని గురించి గొప్పల చెప్పుకుంటున్నాయి
వయమే తద్బాణ మవష్టభ్య విధారయా మః : శరీరం కలిపివుంచి మేమే శరీరాన్ని భరిస్తున్నాము
మొదట ఆకాశం వాయువు అగ్ని నీరు పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ శరీరాన్ని కలిపివుంచి శరీరాన్ని భరిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని పిప్పలాదుడు చెప్పారు.
నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం , వారే (సంసారం) అంతా భరిస్తున్నా రంటారు.
తాన్వరిష్ఠ: ప్రాణ ఉవాచ : వాటిలో శ్రేష్ఠమైన ప్రాణం అన్నది
మా మొహమా ప ద్యధాహ మేవై : ఎవరుగొప్ప అను భ్రాంతి లో పడకండి (2-3)
కానీ మధ్యలో "ప్రాణం" వచ్చి నన్ను నేనే ఐదుగా విభజించుకుని ఈ శరీరాన్ని స్థంబం లాగా నిలబెడుతున్నాను. ఇంకొకళ్ళు గొప్ప అనే భ్రాంతి లో పడవోకండి అని అన్నది. కానీ ఆ దేవతలు నమ్మలేదు అని చెప్పారు.
అందుకని "ప్రాణం" ఊర్ధ్వ దిశగా వెళ్ళిపోదామని బయలు దేరింది. జ్ఞానేంద్రియాలలో "ప్రాణం" ఉన్నది కాబట్టి అవి కూడా ప్రాణంతో వెళ్ళటానికి సిద్దమైనాయి. మరల "ప్రాణం" తన యధాస్థితికి వచ్చిన వెంటనే అవి గూడావాటి యధాస్థితికి జేరినాయి. అందుకని అన్నిటికన్నా ప్రాణమే శ్రేష్టమైనది అని పిప్పలాదులు అన్నారు.
నా మాట:
నిజ జీవితం లో కూడా ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో గమనించకపోతే కాపురాలూ, కంపెనీలూ పేక మేడల్లాగా కూలిపోతాయి. అటువంటప్పుడే "ప్రాణం" లాగా ఎవరో వచ్చి మేలుకొలిపి రక్షిస్తూ ఉంటారు.
మన దేహం లో అగ్ని లేకపోతే శక్తి లేదు. నీరు లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవదు. వాయువు లేకపోతే మన శ్వాస లేదు. అల్లాగే మిగతా దేవతలన్నీ "ప్రాణ" ప్రేరేపణతో పనిచేసేవే.
ఈ రెండో అధ్యాయం లో మిగతా విశ్లేషణ అంతా "ప్రాణ" స్తుతి. అది ఎంత గొప్పదో చెబుతారు. మనిషిలో ప్రాణం లేకపోతే ఏమిజరుగుతుందో మనకందరికీ తెలుసు.
Sunday, November 7, 2021
181 ఓ బుల్లి కథ -- "ఎమిగ్డలా" (Amygdala) అరుస్తోంది
మన జ్ఞానేంద్రియాల నుండి బయలు దేరిన సంకేతాలు మొదట వెన్నెముక (spinal card ) దగ్గరకి వస్తాయి. అక్కడ వెంటనే చెయ్యాల్సిన పని ఉంటే అది కానిచ్చి మెదడులో థలామోస్ (Thalamus ) అనే చోటుకి జేరతాయి. ఉదా : మనం వేడి పెనం మీద చెయ్యి పిట్టామనుకోండి వెంటనే తీసేస్తామే, ఆ సంకేతం చేతికి వెన్నెముక (spinal cord ) నుండి వస్తుంది. ఆ తరువాత అది థలామస్ కి కూడా వెళ్తుంది.
థలామోస్ ఆ సంకేతాల్ని వెంటనే రెండు చోట్లకి పంపిస్తుంది , "ఎమిగ్డలా" (Amygdala) కి కార్టెక్స్ (cortex ) కి.
"ఎమిగ్డలా" (Amygdala), ఆ సంకేతాలు లో ఏవన్నా అపకారం చేసేవి అని తాను అనుకుంటే వెంటనే అవయవాలకు ఆజ్ఞలు జారీ చేసి ఆ పని ఆపమని చెప్పి చేయిస్తుంది. దీనిని fight flight or freeze (FFF ) response అంటారు. ఎదో ప్రమాదం జరగబోవచ్చని భావిస్తుంది కానీ అది నిజంగా జరుగుతుందో లేదో దానికి తెలియదు. "ఎమిగ్డలా" (Amygdala) గాబరా పడి చేసే ఇటువంటి పనులు చాలా వరుకు జరగవు కానీ మనము "ఎమిగ్డలా" (Amygdala) ప్రేరేపణతో బాధ పడాల్సి వస్తుంది.
చాలా వరకు ఇటువంటి పనులని Obsessive Compulsive Disorder (COD ) అంటారు. మనం ఎదో చెయ్యకపోతే ఏమవుతుందో అనే బెంగతోనో భయంతోనో చెయ్యవలసి వస్తుంది. ఇవన్నీ "ఎమిగ్డలా" (Amygdala) పిలిస్తే (నుంచి) వచ్చిన ఆజ్ఞలు. COD చాలా రకాలుగా వస్తుంది, worry (what could go wrong and potential outcomes), obsessions are another kind of obsessive thinking may involve repetitive thinking (Bruce may continuously thinking everyday that he may not complete his degree although he gets good grades),Perfectionism (people worry about what they do is not perfect), Compulsions ( repetitive behaviors or mental acts that a person engages into respond to a dreaded thought or situation or to reduce distress).
(COD ) ఈ "ఎమిగ్డలా" (Amygdala) చేసే తప్పుల వలన వస్తుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దీనివలన వచ్చేవి anxiety (బెంగ,ఆరాటం, ఆందోళన, చింత), worry (చింతించటం, దుఃఖించటం వగైరా ). మనము కొన్నిపనులు భవిష్యత్ లో జరుగుతయ్యో జరగవనో అని బాధపడుతూ వుంటాము (ఉదా : పెళ్లవుతుందా లేదా, పాస్ అవుతామా లేదా , ఆ అమ్మాయి నన్నుచేసుకుంటుందా? మొదలయినవి ). ఈ పనులు కొన్ని భవిష్యత్ లో జరగచ్చు జరగక పోవచ్చు. మనకి తెలియదు. వాటి కోసం బాధపడుతూ చింతిస్తూ ఏవో చేస్తూనే ఉంటాము.
ఈ "ఎమిగ్డలా" (Amygdala) అరుపుల్ని ఆపడం ఎట్లా? మనస్సుకి తనకి తాను మార్చు కునే గుణం ఉంది కాబట్టి (neuroplasticity ) ఇది సాధ్యము.
మొదట ఇవి "ఎమిగ్డలా" (Amygdala) నుంచి వస్తున్నాయని గుర్తించటం. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనస్సులో ఇంకొక మంచి ఆలోచన తెచ్చుకుని ఆ పాత ఆలోచనని పోగొట్టటం. నిద్రలేమి కూడా ఈ ఆలోచనలకి కారణం కావచ్చు. Mindfulness, మెడిటేషన్, ఒకే వ్యాపకం మీద మనస్సుని కేంద్రీకరించటం చేస్తే కొంచెం ఉపశమనం పొంద వచ్చు.(మన మనస్సు ఏ ఒక సమయంలో అయినా వందల ఆలోచనలతో ఉంటుంది) . బాధలు ఎక్కువగా ఉంటే వైద్యులను కలవటం మంచిది. మన దేశంలో ప్రచారంలో ఉన్న సూర్య నమస్కారాలు, పూజ, ధ్యానం, జపం లాంటివి కూడా ఏకాగ్రతతో చేస్తే ఫలితం కనిపించవచ్చు.
నేను మన "Mind " ఎల్లా పనిచేస్తుందో తెలుసుకోవటం కోసం పుస్తకాలు చదువుతాను. చాలామంది శాస్త్రజ్ఞులు ఈ అంశం మీద పనిచేయటం మూలంగా కొత్త సంగతులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మొన్న ఈ సంవత్సరం ముద్రించిన క్రింది పుస్తకం లైబ్రరీ లో కనబడితే COD గురించి చదివాను. ఆ పుస్తకం వ్రాసిన వాళ్ళు ఇద్దరూ licensed clinical psychologists. మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ఖరీదు $18.95.
Rewire Your OCD Brain (2021)
(Powerful Neuroscience-Based Skills to Break Free from Obsessive Thoughts and fears)
by Catherine M. Pittman, PhD and William H. Youngs, PhDwww.newharbinger.com
