Friday, October 7, 2016

126 ఓ బుల్లి కథ 114 --- పక్కాలా నిలాబాడి ......


నాకు చిన్నప్పట్నుంచీ తెనాలి అంటే చాలా ఇష్టం. నా మొదటి హెయిర్ కట్ అక్కడే చేయించు కున్నాను. నా జీవితంలో మొదటి సినీమా "స్వర్గ సీమ" అక్కడే చూశాను. మొట్టమొదట హోటలికి గూడా అక్కడే వెళ్ళాను. దానికి తోడు అత్తయ్య గారిల్లు  రాముడన్నయ్య ఇల్లు అక్కడే ఉన్నాయి. మేము తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో "కఠెవరం" లో ఉండేవాళ్ళం. తరువాత ఊళ్ళు మారటం అయింది ఎక్కువగా వెళ్ళటా నికి కుదరలేదు.

ఆ తరువాత చాలా ఏళ్ళకి  తెనాలి అత్తయ్య గారింట్లో జయమ్మ పెళ్ళి అంటేను వెళ్ళాము. ఆ రోజు పెళ్ళి అవంగానే పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపారు. తీరిగ్గా పొద్దున్నే లేచి అందరం కాఫీ తాగి హాల్లో కూర్చున్నాము. ఎవరింట్లో వాళ్ళు పెళ్ళి చేసుకునే రోజులవి. ఇంటి ముందర పందిరి ఇంట్లో సందడి ఉండే రోజులు. ఏమిటో పాత జ్ఞాపకాలు బయటకు వస్తున్నాయి.

మా అత్తయ్య గారింట్లో ఇంటి వెనుక పెరడు కన్నా ఇంటి ముందర చాలా ఖాళీ స్థలం. నేను వచ్చినప్పుడల్లా, అత్త య్య పిల్లలతో అక్కడ తొక్కుడు బిళ్ళ నుండీ చెడుగుడు దాకా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం. సాయంత్రం దగ్గరలో ఉన్న చినరావూరు పార్క్ కి వెళ్లే వాళ్ళం.

అత్తయ్య  అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను అమెరికా వెళ్ళి పెద్ద కారు కొని అత్తయ్యని దాన్లో కూర్చోపెట్టి తిప్పాలని చిన్నప్పుడు అనుకునే వాణ్ని. అత్తయ్యది కొంచెం స్థూలకాయం పెద్ద కారు కావాలి అవి అమెరికాలో నే దొరుకుతాయని విన్నాను. అందుకని అమెరికా తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అమెరికా వెళ్ళాను పెద్ద కారు కొన్నాను కానీ అత్తయ్యని దాన్లో తిప్పలేక పోయాను. అప్పటికే ఆవిడ మన ప్రపంచం నుండి వెళ్ళి పోయింది.

అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను గదా. ఆవిడకి కూడా నేనంటే చాలా ఇష్టం. తమ్ముడు శీనయ్య కొడుకుని కదా. తన తమ్ముడికి పెద్ద కూతర్ని ఇచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకుందామని అనుకుందని అందరూ అంటారు. కానీ మా నాన్నకి అక్కయ్య కూతుర్ని చేసుకోవటం ఇష్టం లేదుట. అందుకని ఆ పెళ్ళి జరగలేదు.

నేను వాళ్ళింటికి వెళ్తే ఆవిడ పెరుగుమీద మీగడ, ఆవిడ పిల్లలకు వెయ్యకుండా నాకు వేసేది. వాళ్ళింట్లో అందరూ నన్ను "క్రిష్ణా " అని పిలిచే వారు. చద్దెన్నంలో అత్తయ్య దోసకాయ పప్పు కలుపుకుని తింటే నిజంగా స్వర్గమే. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇటువంటివి. ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దావిడ పేరు జగదాంబ. తర్వాత రమ, జయమ్మా. వాళ్ళని పెళ్లి చేసుకుందా మనుకున్నా గానీ వాళ్ళు నా కన్నా కొంచెం పెద్ద వాళ్ళు. నేను హైస్కూల్ పాస్ అయ్యే టప్పటికే  అందరికీ  పెళ్ళిళ్ళు అయిపోయాయి.

జగదాంబ వదిన అన్నా నాకు చాలా ఇష్టం . మేము రేపల్లి లో ఉన్నప్పుడు వాళ్ళు బేతపూడి లో ఉండే వారు. నేను సాయంత్రం సైకల్ వేసుకుని రేపల్లి నుండి వెళ్ళేవాడిని. వదినకి చిన్నప్పుడే పెళ్ళి కోసమని వంటా సంగీతం నేర్పారు. తాను నేర్చుకున్నవి వదిలిపెట్టకుండా పిల్లలకి కూడా నేర్పింది. అంతే కాదు ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకనే వాళ్ళ మామగారు పోయిన తరువాత ఆయన నిత్యార్చన చేసే విగ్రహాలు తీసుకుని రోజూ మడిగట్టుకుని నిత్యపూజలు చేసేది.

జగదాంబ వదినకు అప్పటికి ముగ్గురు అమ్మాయిలు, ప్రమీల, రాజాయ్, వసంత. జగదాంబ వదిన సంగీతం నేర్చుకుంది అని చెప్పాగదా. చక్కటి సన్నటి కంఠం కూడా. బాగా పాడుతుంది. అదే పిల్లలకి కూడా వచ్చింది. అసలు ఇంటి పేరులో "మంగళ" ఉంటే వారు సంగీత కళా నిధులు అవుతారు అనుకుంటాను. వాళ్ళింటి పేరు మంగళగిరి. ఇండియా వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి టేపు రికార్డర్ తీసుకు వెళ్ళేవాణ్ణి. రోజూ భోజనాలు చేసిన తర్వాత సంగీత విభావరి ఉండేది. అందరూ కలిసి పాడేవారు.

లలిత కళలు నేర్చుకునే వాళ్ళు రెండు రకాలు. నేర్చుకున్న కళల్ని ప్రదర్శించి ఇంకొకళ్ళని ఆనంద పరిచే వాళ్ళు, ఆ కళలని గుప్తంగా భద్రంగా దాచుకునే వాళ్ళు. మొదటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం.

వదినా పిల్లలూ మొదటి రకం. మొహమాటం లేకుండా చెబుతున్నాను నేను కూడా అంతే. నేను నేర్చుకున్న కళల్ని వద్దు బాబోయ్ అనే దాకా ప్రదర్శిస్తూ ఉంటాను. అంత దాకా రాదు అనుకోండి, ముందరే మా ఆవిడ వార్ణింగ్ సిగ్నల్ ఇస్తుంది  "ఇంక చాలు ఆపెయ్యండి" అని.

నాకు తెలుసు జగదాంబ వదిన తప్పకుండా పాట ఒకటి మొదలెడుతుందని, అనుకున్నట్లు గానే వదిన త్యాగరాయ కీర్తన అందుకుంది.

                     "పక్కాలా  నిలాబాడి  గొలిచే  ముచ్చటా
                      బాగా  తెల్పరాదా"

అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆ కంఠం వింటే అంతే మరి. పల్లవి పాడుతూ పిల్లల్ని అందుకోమని సైగ చేసింది.

ప్రమీల అనుపల్లవి అందుకుంది

                      "చుక్కాలా  రాయాని  గేరూ మోముగల
                       సుదతీ  సీతమ్మ సౌమీత్రీ  శ్రీరాముని  కిరు (పక్కాలా )"

తర్వాత చరణం రాజాయ్ అందుకుంది

                      "తనువూచే  వందనా  మొనరించు  చున్నారా
                       చనువున  నామ కీర్తనా సేయు చున్నారా"

తర్వాత తన చక్కటి కంఠం తో వసంత పాటని పూర్తి చేసింది

                       "మనసూ నా  దలచి మై  మరచి యున్నారా
                        నెనరుంచి  త్యాగరాజునితో  హరి హరి  మీరిరు (పక్కాలా )"

పాట చివరికి వచ్ఛే సరికి అందరి కంఠాలు కలిశాయి. ఆ అనుభూతిని చెప్పలేం. అది ఒక సిమ్ ఫొనీ.

మీకోసం త్యాగరాజు వ్రాసిన ఈ పాటకి అర్ధం, ఖరహరప్రియ రాగంలో  "చారులతా మణి" చక్కగా పాడిన ఆ కీర్తన, క్రింద ఇస్తున్నాను. విని ఆనందించండి.

పాటకి అర్ధం:
చంద్రుని వంటి మోము గల సీతమ్మా,
సుమిత్రకుమారుడివైన నీవు లక్ష్మణ,
శ్రీ రాముని కిరుపక్కలా నిలబడి ఏమని  కొలుస్తున్నారయ్యా ఆయన్ని?
ఎంత ముచ్చటగా ఉన్నారు మీరు
ఎలా  ఆరాధిస్తున్నా రాయన్ని
ఆయన నామ కీర్తన చేస్తూ  మైమరచి తన్మయత్వంతో  పరవశించి పోతున్నారా?
దయయుంచి ఆవిశేషాలన్నీ ఈ  త్యాగరాజుకి  చెప్పరా?


పక్కాలా  నిలబడి - చారులతా మణి


6 comments:

  1. చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందాన్నే కలగజేస్తాయి.

    ReplyDelete
    Replies
    1. sarma గారూ అంతేకదండీ మరి.మరపు రానివి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  2. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    పుట్టిన ఊరు, ఆ నేలా, గాలి, ఆ వాతావరణం, ఆ తిండీ, నీరూ, ఆ మనుషులు, అ మరువలేని మమతలు, ఆప్యాతలూ, నెరిపిన స్నేహాలూ, మరువలేని స్నేహితులు, తొలకరి వర్షానికి తడిసిన మట్టి వాసన.... ఇలా ఎన్నో, ఎన్నెన్నో జ్ఞాపకాలు తలచుకుంటే చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తాయి; ఎన్నో క్యాలరీల బలంకూడా వస్తుంది. చాలా బాగా గుర్తుచేసుకున్నారు. అన్నట్లు, ` కఠెవరం ' అంటే గుర్తుకువచ్చింది మా బావగారు తుళ్లూరి హరినాథ ప్రసాదుగారి వారి ఊరుకూడా కఠెవరమే. మీ కందరికీ ` విజయ దశమి ' శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    మీ స్నేహశీలి,
    మాధవరావు పబ్బరాజు.

    ReplyDelete
  3. అనుకోకుండా మరపురాని జ్ఞాపకాలు అలా బయటికి వస్తూ ఉంటాయి. మా కఠెవరము లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్ళెప్పుడూ గొప్పవాళ్ళ తోనే ఉంటారు. మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  4. మీ జ్ఞాపకాలు - సంగీత విభావరి విశేషాలు బహు కమ్మగా వున్నాయండి - మా నాన్నగారు చెప్పే కబుర్లలా. పంచుకున్నందుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  5. పూర్వకాలం ప్రతీ పెళ్ళి లోనూ, పెళ్ళి అయినా తర్వాత తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపేవారు. కొత్త పరిచయాలూ కొత్త పెళ్ళిళ్ళకు అంకురార్పణ జరిగేది. ఏమిటో కంప్యూటర్ పెళ్ళిళ్ళ తో కాలం మారిపోయింది. లలిత గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete